ఇక్కడ గెలవడం ఈజీయే, అసలైన ఛాలెంజ్ అక్కడే... సౌతాఫ్రికా టూర్లో విరాట్ సేన గెలిస్తే...
గత ఏడాది కాలంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ టూర్లలో అద్భుత విజయాలు అందుకున్న భారత జట్టు, స్వదేశంలో ఇంగ్లాండ్, న్యూజిలాండ్లను చిత్తు చేసి టెస్టు సిరీస్లు గెలిచింది. ముంబై టెస్టులో ఘన విజయంతో 1-0 తేడాతో టెస్టు సిరీస్ గెలిచింది టీమిండియా...
ఆస్ట్రేలియా టూర్ 2020-21లో 2-0 తేడాతో టెస్టు సిరీస్ గెలిచిన భారత జట్టు, ఆ తర్వాత స్వదేశంలో ఇంగ్లాండ్ జట్టును 3-1 తేడాతో చిత్తు చేసి, సిరీస్ కైవసం చేసుకుంది...
ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ చేతుల్లో ఓడిన భారత జట్టు, ఆ తర్వాత ఇంగ్లాండ్ టూర్లో నాలుగు టెస్టుల్లో 2-1 తేడాతో ఆధిక్యాన్ని సంపాదించింది...
కరోనా కేసుల కారణంగా వాయిదా పడిన ఐదో టెస్టు, వచ్చే ఏడాది జూన్లో జరగనుంది. ఒకవేళ ఆ మ్యాచ్లో టీమిండియా ఓడినా 2-2 తేడాతో టెస్టు సిరీస్ డ్రా చేసుకోగలుగుతుంది. డ్రా చేసుకుంటే 2-1 తేడాతో టెస్టు సిరీస్ గెలుస్తుంది...
అయితే అసలైన ఛాలెంజ్ సౌతాఫ్రికాలోనే ఎదురుకానుంది. టీమిండియా ఇప్పటిదాకా సౌతాఫ్రికా గడ్డపై టెస్టు సిరీస్ విజయాన్ని అందుకోలేకపోయింది...
1992 నుంచి ఇండియా, దక్షిణాఫ్రికా మధ్య టెస్టు సిరీస్లు జరుగుతున్నాయి. అయితే ఈ సిరీస్లలో దక్షిణాఫ్రికాకే ఆధిక్యం ఉంది.
భారత్, సౌతాఫ్రికా మధ్య జరిగిన 7 సార్లు దక్షిణాఫ్రికా జట్టు విజయాన్ని అందుకోగా, 4 సార్లు భారత జట్టుకి సిరీస్ విజయం దక్కింది. మూడు సిరీస్లు డ్రాలుగా ముగిశాయి...
2017-18 సౌతాఫ్రికా టూర్లో భారత జట్టు 2-1 తేడాతో సిరీస్ కోల్పోయింది. ఆ తర్వాత 2019-20 సీజన్లో స్వదేశంలో దక్షిణాఫ్రికాను 3-0 తేడాతో క్లీన్స్వీప్ చేసి ప్రతీకారం తీర్చుకున్నా, సఫారీ గడ్డపై టెస్టు సిరీస్ గెలవలేదనే లోటు అలాగే ఉండిపోయింది...
‘సౌతాఫ్రికా ఎప్పుడూ ఛాలెంజింగ్గానే ఉంటుంది. ఇంగ్లాండ్లో, ఆస్ట్రేలియాలో విజయాలు అందుకోగలిగాం. సౌతాఫ్రికాలో మాత్రం గత టూర్లో చేదు అనుభవం ఎదురైంది.
అక్కడి పరిస్థితులు ఎప్పుడూ కఠినంగానే ఉంటాయి. అయితే ఈసారి జట్టుగా విజయాలను అందుకోవాలని అనుకుంటున్నాం. మా స్థాయికి తగ్గట్టుగా ఆడి, సిరీస్ గెలుస్తామనే ఆశిస్తున్నా...’ అంటూ కామెంట్ చేశాడు విరాట్ కోహ్లీ...
డిసెంబర్ 17 నుంచి జరగాల్సిన దక్షిణాఫ్రికా టూర్ను డిసెంబర్ 26కి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. డిసెంబర్ 17న సఫారీ పర్యటనకు బయలుదేరి వెళ్లనుంది భారత జట్టు...
దక్షిణాఫ్రికాలో మూడు టెస్టులు, మూడు వన్డేలు ఆడుతుంది టీమిండియా. షెడ్యూల్ ప్రకారం నాలుగు టీ20 మ్యాచుల సిరీస్ కూడా ఆడాల్సి ఉన్నా, ఒమిక్రాన్ వేరియెంట్ కేసుల కారణంగా ఆ సిరీస్ను వాయిదా వేసింది బీసీసీఐ...