ధోనీని తీసుకోవడానికి సౌరవ్ గంగూలీ ఒప్పుకోలేదు, 10 రోజుల పాటు... టీమిండియా మాజీ సెలక్టర్ కామెంట్...
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, భారత క్రికెట్లో తన పేరిట ఓ ప్రత్యేకమైన ఛాప్టర్నే లిఖించుకున్నాడు. మోస్ట్ సక్సెస్ఫుల్ భారత కెప్టెన్గా, వికెట్ కీపర్గా నిలిచిన మహేంద్ర సింగ్ ధోనీని జట్టులోకి తీసుకోవడానికి మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఒప్పుకోలేదంటే నమ్ముతారా?
సౌరవ్ గంగూలీని జట్టులోకి తీసుకోవడానికి సౌరవ్ గంగూలీని 10 రోజుల పాటు బ్రతిమిలాడి, ఒప్పించాల్సి వచ్చిందని షాకింగ్ కామెంట్లు చేశాడు బీసీసీఐ మాజీ సెలక్టర్, మాజీ వికెట్ కీపర్ కిరణ్ మోరే.
‘2003 వన్డే వరల్డ్కప్ తర్వాత భారత జట్టుకి ఓ ఫుల్టైమ్ వికెట్ కీపర్ కావాలని భావించాం. అప్పటివరకూ రాహుల్ ద్రావిడ్ భారత జట్టుకి వికెట్ కీపర్గా వ్యవహారిస్తున్నాడు. అయితే ద్రావిడ్ ఫుల్టైం వికెట్ కీపర్ కాదు.
జట్టులో సరైన వికెట్ కీపర్ లేకపోవడంతో ద్రావిడ్ ఆ బాధ్యత తీసుకునేవాడు. అయితే అతనిపై భారం తగ్గించేందుకు ఓ యంగ్ వికెట్ కీపర్ కోసం వెతుకులాట మొదలెట్టాం. అప్పుడే ఓ మ్యాచ్లో ధోనీ బ్యాటింగ్ చూశా...
నాతో పాటు ఉండే ఓ ఎంప్లాయ్, మాహీ గురించి చెబితే ఆ మ్యాచ్కి వెళ్లా. మహేంద్ర సింగ్ ధోనీ బ్యాటింగ్ చూసి చాలా ఇంప్రెస్ అయ్యా. బౌలర్లపై విరుచుకుపడుతూ బౌండరీల మోత మోగించాడు.
నేను చూసిన ఆ మ్యాచ్లో మాహీ 130 పరుగులు చేశాడు. టీమ్ స్కోరు మొత్తం 170 పరుగులే. వికెట్ కీపింగ్లోనూ ఆ కుర్రాడు అదరగొడుతున్నాడు. భారత జట్టుకి కావాల్సిన వికెట్ కీపర్ ఇతనే అనిపించింది.
దులీప్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో ఈస్ట్ జోన్ టీమ్ తరుపున మహేంద్ర సింగ్ ధోనీని వికెట్ కీపింగ్ చేయిస్తే, టీమిండియాలోకి తీసుకోవడం చాలా ఈజీ అవుతుంది. అయితే ఫైనల్ మ్యాచ్లో ధోనీతో వికెట్ కీపింగ్ చేయించడానికి గంగూలీ ఒప్పుకోలేదు.
ఆ సమయంలో కోల్కత్తా జట్టుకి కూడా కెప్టెన్గా వ్యవహారిస్తున్నాడు సౌరవ్ గంగూలీ. 10 రోజుల పాటు బ్రతిమిలాడితే, ఎట్టకేలకు గంగూలీ ఒప్పుకున్నాడు. ఆ తర్వాతి నుంచే మాహీ ప్రభంజనం మొదలైంది...’ అంటూ చెప్పుకొచ్చాడు కిరణ్ మోరే.
మొదటి మ్యాచ్లో బంగ్లాదేశ్పై ఎంట్రీ ఇచ్చిన మహేంద్ర సింగ్ ధోనీ, తొలి బంతికే రనౌట్ రూపంలో అవుట్ అయ్యాడు. అయితే నాలుగో వన్డేలో పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో వన్డౌన్లో వచ్చి 148 పరుగులు చేశాడు.
ఆ ఇన్నింగ్స్ తర్వాత ధోనీకి విపరీతమైన క్రేజ్ వచ్చింది. భారత జట్టు పూర్తి స్థాయి వికెట్ కీపర్గా మారిన మహేంద్ర సింగ్ ధోనీ, ఆ తర్వాత సారథిగా బాధ్యతలు అందుకుని 2007 టీ20 వరల్డ్కప్ని అందించాడు.
ఆ తర్వాత మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో ఛాంపియన్స్ ట్రోఫీ, 2011 వన్డే వరల్డ్కప్, ఆసియా కప్ వంటి ఎన్నో టైటిల్స్ అందుకుంది భారత జట్టు...