Ind Vs Nz: నలుగురు క్రికెటర్లు.. రెండు పేర్లు.. వావ్.. వాట్ ఆన్ ఐడియా సర్ జీ.. ఫోటో తీసింది ఎవరో తెలుసా..?
India Vs New Zealand: టీమిండియా స్పిన్నర్లిద్దరి పేర్లు మ్యాచ్ అయ్యేలా ఆఫ్ స్పిన్ మాంత్రికుడు సూపర్ స్కెచ్ వేశాడు. కివీస్ కు చెందిన స్పిన్ ద్వయం.. అజాజ్, రచిన్ తో కలిసి అక్షర్, జడేజాలను క్లిక్ మనిపించాడు.
టీ20 ప్రపంచకప్ ఫైనల్స్ తర్వాత మూడు రోజులకే భారత పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్ కు రెండు ఫార్మాట్లలోనూ చుక్కెదురైంది. టీ20 సిరీస్ ఓడిన కివీస్ జట్టు.. టెస్టు సిరీస్ కూడా కోల్పోయింది. కాన్పూర్ టెస్టు లో ఆఖరు వికెట్ తో ఎలాగోలా గట్టెక్కిన న్యూజిలాండ్.. ముంబై టెస్టులో కనీస పోరాటం కూడా చేయలేదు.
ఈ టెస్టులో భారత బ్యాట్స్మెన్ వికెట్లు కోల్పోయింది కూడా భారత సంతతి కివీస్ బౌలర్లకే. వాళ్లే కివీస్ స్పిన్నర్లు అజాజ్ పటేల్, రచిన్ రవీంద్ర. ముంబై టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో పర్ఫెక్ట్ పది తో భారత్ ను ఆలౌట్ చేసిన అజాజ్.. రెండో ఇన్నింగ్స్ లో 4 వికెట్లు పడగొట్టాడు. ఇక రచిన్ రవీంద్ర.. రెండో ఇన్నింగ్స్ లో 3 వికెట్లు తీశాడు.
ఇదిలాఉండగా.. మ్యాచ్ అనంతరం భారత స్పిన్నర్లు, కివీస్ స్పిన్ ద్వయం కలిసి దిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భారత స్పిన్నర్లు.. అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా లు.. అజాజ్ పటేల్, రచిన్ తో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు.
ఈ నలుగురు క్రికెటర్లు కలిసి ఆ నలుగురి పేర్లు కలిసేలా వరుస క్రమంలో నిలుచున్నారు. ముందుగా అక్షర్, ఆ తర్వాత అజాజ్ పటేల్.. ఆ వెంటనే రచిన్ రవీంద్ర నిల్చోగా.. చివర్లో జడేజా నిల్చున్నాడు. దీంతో వెనుకనుంచి వీళ్ల జెర్సీలను బట్టి.. అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా అనే పేర్లు వచ్చాయి.
ఈ ఫోటో ఐడియా ఎవరిదో తెలుసా..? ఇంకెవరు.. మన టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ది. మ్యాచ్ అనంతరం ఫోటో సెషన్లతో పాటు బాగా ఆడిన ఆటగాళ్లను ఇంటర్వ్యూ చేయడంలో అశ్విన్ దిట్ట. ముంబై టెస్టు ముగిసిన తర్వాత కూడా ఈ నలుగురిని వరుస క్రమంలో నిలబెట్టిన అశ్విన్.. ఈ ఫోటో క్లిక్ మనిపించాడు.
కాగా.. అశ్విన్ తీసిన ఈ నలుగురు క్రికెటర్లలో ముగ్గురు గుజరాతీయులే. అక్షర్ పటేల్, అజాజ్ పటేల్, రవీంద్ర జడేజా.. ఇక రచిన్ రవీంద్ర తల్లిదండ్రులు కర్నాటక వాస్తవ్యులు.
ముంబై టెస్టులో అజాజ్ మొత్తంగా 14 వికెట్లు పడగొట్టగా.. రచిన్ కూడా నాలుగు వికెట్లు తీశాడు. ఇక కాన్పూర్ టెస్టులో రచిన్ రవీంద్ర.. పట్టుదలతో ఆడి కివీస్ ను పరాజయాన్ని తప్పించాడు.
ముంబైలోనే పుట్టి తన ఎనిమిదో యేడు వరకు ఇక్కడే ఉన్న అజాజ్ పటేల్ కుటుంబం.. ఆ తర్వాత న్యూజిలాండ్ కు వలస వెళ్లింది. తాను పుట్టిన గడ్డపైనే అజాజ్ పటేల్.. ప్రత్యర్థి జట్టులో ఉండి పది వికెట్ల ప్రదర్శన చేయడం గమనార్హం. చరిత్రలో ఈ రికార్డు సాధించిన మూడో బౌలర్ అజాజ్ పటేలే.