మరింత ముదిరిన అంపైర్స్ కాల్ నిర్ణయాల వివాదం... జో రూట్ అవుటైనా కూడా...
ఆస్ట్రేలియా టూర్లో భారత జట్టును అంపైర్స్ కాల్ నిర్ణయాలు వెంటాడాయి. వికెట్ల అంచుకి తాకినా అంపైర్స్ కాల్ కారణంగా నాటౌట్గా ప్రకటించడంపై మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూడా అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తాజాగా జో రూట్ విషయంలో ఇచ్చిన అంపైర్స్ కాల్ నిర్ణయం మరింత వివాదాస్పదమైంది..
మూడో రోజు అక్షర్ పటేల్ వేసిన ఆఖరి ఓవర్లో అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు జో రూట్. అక్షర్ పటేల్ బౌలింగ్లో షాట్ ఆడేందుకు ప్రయత్నించిన జో రూట్, బంతిని పూర్తిగా మిస్ అయ్యాడు. అంపైర్ అవుట్ ఇవ్వకపోవడంతో టీమిండియా రివ్యూ తీసుకుంది.
రిప్లైలో బంతి వికెట్లను స్పష్టంగా తగులుతున్నట్టు కనిపించినా అంపైర్ కాల్గా నాటౌట్గా ప్రకటించాడు థర్డ్ అంపైర్.
నిజానికి వికెట్ల అంచుకు తగిలితే, వికెట్ బెయిల్స్కి తాకినప్పుడు మాత్రమే అంపైర్స్ కాల్గా ప్రకటించాలి. కానీ స్పష్టంగా వికెట్కి తగులుతున్నట్టు ప్రకటించినా, థర్డ్ అంపైర్, జో రూట్ను నాటౌట్గా ప్రకటించడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ నిర్ణయంపై భారత సారథి విరాట్ కోహ్లీ, అంపైర్ వద్ద అసంతృప్తి వ్యక్తం చేయగా... డ్రెస్సింగ్ రూమ్లో భారత హెడ్ కోచ్ రవిశాస్త్రి ఆశ్చర్యం, అసహనం వ్యక్తం చేయడం స్పష్టంగా కనిపించింది.
అంపైర్స్ కాల్ నిర్ణయం వల్ల భారత కెప్టెన్ కోహ్లీ అవుట్ కాగా, ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.