- Home
- Sports
- Cricket
- Shubman Gill: కోహ్లీ వల్ల కాలేదు.. గిల్ చేసి చూపించాడు.. బర్మింగ్హామ్లో మనోడి నయా హిస్టరీ !
Shubman Gill: కోహ్లీ వల్ల కాలేదు.. గిల్ చేసి చూపించాడు.. బర్మింగ్హామ్లో మనోడి నయా హిస్టరీ !
Shubman Gill : ఇంగ్లాండ్తో జరిగిన వన్డేలో కెప్టెన్ శుభ్మన్ గిల్ 80 రన్స్తో దుమ్మురేపాడు. బర్మింగ్హామ్ లో విరాట్ కోహ్లీ పేరిట ఉన్న బిగ్ రికార్డును బ్రేక్ చేశాడు. మరోసారి ఇంగ్లాండ్ పై అద్భుతమైన ఇన్నింగ్స్ తో తనదైన ముద్ర వేశాడు.

బర్మింగ్హామ్లో శుభ్మన్ గిల్ విశ్వరూపం.. టీమిండియా విక్టరీ
బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ మైదానంలో మంగళవారం జరిగిన మొదటి వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్ను 28 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్లో టీమిండియా వన్డే కెప్టెన్ శుభ్మన్ గిల్ కెప్టెన్సీ ఇన్నింగ్స్తో అదరగొట్టాడు. 75 బంతుల్లో 80 పరుగులు చేశాడు. గిల్ తన ఇన్నింగ్స్లో 11 ఫోర్లు, 1 సిక్స్ కొట్టాడు. అయితే మ్యాచ్ మధ్యలో కండరాల తిమ్మిరి రావడంతో గిల్ రిటైర్డ్ హర్ట్గా వెనుతిరిగాడు.
కోహ్లీ రికార్డు బద్దలు కొట్టిన గిల్
ఈ మ్యాచ్లో వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్తో కలిసి గిల్ మూడో వికెట్కు 103 బంతుల్లో 101 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఇందులో శ్రేయస్ అయ్యర్ 35 పరుగులు చేశాడు. 80 పరుగుల ఇన్నింగ్స్ ఆడే క్రమంలో గిల్.. విరాట్ కోహ్లీ పేరిట ఉన్న ఒక ప్రచండ రికార్డును బద్దలు కొట్టాడు. బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ మైదానంలో భారత కెప్టెన్గా అత్యధికంగా 510 పరుగులు చేసిన ఆటగాడిగా గిల్ చరిత్ర సృష్టించాడు. 2025 మే నెలలో టెస్ట్ కెప్టెన్గా, 2025 అక్టోబర్లో వన్డే కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన గిల్.. ఇంగ్లాండ్లోని ఒకే గ్రౌండ్ లో 500 పరుగులు చేసిన మొదటి భారతీయ కెప్టెన్గా నిలిచాడు.
255 యావరేజ్తో గిల్ విశ్వరూపం
గిల్ బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ మైదానంలో అన్ని ఫార్మాట్లలో కలిపి రెండు ఇంటర్నేషనల్ మ్యాచ్ల్లో (టెస్ట్, వన్డే) 255 అద్భుతమైన సగటుతో 510 పరుగులు చేశాడు. ఈ సమయంలో గిల్ రెండు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ చేశాడు. ఇక్కడ అతని బెస్ట్ స్కోరు 269 పరుగులు. ఇది అతను గత ఏడాది ఇంగ్లాండ్తో జరిగిన బర్మింగ్హామ్ టెస్టులో సాధించాడు.
బర్మింగ్హామ్ మైదానంలో అత్యధిక అంతర్జాతీయ పరుగులు చేసిన భారత కెప్టెన్లు వీరే
1. శుభ్మన్ గిల్ - 510 పరుగులు
2. విరాట్ కోహ్లీ - 469 పరుగులు
3. మహ్మద్ అజారుద్దీన్ - 322 పరుగులు
చరిత్ర సృష్టించిన ఏడో భారత కెప్టెన్
ఇంగ్లాండ్లోని ఒకే స్టేడియంలో భారత కెప్టెన్ చేసిన అత్యధిక పరుగుల రికార్డు ఇంతకుముందు విరాట్ కోహ్లీ పేరిట ఉండేది. కోహ్లీ ఎడ్జ్బాస్టన్లో భారత కెప్టెన్గా 5 మ్యాచ్లు ఆడి 6 ఇన్నింగ్స్ల్లో 469 పరుగులు చేశాడు. ఇప్పుడు గిల్ 510 పరుగులతో ఆ రికార్డును దాటేశాడు. దీంతో సునీల్ గవాస్కర్, మహ్మద్ అజారుద్దీన్, ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ, సౌరవ్ గంగూలీ, విరాట్ కోహ్లీ తర్వాత ఒకే గ్రౌండ్ లో 500 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన ఏడో భారతీయ కెప్టెన్గా గిల్ నిలిచాడు. కాగా, ఒకే స్టేడియంలో భారత కెప్టెన్ అత్యధిక పరుగులు చేసిన రికార్డు మహ్మద్ అజారుద్దీన్ పేరిట ఉంది. అజారుద్దీన్ 1990-1999 మధ్య షార్జా క్రికెట్ స్టేడియంలో కెప్టెన్గా 32 మ్యాచ్లు ఆడి 954 పరుగులు చేశాడు.
గిల్ జూలై 2025లో ఎడ్జ్బాస్టన్లో భారత కెప్టెన్గా తన మొదటి మ్యాచ్ ఆడాడు. ఆ టెస్ట్ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్ల్లో 269, 161 పరుగులు చేశాడు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే.. ఒకే గ్రౌండ్ లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్ రికార్డు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ అలన్ బోర్డర్ పేరిట ఉంది. ఆయన మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో కెప్టెన్గా 48 మ్యాచ్ల్లో 1,670 పరుగులు చేశాడు.

