రోహిత్, విరాట్ ఇకనైనా తప్పుకుంటే మంచిది.. గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
టీమిండియా స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లపై దిగ్గజ సారథి సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ఇద్దరూ ఇకనైనా టెస్టుల నుంచి తప్పుకుంటే మంచిదంటూ వ్యాఖ్యానించాడు.

త్వరలో వెస్టిండీస్ టూర్ కు వెళ్లనున్న భారత జట్టు అక్కడ మొదలయ్యే రెండు టెస్టులతో ఈ పర్యటనను ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో ఆలిండియా సెలక్షన్ కమిటీ కొన్ని మార్పులను చేసింది. పుజారా, ఉమేశ్ యాదవ్ లను తప్పించి యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ముఖేశ్ కుమార్ లను ఎంపిక చేసింది.
భారత జట్టు ప్రకటనకంటే ముందే టీమిండియా సారథి రోహిత్ శర్మకు రెస్ట్ ఇస్తారని, అతడు వన్డేలు మాత్రమే ఆడతాడన్న వాదనలు వినిపించాయి. వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో రోహిత్ తో పాటు కోహ్లీకి కూడా రెస్ట్ ఇవ్వాలని చర్చ జరిగింది.
తాజాగా ఇదే విషయమై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్పందించాడు. రోహిత్, కోహ్లీలకు టెస్టులలో విశ్రాంతినిస్తే బాగుండేదని గవాస్కర్ కూడా అభిప్రాయపడ్డాడు. సెలక్టర్లు, టీమ్ మేనేజ్మెంట్ ఏదైనా ప్రయోగాలు చేయాలనుకున్నప్పుడు పెద్ద ప్లేయర్లను పక్కనబెట్టి ఇలాంటి సిరీస్ లలో చేయిస్తే బాగుండటుందన్నాడు.
గవాస్కర్ మాట్లాడుతూ.. ‘టీమిండియాకు ఎక్స్పరిమెంట్స్ చేయడానికి ఇదే బెస్ట్ టైమ్. భారత జట్టు ఏదైనా ప్రయోగాలు చేయాలని భావిస్తే అది వెస్టిండీస్ టూర్ తోనే సాధ్యం. యువ ఆటగాళ్లను ఇక్కడ భాగా పరీక్షించవచ్చు. మనం ఎలాగూ డబ్ల్యూటీసీ ఫైనల్ ఓడిపోయాం. ఇక మనకు ఈ ఏడాది మిగిలుంది వన్డే వరల్డ్ కప్.
జట్టులో స్టార్ ప్లేయర్లకు ఈ టెస్టు సిరీస్ లో విశ్రాంతినిస్తే బాగుండేది. విరాట్, రోహిత్ వంటివాళ్లు పరిమిత ఓవర్ల క్రికెట్ కే పరిమితమైతే బాగుండేది. వాళ్లు రెడ్ బాల్ క్రికెట్ నుంచి తప్పుకుని యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించాలి. సీనియర్ పేసర్ మహ్మద్ షమీకి రెస్ట్ ఇచ్చారు. షమీతో పాటు విరాట్, రోహిత్ లకు కూడా దానిని వర్తింపజేస్తే బాగుండేది.
జూన్ 11న డబ్ల్యూటీసీ ఫైనల్ ముగిసింది. జులై 12 నుంచి విండీస్ తో టెస్టు సిరీస్ ఉంది. మధ్యలో గ్యాప్ నెల రోజులు ఉంది. విండీస్ తో టెస్టు సిరీస్ కు వీళ్లిద్దరూ లేకున్నా పెద్ద నష్టమేమీ జరుగకపోవచ్చు. ఈ ఇద్దరినీ నేరుగా వన్డేలకు తీసుకొస్తే విశ్రాంతి మరో పది రోజులు పెరిగినట్టు ఉండేది. నలభై రోజుల విరామం తర్వాత వారిని ఆడిస్తే అది వారికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉండేది’ అని చెప్పాడు.