టీ20 వరల్డ్ కప్ 2022 టీమ్ అనౌన్స్మెంట్కి డేట్ ఫిక్స్... భారత జట్టు ఇలాగే ఉండనుందా...
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ఇంకో రెండు నెలల సమయం మాత్రమే ఉంది. ఆసియా కప్ టోర్నీకి ముందు గాయపడిన భారత స్టార్ బౌలర్లు జస్ప్రిత్ బుమ్రా, హర్షల్ పటేల్ కోలుకోవడానికి తగినంత సమయం ఉంది. ఆసియా కప్ ముగిసిన నాలుగు రోజులకు టీ20 వరల్డ్ కప్ 2022 ఆడే భారత జట్టును ఖరారు చేయనుంది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు...
Image Credit: Getty Images
బుమ్రా, హర్షల్ పటేల్ లేకుండా ఆసియా కప్ 2022 టోర్నీలో బరిలో దిగుతున్న భారత జట్టు, ఈ టోర్నీ పర్ఫామెన్స్ ఆధారంగా టీ20 వరల్డ్ కప్ ఆడే జట్టును ఖరారు చేయనుంది. ముఖ్యంగా ఫామ్లో లేని సీనియర్లతో పాటు కొత్తగా జట్టులోకి వచ్చిన జూనియర్లకు కూడా తమ సత్తా నిరూపించుకోవడానికి ఆసియా కప్ టోర్నీయే వేదికగా మారనుంది...
ఆగస్టు 27న యూఏఈ వేదికగా ప్రారంభమయ్యే ఆసియా కప్ 2022 టోర్నీ, సెప్టెంబర్ 11న జరిగే ఫైనల్ మ్యాచ్తో ముగుస్తుంది. ఇది ముగిసిన నాలుగు రోజులకు సెప్టెంబర్ 15న ముంబైలో సమావేశమయ్యే బీసీసీఐ అధికారులు, టీ20 వరల్డ్ కప్ ఆడే జట్టును డిసైడ్ చేసి, ప్రకటించబోతున్నారు...
అక్టోబర్ 16 నుంచి ఆస్ట్రేలియాలో ప్రారంభమయ్యే టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి సెప్టెంబర్ 16లోగా జట్లను ప్రకటించాల్సిందిగా క్రికెట్ బోర్డులకు డెడ్లైన్ విధించింది ఐసీసీ. 15 మంది ప్లేయర్లు, సహాయక సిబ్బందితో కలిసి మొత్తంగా 30 మందిని ఐసీసీ వరల్డ్ కప్ కోసం ఆస్ట్రేలియాలో అడుగుపెట్టేందుకు అనుమతిస్తారు...
15 మంది ప్లేయర్లు, మరో 8 మంది సహాయక సిబ్బంది అధికారిక జట్టులో ఉంటే... మిగిలిన ఏడుగురు స్టాండ్ బై ప్లేయర్లు, నెట్ బౌలర్లుగా ఉంటారు. వీరితో పాటు కరోనా ఇంకా పూర్తిగా తొలిగిపోని కారణంగా విధిగా ఓ డాక్టర్ కూడా టీమ్తో పాటు ఆస్ట్రేలియాకి వెళ్లాల్సి ఉంటుందని సూచించింది ఐసీసీ...
టీ20 వరల్డ్ కప్ కోసం ప్రకటించిన 15 మంది ప్లేయర్లతోనే మ్యాచులు ఆడాల్సి ఉంటుంది. వీరిలో ఎవ్వరైనా గాయపడితే మెడికల్ రీజన్స్ చూపించి ఐసీసీ అనుమతితో స్టాండ్ బై ప్లేయర్లలో ఒకరిని రిప్లేస్ చేసుకోవచ్చు. దీంతో తుది 15 మందిలో ఉండే ప్లేయర్లే ఎక్కువ మ్యాచులు ఆడతారు...
బీసీసీఐ అధికారికంగా ప్రకటించకపోయినా టీ20 వరల్డ్ కప్ ఆడే జట్టుపై ఇప్పటికే టీమిండియా ఫ్యాన్స్కి ఓ క్లారిటీ వచ్చేసింది. శిఖర్ ధావన్, మహ్మద్ షమీలని పూర్తిగా టీ20లకు దూరంగా పెట్టిన బీసీసీఐ, రుతురాజ్ గైక్వాడ్, సంజూ శాంసన్, కుల్దీప్ యాదవ్ వంటి ప్లేయర్లను అప్పుడప్పుడూ మాత్రమే ఆడిస్తోంది. కాబట్టి వీరికి టీ20 వరల్డ్ కప్ టీమ్లో చోటు దక్కే అవకాశాలు చాలా తక్కువ...
కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, యజ్వేంద్ర చాహాల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రిత్ బుమ్రా, హర్షల్ పటేల్... ఇలా తుది 11 మంది ఆడే జట్టు ఉండే అవకాశాలే ఎక్కువ....
Image credit: Getty
వీరితో పాటు బీభత్సమైన ఫామ్లో ఉన్న దినేశ్ కార్తీక్, దీపక్ హుడా, అర్ష్దీప్ సింగ్లకు తుది 15 మంది ప్లేయర్లలో చోటు దక్కొచ్చు. అర్ష్దీప్ సింగ్ స్థానంలో ఆవేశ్ ఖాన్కి అవకాశం వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. దీపక్ చాహార్, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ వంటి ఆల్రౌండ్ బౌలర్లు స్టాండ్ బై ప్లేయర్లుగా ఉంటారని అంచనా వేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్..