- Home
- Sports
- Cricket
- డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులోకి ఇండియా, పాకిస్తాన్... ఆస్ట్రేలియాకి కీలకంగా మారిన భారత్ టూర్...
డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులోకి ఇండియా, పాకిస్తాన్... ఆస్ట్రేలియాకి కీలకంగా మారిన భారత్ టూర్...
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో భారత్, పాకిస్తాన్ జట్లు తలబడబోతున్నాయా? ఇప్పుడు క్రికెట్ ఫ్యాన్స్ని ఉత్కంఠ రేకెత్తిస్తున్న విషయం ఇదే. టేబుల్ టాపర్ ఆస్ట్రేలియాని చిత్తుగా ఓడించిన శ్రీలంక, డబ్ల్యూటీసీ 2021-23 ఫైనల్ రేసుని అత్యంత ఆసక్తికరంగా మార్చేసింది...

ఐసీసీ టోర్నీల కారణంగా ఏడాదికో, రెండేళ్లకో ఓసారి భారత్, పాకిస్తాన్ల మధ్య వైట్ బాల్ మ్యాచులు చూసే అవకాశం దొరికింది. ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న తర్వాత ఐసీసీ టోర్నీల్లో మాత్రమే తలబడుతున్నాయి భారత్, పాకిస్తాన్...
ఇరుదేశాల మధ్య టెస్టు మ్యాచ్ జరిగి 15 ఏళ్లు ముగిసి పోయాయి. చివరిగా 2007 డిసెంబర్ 8న భారత్, పాకిస్తాన్ మధ్య టెస్టు మ్యాచ్ జరిగింది. దీంతో ఇరుదేశాల మధ్య ఓ టెస్టు మ్యాచ్ చూసే అవకాశం ఎప్పుడు వస్తుందా... అని ఎదురుచూస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్...
Dinesh Chandimal
శ్రీలంక పర్యటనలో మొదటి టెస్టులో 10 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకున్న ఆస్ట్రేలియా, రెండో టెస్టులో ఇన్నింగ్స్ తేడాతో ఓడింది. కొత్త కుర్రాడు ప్రభాత్ జయసూర్య రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి 12 వికెట్లు తీసి ఆసీస్ను దెబ్బతీశాడు...
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2021-23 సీజన్లో ఆస్ట్రేలియాకి ఎదురైన తొలి పరాజయం ఇదే. ఈ మ్యాచ్ గెలిచి ఉంటే ఆస్ట్రేలియా 80+ విజయాల శాతంతో ఫైనల్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకునేది... అయితే ఇప్పుడు ఆసీస్కి భారత పర్యటనలో ఆడే టెస్టు సిరీస్ కీలకంగా మారింది...
వచ్చే సీజన్లో సౌతాఫ్రికాతో స్వదేశంలో 3 టెస్టులు, వెస్టిండీస్తో 2 టెస్టు మ్యాచులు ఆడనుంది ఆస్ట్రేలియా. స్వదేశంలో ఇంగ్లాండ్ను యాషెస్ సిరీస్లో 4-0 తేడాతో చిత్తు చేసిన ఆసీస్కి ఈ రెండు జట్లను స్వదేశంలో ఓడించడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు... అయితే సౌతాఫ్రికా ఉన్న ఫామ్లో వారిని ఓడించడం అంత తేలికయ్యే పనేం కాదు..
2023 ఫిబ్రవరిలో భారత పర్యటనకు వచ్చే ఆస్ట్రేలియా 4 టెస్టు మ్యాచులు ఆడనుంది. భారత్లో, భారత్ని ఓడించి టెస్టు సిరీస్ గెలవగలిగితే ఏ జట్టుతో సంబంధం లేకుండా ఫైనల్ చేరుకుంటుంది ఆస్ట్రేలియా. ఒకవేళ భారత జట్టు, ఆసీస్ని ఆడుకుంటే మాత్రం ఫైనల్లో భారత్, పాకిస్తాన్ల తలబడేందుకు ఆస్కారం ఉంటుంది...
న్యూజిలాండ్ని స్వదేశంలో 1-0 తేడాతో ఓడించిన టీమిండియా, శ్రీలంకపై టెస్టు సిరీస్ను 2-0 తేడాతో గెలిచింది. ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ని 2-2 తేడాతో డ్రా చేసుకున్న భారత జట్టు, సౌతాఫ్రికా టూర్లో టెస్టు సిరీస్ని 2-1 తేడాతో ఓడింది...
ఈ ఏడాది చివర్లో బంగ్లాదేశ్ పర్యటనలో 2 టెస్టులు ఆడే టీమిండియా, ఆ తర్వాత ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ఆడుతుంది. ఈ రెండు సిరీస్లను సొంతం చేసుకుంటే భారత జట్టుకి ఫైనల్ చేరేందుకు అవకాశాలు మెండుగా ఉంటాయి...
ఆస్ట్రేలియా చేతుల్లో 0-1 తేడాతో టెస్టు సిరీస్ ఓడిన పాకిస్తాన్, బంగ్లాదేశ్పై 0-2 తేడాతో టెస్టు సిరీస్ గెలిచింది. వెస్టిండీస్పై 1-1 తేడాతో సిరీస్ డ్రా చేసుకున్న పాక్, శ్రీలంకతో 2 టెస్టులు, ఇంగ్లాండ్తో మూడు టెస్టులు, న్యూజిలాండ్తో టెస్టు మ్యాచులు ఆడాల్సి ఉంది... ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉన్న పాకిస్తాన్, వీటిల్లో విజయాలు సాధిస్తే... ఫైనల్కి చేరుకునే అవకాశం ఉంటుంది...
టేబుల్ టాపర్గా ఉన్న ఆస్ట్రేలియా, తర్వాతి స్థానంలో ఉన్న సౌతాఫ్రికా ఫైనల్ చేరే అవకాశాలు 60 శాతానికి పైగా ఉంటే... ఫైనల్లో భారత్, పాకిస్తాన్ తలబడే అవకాశం 20 శాతం కంటే తక్కువే. అయితే దాయాదులు టెస్టు మ్యాచ్లో అదీ డబ్ల్యూటీసీ ఫైనల్లో తలబడితే చూడాలని కోరుకుంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్..