రోహిత్, కోహ్లీల నుంచి గేమ్ ఎప్పుడో వెళ్లిపోయింది.. ఇకపై సూపర్ స్టార్లు వాళ్లే..
IPL 2023: టీమిండియా బ్యాటింగ్ కు గడిచిన దశాబ్దకాలంగా కవర్ పేజీ అయ్యారు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ. ధోని ప్రోత్సహించిన ఈ ఇద్దరూ ప్రస్తుతం కెరీర్ చరమాంకంలో ఉన్నారు.

సచిన్ టెండూల్కర్, ద్రావిడ్, సెహ్వాగ్ వంటి దిగ్గజాలు అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత భారత క్రికెట్ జట్టు బ్యాటింగ్ కు వెన్నెముకలా మారారు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ. భారత మాజీ జట్టు సారథి ధోని సారథ్యంలో ఈ ఇద్దరూ గత దశాబ్దకాలంగా భారత క్రికెట్ జట్టు బ్యాటింగ్ కు కవర్ పేజీ అయ్యారు.
ప్రస్తుతం 35 ఏండ్లు దాటిన ఈ ఇద్దరూ కెరీర్ చరమాంకంలో ఉన్నారని చెప్పక తప్పదు. కోహ్లీ సంగతి ఏమో గానీ రోహిత్ శర్మ అయితే భారత్ వేదికగా అక్టోబర్ లో జరుగబోయే వన్డే వరల్డ్ కప్ తర్వాత ఆడితే అది అతిశయోక్తే. ఫిట్నెస్, వయసు భారం రోహత్ కెరీర్ కొనసాగకపోవడానికి ప్రధాన కారణాలు.
Image credit: PTI
అయితే రోహిత్, కోహ్లీల ఆట ఎలా ఉన్నా ఈ ఇద్దరూ ఇక టీ20 గేమ్ కు ఏ మాత్రం అంబాసిడర్లు కాదని అంటున్నాడు భారత మాజీ క్రికెటర్ సాబా కరీం. ఇండియాలో కొత్త సూపర్ స్టార్లు పుట్టుకొస్తున్నారని, వారి రాకతో ఈ ఇద్దరూ గేమ్ నుంచి పక్కకు జరిగినట్టేనని అన్నాడు. గురువారం రాత్రి యశస్వి జైస్వాల్ ఇన్నింగ్స్ తర్వాత కరీం ట్విటర్ వేదికగా ఈ కామెంట్స్ చేశాడు.
కరీం మాట్లాడుతూ.. ‘యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్ వంటి ఆటగాళ్ల బ్యాటింగ్ చూస్తుంటే ఒక విషయం స్పష్టమవుతున్నది. ఈ గేమ్ లో రోహిత్, విరాట్ లు ఇక ఎంతమాత్రమూ అంబాసిడర్లు కాదు. గేమ్ వారి నుంచి మూవ్ అయింది..’అని ట్వీట్ చేయడమే గాక ప్రముఖ కామెంటేటర్ హర్షా బోగ్లేకు ట్యాగ్ చేశాడు.
ఈ సీజన్ లో యశస్వి జైస్వాల్ 12 మ్యాచ్ లలో 575 పరుగులు చేశాడు. ఐపీఎల్ లో గత రెండు సీజన్లలో మరీ గొప్ప ప్రదర్శనలు చేయకపోయినా ఈ ఏడాది మాత్రం అతడు ఆకాశమే హద్దుగా రెచ్చిపోతున్నాడు. ఐపీఎల్-16 లో ఇదివరకే ఓ సెంచరీ చేసిన జైస్వాల్.. కేకేఆర్ తో మ్యాచ్ లో రెండు పరుగులతో శతకం కోల్పోయినా ఫాస్టెస్ట్ ఫిఫ్టీ కొట్టి చరిత్ర సృష్టించాడు.
Image credit: PTI
సూర్యకుమార్ యాదవ్ విషయానికొస్తే.. సీజన్ ఆరంభంలో విఫలమైన అతడు తర్వాత ముంబై విజయాలలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సీజన్ లో ఇప్పటివరకు 12 మ్యాచ్ లలో 11 ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేసి 376 పరుగులు సాధించాడు.