- Home
- Sports
- Cricket
- అందరూ గాయాల పాలవుతున్నారు.. మరి సౌతాఫ్రికా టూర్ ను రద్దు చేద్దామా..? టీమిండియా మాజీ ఓపెనర్ ఆసక్తికర వ్యాఖ్యలు
అందరూ గాయాల పాలవుతున్నారు.. మరి సౌతాఫ్రికా టూర్ ను రద్దు చేద్దామా..? టీమిండియా మాజీ ఓపెనర్ ఆసక్తికర వ్యాఖ్యలు
Aakash Chopra: దక్షిణాఫ్రికా పర్యటనకు జట్టును ప్రకటించడానికి ముందే రవీంద్ర జడేజా, శుభమన్ గిల్, అక్షర్ పటేల్ వంటి ఆటగాళ్లు గాయాల బారిన పడి సిరీస్ నుంచి తప్పుకున్నారు. ఇక తాజాగా రోహిత్ శర్మ కూడా గాయంతో టెస్టులకు దూరమయ్యాడు.

టీమిండియా రేపో మాపో దక్షిణాఫ్రికాకు బయల్దేరాల్సి ఉంది. కీలక పర్యటనకు వెళ్లడానికి సరిగ్గా రెండ్రోజుల ముందు పరిమిత ఓవర్లలో భారత కెప్టెన్, టెస్టు జట్టు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ గాయం బారిన పడ్డాడు. అతడి స్థానంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) గుజరాతీ ఆటగాడు ప్రియాంక్ పాంచల్ ను ఎంపిక చేసింది.
అయితే వరుసగా కీలక ఆటగాళ్లంతా గాయాలపాలవుతుండటంతో ఈ సిరీస్ ను రద్దు చేస్తే మంచిదేమో..? అని టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.
ఇప్పటికే గాయాల కారణంగా రవీంద్ర జడేజా, శుభమన్ గిల్, అక్షర్ పటేల్, రాహుల్ చాహర్ లు సిరీస్ కు దూరం కాగా తాజాగా రోహిత్ శర్మకు కూడా గాయమవడంతో అతడు కూడా టెస్టు సిరీస్ నుంచి తప్పుకున్నాడు.
ఈ నేపథ్యంలో తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా స్పందించిన ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ... ‘ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అందుబాటులో లేదు. జడేజాతో పాటు అక్షర్ పటేల్, రాహుల్ చాహర్ ల పరిస్థితి అంతే.. శుభమన్ గిల్ కూడా గాయం కారణంగా సిరీస్ నుంచి తప్పుకున్నాడు. ఇక ఇప్పుడు రోహిత్ శర్మకు కూడా గాయమైంది.
అసలు టీమిండియాలో ఏం జరుగుతుంది..? దక్షిణాఫ్రికా టూర్ ను రద్దు చేద్దామా..? రోహిత్ శర్మ లేకపోవడమనేది భారత జట్టుకు భారీ ఎదురుదెబ్బ. ఈ ఏడాదిలో టెస్టులతో పాటు అన్ని ఫార్మాట్లలో అతడు బాగా రాణిస్తున్నాడు.
ఈ ఏడాది చెన్నైలో ఇంగ్లాండ్ తో జరిగిన టెస్టులో సెంచరీ చేసిన రోహిత్ శర్మ.. ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా జరిగిన టెస్టు సిరీస్ లో కూడా అద్భుతంగా రాణించాడు. ఓవల్ లో జరిగిన టెస్టులో సెంచరీ చేసి.. విదేశీ గడ్డ మీద సెంచరీ (టెస్టులలో) కూడా నమోదు చేశాడు.
పరిమిత ఓవర్ల క్రికెట్ లోనే కాదు.. ఈ మధ్య కాలంలో టెస్టులలో కూడా రోహిత్ అద్భుతంగా రాణిస్తున్నాడు. పవర్ హిట్టింగ్ నే కాదు.. బంతులు వదిలేయడాన్ని, డిఫెన్స్ ఆడటాన్ని కూడా రోహిత్ బాగా ఆస్వాదిస్తున్నాడు...’అని ఆకాశ్ చోప్రా తెలిపాడు.
ఓపెనర్ రోహిత్ శర్మ దూరం కావడంతో గాయాల సమస్యలే గాక టీమిండియాను ఓపెనింగ్ ప్రాబ్లమ్స్ కూడా వేధిస్తున్నాయని చోప్రా అన్నాడు. మూడో ఓపెనర్ కూడా ఉండటం భారత్ కు అత్యావశ్యకమని అభిప్రాయపడ్డాడు.
రోహిత్ తో పాటు కీలక ప్లేయర్లంతా దక్షిణాఫ్రికా సిరీస్ కు దూరంగా ఉంటుండటంతో అది భారత విజయావకాశాల మీద ప్రభావం చూపుతుందని చోప్రా అభిప్రాయపడ్డాడు. 1990 ల నుంచి దక్షిణాఫ్రికా కు టెస్టు సిరీస్ ఆడేందుకు వెళ్తున్న భారత్.. ఇంతవరకు అక్కడ సిరీస్ నెగ్గలేదు. అయితే ఈసారి ఆ జట్టు ఏమంత బలంగా లేదు. నలుగురైదుగురు ప్లేయర్లు తప్ప మిగతావారికి అంతర్జాతీయ స్థాయిలో ఆడిన అనుభవం తక్కువ.
ఈ నేపథ్యంలో సిరీస్ నెగ్గేందుకు భారత్ కు ఇది మంచి అవకాశమని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నా.. టీమిండియాలో గాయాల బెడద ఆందోళన కలిగిస్తున్నది. గాయాలతో పాటు వన్డే కెప్టెన్సీ వివాదం కూడా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల మధ్యనే గాక భారత క్రికెట్ లోనూ తీవ్ర చర్చనీయాంశమైంది.