టీ20 వరల్డ్కప్కి ముందు ఆస్ట్రేలియాకి భారీ షాక్... ఆ స్టార్ క్రికెటర్ దూరం...
టీ20 వరల్డ్కప్కి ముందు ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకి ఊహించని షాక్ ఇచ్చాడు ఆ జట్టు స్టార్ బ్యాట్స్మెన్ స్టీవ్ స్మిత్. టీ20 వరల్డ్కప్ తర్వాత జరిగే యాషెస్ సిరీస్కి అందుబాటులో ఉండేందుకు, అవసరమైతే టీ20 వరల్డ్కప్ నుంచి తప్పుకోవడానికి సిద్ధమేనంటూ ప్రకటించాడు స్మిత్...
ఒకప్పుడు క్రికెట్ ప్రపంచంలో తిరుగులేని ఆధిపత్యాన్ని చూపించిన జట్టు ఆస్ట్రేలియా. అత్యధికంగా ఐదు సార్లు వన్డే వరల్డ్కప్ గెలిచిన ఆస్ట్రేలియా, ఇప్పటిదాకా టీ20 వరల్డ్కప్ మాత్రం కైవసం చేసుకోలేకపోయింది...
2010 టీ20 వరల్డ్కప్ ఫైనల్లో ఇంగ్లాండ్ చేతుల్లో ఓడిన ఆస్ట్రేలియా, 2007, 2012 సీజన్లలో సెమీ ఫైనల్స్లో ఓడింది. 2009, 2014, 2016 సీజన్లలో అయితే కనీసం సెమీస్కి కూడా అర్హత సాధించలేకపోయింది...
టెస్టుల్లో టాప్ బ్యాట్స్మెన్గా కొనసాగుతున్న స్టీవ్ స్మిత్, వన్డే, టీ20ల్లో మాత్రం ఆ రేంజ్లో రాణించలేకపోతున్నాడు. దీంతో టీ20 వరల్డ్కప్ టోర్నీకి దూరంగా ఉండి, యాషెస్ సిరీస్కి అందుబాటులో ఉండాలని నిర్ణయించుకుంటున్నట్టు తెలిపాడు స్టీవ్ స్మిత్...
‘టీ20 వరల్డ్కప్కి ఇంకా సమయం ఉంది. నాకు వరల్డ్కప్ ఆడాలని ఉంది, టీ20 వరల్డ్కప్ ఆడడం ఎవ్వరైనా ఇష్టమే. కానీ నా మెయిన్ గోల్ ఎప్పుడూ టెస్టు క్రికెట్.
అందుకే యాషెస్ సిరీస్కి పూర్తి ఫిట్గా అందుబాటులో అవసరమైతే టీ20 వరల్డ్కప్కి దూరమయ్యేందుకు కూడా నేను సిద్ధమే... నేను టెస్టుల్లో చూపించినంత ఇంపాక్ట్, టీ20ల్లో చూపించలేకపోతున్నా. అందుకే నా అవసరం ఎక్కడుందో అక్కడే ఉండాలని నిర్ణయిచుకున్నా’ అంటూ ప్రకటించాడు స్టీవ్ స్మిత్...
బాల్ టాంపరింగ్ వివాదం కారణంగా నిషేధానికి గురైన స్టీవ్ స్మిత్, బ్యాన్ తర్వాత యాషెస్ సిరీస్లో అదరగొట్టాడు. 110.57 సగటుతో రెండు భారీ సెంచరీలతో 774 పరుగులు చేసి ఘనంగా రీఎంట్రీ ఇచ్చాడు.
ఐపీఎల్ 2021 సీజన్లో ఫస్టాఫ్లో పెయిన్ కిల్లర్లు వేసుకుని మరీ బ్యాటింగ్ చేసిన స్టీవ్ స్మిత్, ఎడమ చేతి మణికట్టు గాయంతో గత ఏడాదికాలంగా బాధపడుతున్నాడు...
ఐపీఎల్ 2021 సీజన్లో మిగిలిన మ్యాచుల్లో పాల్గొనేందుకు ఆస్ట్రేలియా క్రికెటర్లు ఆసక్తిగా ఉన్నారు. అయితే టీ20 వరల్డ్కప్కి ముందు జరిగే ఈ టోర్నీ సమయంలోనే బంగ్లా, ఆఫ్ఘాన్లతో ఓ ట్రై సిరీస్ ఆడాలని భావిస్తోంది ఆసీస్...
ఈ సిరీస్ నుంచి రెస్టు కావాలని చాలామంది ఆస్ట్రేలియా క్రికెటర్లు కోరడం, వారిలో చాలామంది ఐపీఎల్లో పాల్గొనాలని నిర్ణయించుకోవడం హాట్ టాపిక్ అయ్యింది.
దేశానికి ఆడకుండా, ఐపీఎల్ ఆడాలని నిర్ణయించుకుంటే వారిని టీ20 వరల్డ్కప్కి ఎంపిక చేయబోమని ఆసీస్ వన్డే, టీ20 కెప్టెన్ ఆరోన్ ఫించ్ హెచ్చరించాడు. ఆసీస్ మాజీ క్రికెటర్ షేన్ వార్న్ కూడా దేశం కంటే ఐపీఎల్కి ప్రాధాన్యం ఇచ్చేవాళ్లని జట్టుకి ఎంపిక చేయవద్దని సూచించాడు.