కుర్రాళ్లు నేర్చుకోవడానికి కాస్త సమయం ఇవ్వాలి... - రాహుల్ ద్రావిడ్ కామెంట్...
రాహుల్ ద్రావిడ్ హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత టీమిండియా విజయాలు అందుకోవడానికి తెగ కష్టపడుతోంది. న్యూజిలాండ్లో, ఆ తర్వాత బంగ్లాదేశ్లో వన్డే సిరీస్లు ఓడిపోయిన టీమిండియా... తాజాగా శ్రీలంకపై టీ20 మ్యాచ్ ఓడింది...

Image credit: Getty
స్వదేశంలో శ్రీలంకపై వరుసగా 11 టీ20 మ్యాచుల్లో విజయాలు అందుకున్న టీమిండియాకి 12వ మ్యాచ్లో పరాజయం ఎదురైంది. రవిశాస్త్రి హయాంలో లంకను చిత్తు చేసిన భారత జట్టుకి ద్రావిడ్ హయాంలో షాక్ తగిలింది...
ప్రతీ ఆటలో గెలుపోటములు సహజం. అయితే రెండో టీ20లో టీమిండియా ఓడిన విధానంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. బ్యాటింగ్కి అనుకూలిస్తున్న పిచ్పై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడమే పెద్ద పొరపాటు అనుకుంటే బౌలర్లు ఏకంగా 7 నో బాల్స్ వేసి, టీమిండియాకి విజయాన్ని దూరం చేశారు..
Image credit: PTI
లంక బౌలర్లు 20 ఓవర్లలో ఒక్క నో బాల్ కూడా వేయలేదు. అదే సమయంలో భారత బౌలర్ అర్ష్దీప్ సింగ్ ఒక్కడే తాను వేసిన 2 ఓవర్లలో 5 నో బాల్స్ వేశాడు. ఫ్రీ హిట్స్తో కలిసి నో బాల్స్ కారణంగా లంక స్కోరులో 30 పరుగులు అదనంగా చేరాయి...
‘ఏ బౌలర్ కూడా కావాలని వైడ్లు, నో బాల్స్ వేయడు. టీ20ల్లో నో బాల్స్ వేస్తే ఎంత నష్టం జరుగుతుందో అందరికీ తెలుసు. అయితే వాళ్లు ఇంకా కుర్రాళ్లే. భారత జట్టులో చాలామంది కుర్రాళ్లు ఉన్నారు... ముఖ్యంగా బౌలింగ్లో టీమిండియాకి పెద్దగా అనుభవం లేదు...
ఇలాంటి గేమ్స్ వల్ల వారికి కావాల్సినంత అనుభవం దొరుకుతుంది. ఏం చేయాలి? ఏం చేయకూడదనే విషయాలు తెలుసుకుంటారు. కాస్త ఓపికగా ఉండాలి. ఇలాంటి సమయాల్లో వారికి మన సపోర్ట్ కావాలి...
టాలెంట్ లేకపోతే భారత జట్టు తరుపున ఆడే అవకాశం దక్కించుకోలేరు. కొన్నిసార్లు తప్పులు జరుగుతాయి. వాటిని సరిదిద్దుకునేందుకు మరో అవకాశం ఇవ్వాలి. అంతర్జాతీయ క్రికెట్లో చేసిన తప్పులు మళ్లీ చేయకూడదు..
వన్డే వరల్డ్ కప్, వరల్ట్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ని దృష్టిలో పెట్టుకుని టీమ్ని తయారుచేస్తున్నాం. కనీసం టీ20ల్లో అయినా కుర్రాళ్లకు అవకాశాలు ఇస్తే వాళ్లు కొత్త విషయాలు తెలుసుకోవడానికి అవకాశం దొరుకుతుంది...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్..