రిటైర్మెంట్ ప్రకటించిన సన్రైజర్స్ హైదరాబాద్ వికెట్ కీపర్... టాలెంట్ ఉన్నా...
ఎంత టాలెంట్ ఉన్నా, ఆ టాలెంట్కి తగ్గ గుర్తింపు, గుర్తింపు పొందేందుకు అవకాశాలు రావాలంటే అదృష్టం ఉండాల్సిందే. అలా సత్తా ఉన్న సరైన గుర్తింపు పొందలేకపోయిన క్రికెటర్లలో నమాన్ ఓజా ఒకడు. టీమిండియా తరుపున ఒక వన్డే, ఒక టెస్టు మ్యాచ్ ఆడిన నమాన్ ఓజా, రెండు టీ20 మ్యాజుల్లో ప్రాతినిథ్యం వహించాడు
శ్రీలంకతో జరిగిన టెస్టు మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో 21, రెండో ఇన్నింగ్స్లో 35 పరుగులు చేసిన నమాన్ ఓజా మరో అవకాశం దక్కించుకోలేకపోయాడు. 37 ఏళ్ల నమాన్ ఓజా దేశవాళీ క్రికెట్లో అద్భుతంగా రాణించాడు.
రంజీ ట్రోఫీలో 7861 పరుగులు చేసిన ఓజా, అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్లలో ఒకడిగా ఉన్నాడు. వికెట్ కీపర్గా 351 మందిని పెవిలియన్ చేర్చిన ఓజా, 146 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో 9753 పరుగులు చేశాడు. ఇందులో 22 సెంచరీలు, 55 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
2016లో టైటిల్ గెలిచిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో సభ్యుడిగా ఉన్న ఓజా... 2012లో ఢిల్లీ డేర్డెవిల్స్ తరుపున ఆడుతూ డేవిడ్ వార్నర్తో కలిసి 189 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు. ఇప్పటికీ ఐపీఎల్ చరిత్రలో ఇదో రికార్డు భాగస్వామ్యం.
చివరిగా 2018లో ఐపీఎల్ ఆడిన నమాన్ ఓజా, ఆ తర్వాత అవకాశాలు దక్కించుకోలేకపోయాడు. మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ తరుపున ఆడిన నమాన్ ఓజా... క్రికెట్కి వీడ్కోలు పలుకుతున్నట్టు సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు.
‘అంతర్జాతీయ క్రికెట్కి, మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ దేశవాళీ ఫస్ట్ క్లాస్ క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాను. 20 ఏళ్ల ఫస్ట్ క్లాస్ కెరీర్లో ఎన్నో అనుభూతులు మిగిలాయి. ఇక వీడ్కోలు చెప్పాల్సిన సమయం వచ్చేసింది.
సుదీర్ఘమైన ఈ జర్నీ, నా జీవితంలో ఓ అద్భుతమైన ఘట్టం’ అంటూ పోస్టు చేశాడు నమాన్ ఓజా. ఐపీఎల్ కెరీర్లో 113 మ్యాచులు ఆడిన నమాన్ ఓజా, 6 హాఫ్ సెంచరీలతో 1554 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 94 నాటౌట్.