ఆసియా కప్లో అదే హైలైట్.. కోహ్లీపై టీమిండియా మాజీ బ్యాటర్ ప్రశంసలు
Virat kohli: యూఏఈ వేదికగా ముగిసిన ఆసియా కప్-2022 ను లంక గెలుచుకుంది. ఫైనల్లో పాకిస్తాన్ చిత్తయ్యింది. అయితే ఈ ట్రోఫీలో హైలైట్ మాత్రం...

గతనెల ఆగస్టు 27న యూఏఈ వేదికగా ప్రారంభమైన ఆసియా కప్.. ఆదివారం (సెప్టెంబర్ 11)న ముగిసింది. కీలకమైన ఫైనల్ పోరులో శ్రీలంక చేతిలో పాకిస్తాన్ చిత్తుగా ఓడింది. అయితే ఈ మెగా టోర్నీలో భారత జట్టు సూపర్-4లోనే నిష్క్రమించింది. టైటిల్ ఫేవరేట్ గా బరిలోకి దిగిన టీమిండియా.. ఆ ఆశలు నెరవేర్చుకోవడంలో విఫలమైంది.
అయితే ఈ టోర్నీలో బెస్ట్ మూమెంట్ మాత్రం విరాట్ కోహ్లీ సెంచరీయే అంటున్నాడు భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్. మూడేండ్ల తర్వాత సెంచరీ చేసిన అతడు.. సచిన్ టెండూల్కర్ తర్వాత అత్యధిక సెంచరీలు చేసిన రెండో క్రికెటర్ గా రికీ పాంటింగ్ తో సమానంగా నిలిచాడు.
ఆఫ్గాన్ తో మ్యాచ్ లో కోహ్లీ.. 61 బంతుల్లోనే 122 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్ లో 12 ఫోర్లు, 6 సిక్సర్లున్నాయి. టీ20లలో కోహ్లీకి ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. కెఎల్ రాహుల్ (62) తో కలిసి తొలి వికెట్ కు119 పరుగులు జోడించాడు కోహ్లీ.
తాజాగా వసీం జాఫర్ స్పందిస్తూ.. ‘ఈ మెగా టోర్నీలో ఆఫ్గానిస్తాన్ పై విరాట్ కోహ్లీ చేసిన సెంచరీయే బెస్ట్ మూమెంట్. ప్రత్యేకించి నాకైతే అదే ఫేవరైట్ మూమెంట్. ఆ సెంచరీ మూడేండ్ల తర్వాత వచ్చింది.
భారత్ తో పాట ప్రపంచ క్రికెట్ అభిమానులు మొత్తం ఆ సెంచరీ కోసం వేచి చూశారు. అన్నింటికంటే ముఖ్యం ఆ మ్యాచ్ లో మునపటి కోహ్లీనీ చూశాం. అతడి ఆటే ఈ టోర్నీకే హైలైట్ గా నిలిచింది...’ అని జాఫర్ అన్నాడు.
ఈ మెగా టోర్నీలో కోహ్లీ.. 5 మ్యాచుల్లో 92 సగటుతో 276 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ కూడా ఉంది. కోహ్లీ కంటే మహ్మద్ రిజ్వాన్ ముందున్నాడు. రిజ్వాన్.. 6 మ్యాచుల్లో 281 పరుగులతో టాప్ స్కోరర్ గా ఉన్నాడు. రిజ్వాన్ మూడు హాఫ్ సెంచరీలు చేశాడు.