- Home
- Sports
- Cricket
- Ishant Sharma: ఇషాంత్ శర్మతో పాటు ఆ ఇద్దరు సీనియర్లకు సౌతాఫ్రికా పర్యటనే ఆఖరు సిరీస్ కానుందా..?
Ishant Sharma: ఇషాంత్ శర్మతో పాటు ఆ ఇద్దరు సీనియర్లకు సౌతాఫ్రికా పర్యటనే ఆఖరు సిరీస్ కానుందా..?
India Tour Of South Africa: భారత జట్టులోకి యువ ఆటగాళ్ల రాక.. సీనియర్ ఆటగాళ్లకు సంకటంగా మారింది. యువ క్రికెటర్ల జోరుతో పాటు సీనియర్ల ఫామ్ లేమి వారిని మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నది. ఈ క్రమంలో టీమిండియాలోని ముగ్గరు సీనియర్ల భవిష్యత్ దక్షిణాఫ్రికా పర్యటనలతో తేలిపోనుంది.

టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మకు సౌతాఫ్రికా పర్యటనే చివరిది కానున్నదా..? ఈ సిరీస్ లో విఫలమైతే ఇక ఇషాంత్ శర్మ కెరీర్ కు మంగళం పాడాల్సిందేనా..? అంటే అవుననే అంటున్నాయి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు వర్గాలు.
ఇప్పటికే ఇషాంత్ కు లెక్కకు మిక్కిలి అవకాశాలిచ్చిన బీసీసీఐ.. ఇక ఎంతమాత్రమూ సానుకూల వైఖరి చూపించేది లేదని కరాఖండీగా చెబుతున్నది. విరాట్ కోహ్లిని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడం.. అజింకా రహానే ను టెస్ట్ వైస్ కెప్టెన్సీ నుంచి తొలగించడం వంటి పరిణామాలు చూస్తే ఈ అనుమానం మరింత బలపడక మానదు.
త్వరలోనే టీమిండియా.. దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనున్నది. ఈ నెల 26 నుంచి అక్కడ మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా తొలి టెస్టు జరగాల్సి ఉంది. ఈ మేరకు ఇప్పటికే బీసీసీఐ.. జట్టును కూడా ప్రకటించింది. ఈ జట్టులో ఇషాంత్ శర్మ కూడా సభ్యుడు. అయితే ఇషాంత్ కు ఇదే ఆఖరు అవకాశంగా భావించి సెలెక్టర్లు అతడిని ఎంపిక చేశారని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి.
ఇదే విషయమై బీసీసీఐ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ‘భారత టెస్టు జట్టు వైస్ కెప్టెన్ గా రహానే తొలగింపు ఇషాంత్ కు ఒక స్పష్టమైన హెచ్చరిక. జట్టులో సీనియర్ ఆటగాడిగా ఇషాంత్ ఇంకా మెరుగ్గా రాణించాలి..’ అని హెచ్చరించాడు.
33 ఏండ్ల ఇషాంత్.. భారత జట్టు తరపున 105 టెస్టులు, 80 వన్డేలు ఆడాడు. టెస్టులలో 311 వికెట్లు తీశాడు. ఫాస్ట్ బౌలర్ అయిన ఇషాంత్.. స్వదేశంలో కంటే విదేశాల్లో బాగా రాణిస్తాడు. అయితే కొంతకాలంగా అతడు ఫిట్నెస్, ఫామ్ లేమితో కెరీర్ ను సంక్లిష్టం చేసుకుంటున్నాడు. అదీగాక యువ ఆటగాళ్లు మహ్మద్ సిరాజ్, శార్దుల్ ఠాకూర్ ల నుంచి ఇషాంత్ తీవ్ర పోటీ ఎదుర్కొంటున్నాడు.
దక్షిణాఫ్రికా పర్యటనకు ఇషాంత్ తో పాటు ఈ ఇద్దరూ ఎంపికయ్యారు. మరి ఆ సిరీస్ లో ఇషాంత్ కు అవకాశం వస్తుందో లేదో తెలియదు. ఈ నేపథ్యంలో ఇషాంత్ శర్మ కెరీర్ దాదాపు ముగిసినట్టేననే వార్తలు వినిపిస్తున్నాయి.
ఇషాంత్ శర్మ తో పాటు మరో ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు రహానే, పుజారాలకు కూడా దక్షిణాఫ్రికా సిరీసే కీలకమనే సదరు ప్రతినిధి తెలిపాడు. ఆయన మాట్లాడుతూ.. ‘ఇషాంత్ లాగే పుజారా విషయంలో కూడా ఇదే నిజం. పుజారా చాలాకాలంగా జట్టులో ఉన్నాడు. కానీ ప్రస్తుతం ఫామ్ లో లేడు. ఒక సీనియర్ ఆటగాడిగా అతడు రాణించాలని జట్టు కోరుకుంటున్నది.
ఒకవేళ వారు (రహానే, పుజారా) ఈ సిరీస్ లో అద్భుతంగా రాణిస్తేనే తమ టెస్టు కెరీర్ ను పొడిగించుకోగలరు..’ అని చెప్పాడు. దీని బట్టి చూస్తే ఇషాంత్ శర్మతో పాటు రహానే, పుజారాలకు కూడా దక్షిణాఫ్రికా సిరీసే ఆఖరుదని బీసీసీఐ చెప్పకనే చెప్పింది. మరి ఈ కీలక సిరీస్ లో సీనియన్ ఆటగాళ్లు రాణిస్తారా..? లేక ఫామ్ లేమితో తంటాలు పడుతూ కెరీర్ ప్రమాదంలోకి పడేసుకుంటారా..? అనేది మరో నెలరోజుల్లో తేలనుంది.