స్మృతి మందాన స్టన్నింగ్ క్యాచ్... మిథాలీరాజ్ రికార్డు ఫీట్... మూడో వన్డేలో టీమిండియాకి...
ఇంగ్లాండ్తో జరుగుతున్న వన్డే సిరీస్లో భారత జట్టుకి ఊరట విజయం దక్కింది. మొదటి రెండు వన్డేల్లో ఓడిన భారత మహిళా జట్టు, మూడో జట్టులో 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బౌలర్లు అదరగొట్టగా, భారత కెప్టెన్ మిథాలీరాజ్ మరోసారి అజేయ హాఫ్ సెంచరీతో ఆదుకుంది...
సిరీస్లో తొలిసారి టాస్ గెలిచిన మిథాలీరాజ్, బౌలింగ్ ఎంచుకుంది. వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన ఈ మ్యాచ్ను 47 ఓవర్లకు కుదించారు అంపైర్లు. సరిగ్గా 47 ఓవర్లలో 219 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది ఇంగ్లాండ్...
హేతర్ నైట్ 46 పరుగులు చేయగా స్రీవర్ 49 పరుగులు చేసింది. 59 బంతుల్లో 5 ఫోర్లతో 49 పరుగులు చేసిన స్రీవర్ని స్మృతి మందాన, బౌండరీ లైన్ దగ్గర డైవ్ చేస్తూ కళ్లు చెదిరే క్యాచ్ అందుకుని పెవిలియన్ చేర్చడం విశేషం.
భారత బౌలర్లలో దీప్తి శర్మకు మూడు వికెట్లు దక్కగా, గోస్వామి, శిఖా పాండే, పూనమ్ యాదవ్, స్నేహ్ రాణా, హర్మన్ప్రీత్ తలా ఓ వికెట్ తీశారు...
లక్ష్యచేధనలో షెఫాలీ వర్మ 29 బంతుల్లో 3 ఫోర్లతో 19 పరుగులు చేయగా, స్మృతి మందాన 57 బంతుల్లో 8 ఫోర్లతో 49 పరుగులు చేసి అవుట్ అయ్యింది...
జెమీమా రోడ్రిగ్స్ 21 బంతులు ఆడి 4 పరుగులు చేసి మరోసారి తీవ్రంగా నిరాశపరిచింది. హర్మన్ప్రీత్ 38 బంతుల్లో 16, దీప్తి శర్మ 25 బంతుల్లో 18, స్నేహ్ రాణా 22 బంతుల్లో 24 పరుగులు చేసి కెప్టెన్ మిథాలీరాజ్కి సహకారం అందించారు.
ఓ వైపు వికెట్లు పడుతున్నా పట్టువదలకుండా బ్యాటింగ్ కొనసాగించిన మిథాలీరాజ్ 86 బంతుల్లో 8 ఫోర్లత 75 పరుగులు చేసి అజేయంగా నిలిచి టీమిండియాకి విజయాన్ని అందించింది...
ఈ వన్డే సిరీస్లో మిథాలీరాజ్కి ఇది హ్యాట్రిక్ హాఫ్ సెంచరీ కాగా, వుమెన్స్ క్రికెట్లో మూడు ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్వుమెన్గా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది టీమిండియా కెప్టెన్...
విజయవంతమైన చేధనలో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన మహిళా క్రికెటర్గా (18 సార్లు) నిలిచిన మిథాలీరాజ్... అంతర్జాతీయ క్రికెట్లో 10,273 పరుగులు చేసి ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ చెర్లోట్ ఎడ్వర్డ్స్ను అధిగమించింది...
పురుషుల క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉండగా, మహిళల క్రికెట్లో ‘లేడీ సచిన్’గా గుర్తింపు తెచ్చుకున్న మిథాలీరాజ్ వశమైంది. ఈ ఇద్దరూ 16 ఏళ్ల 205 రోజుల వయసులో టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వడం విశేషం.