ఆ రెండు కారణాల వల్లే ఇండియా నుంచి వచ్చేశాను... క్రికెటర్ స్మిత్ పటేల్ కామెంట్...
ఉన్ముక్త్ చంద్ కెప్టెన్సీలో 2012 అండర్ 19 వరల్డ్కప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్న క్రికెటర్ స్మిత్ పటేల్, టీమిండియాకి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. కరేబియన్ లీగ్లో పాల్గొనాలని తాను తీసుకున్న రెండే రెండు కారణాలున్నాయని అంటున్నాడు స్మిత్ పటేల్.
2012 అండర్ 19 ఫైనల్లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో అప్పటి కెప్టెన్ ఉన్ముక్త్ చంద్తో కలిసి 130 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పిన స్మిత్ పటేల్, 64 పరుగులతో అజేయంగా నిలిచి భారత జట్టును గెలిపించాడు.
అయితే ఆ ఇన్నింగ్స్ తర్వాత ఉన్ముక్త్ చంద్కి కానీ, స్మిత్ పటేల్కి కానీ టీమిండియా నుంచి పిలుపురాలేదు. ఉన్ముక్త్ చంద్, ఐపీఎల్లో అవకాశాల కోసం ఎదురుచూసి కనుమరుగు కాగా, స్మిత్ పటేల్ను ఐపీఎల్ ఫ్రాంఛైజీలు కూడా పట్టించుకోలేదు...
దాదాపు 8 ఏళ్లు అవకాశం కోసం ఆశగా ఎదురుచూస్తున్న భారత క్రికెటర్ స్మిత్ పటేల్, సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కరేబియన్ ప్రీమియర్ లీగ్లో పాల్గొనాలని నిర్ణయం తీసుకున్న స్మిత్ పటేల్, టీమిండియా దేశవాళీ క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించాడు.
అయితే స్మిత్ పటేల్ ఈ సంచలన నిర్ణయం తీసుకోవడానికి రెండే రెండు కారణాలు ఉన్నాయట. ‘భారత జట్టులో చోటు కోసం 8 ఏళ్లుగా ఎదురుచూస్తున్నా. కానీ నాకు తీవ్రమైన పోటీ కారణంగా నాకు ఒక్క అవకాశం కూడా రాలేదు.
మహేంద్ర సింగ్ ధోనీ ఆ ప్లేస్లో ఫిక్స్ అయిపోయాడు. ఆ తర్వాత దినేశ్ కార్తీక్, వృద్ధిమాన్ సాహాలాంటి వాళ్లు ఉన్నారు. ధోనీ రిటైర్మెంట్ తర్వాతైనా నాకు అవకాశం దక్కుతుందని ఆశించా... కానీ రిషబ్ పంత్, సంజూ శాంసన్ల రూపంలో యువ వికెట్ కీపర్లు వచ్చారు.
ఇక ఎన్నాళ్లు ఎదురుచూసినా నాకు అవకాశం రాదని తేలిపోయింది. అంతేకాదు మా అమ్మానాన్నలకు దూరంగా 11 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నా. ఇకనైనా వారితో కలిసి ఉండాలని యూఎస్కి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నా...’ అంటూ వివరించాడు స్మిత్ పటేల్.
‘అండర్ 19 వరల్డ్కప్లో భారత జట్టు తరుపున ఆడడం నా అదృష్టం. అయితే ఇక టీమిండియాకి రిటైర్మెంట్ ప్రకటించేశా. ఇప్పటికే బీసీసీఐతో దీనికి సంబంధించిన పేపర్ వర్క్ మొత్తం పూర్తయ్యింది. ఇక భారత్ తరుపున నా క్రికెట్ చాప్టర్ పూర్తయినట్టే. మళ్లీ టీమిండియాకి తిరిగి వస్తా. కాకపోతే క్రికెట్ ఆడడానికి కాదు, ట్రైయినింగ్ కోసం మాత్రమే. అమెరికాలో మంచు కురిసే సమయంలో ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేస్తా’ అంటూ ప్రకటించాడు స్మిత్ పటేల్.
ఫారిన్ లీగ్లో పాల్గొనే ప్లేయర్లకు ఐపీఎల్లో కానీ భారత జట్టు తరుపున ఆడే అవకాశం కానీ ఉండదు. దేశవాళీ లీగుల్లో కూడా వారికి చోటు ఉండదు. అయితే ఎంతగా ఎదురుచూసినా అవకాశం రాదని తెలిసినప్పుడు ఇంకా అక్కడే ఉండి, వెయిట్ చేయడం వేస్టని నిర్ణయించుకున్నాడు స్మిత్ పటేల్.
టీమిండియాకి రిటైర్మెంట్ ప్రకటించిన స్మిత్ పటేల్, కరేబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) 2021 సీజన్లో ఆడబోతున్నట్టు ప్రకటించాడు. అలాగే మేజర్ క్రికెట్ లీగ్ (ఎమ్ఎల్సీ), అమెరికన్ క్రికెట్ లీగ్లకు కూడా రిజిస్టర్ చేయించుకున్నాడు...
స్మిత్ పటేల్తో పాటు అతని కెప్టెన్ ఉన్ముక్త్ చంద్ కూడా విదేశీ లీగుల్లో పాల్గొనబోతున్నాడని టాక్ నడిచింది. అయితే అదేమీ లేదని కొట్టిపారేశాడు ఉన్ముక్త్.
భారత సీనియర్ స్పిన్నర్ ప్రవీణ్ తాంబే తర్వాత కరేబియన్ ప్రీమియర్ లీగ్లో పాల్గొనబోతున్న రెండో భారత క్రికెటర్ స్మిత్ పటేల్. విదేశీ క్రికెటర్ల కారణంగా ఐపీఎల్లో కూడా చోటు దక్కించుకోలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్న కొందరు రంజీ క్రికెటర్లు కూడా విదేశీ లీగ్ల వైపు ఆశగా చూస్తున్నట్టు సమచారం.