బాబర్కు రెస్ట్.. పాకిస్తాన్కు కొత్త కెప్టెన్గా హెడ్కోచ్ అల్లుడు
PCB: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆ దేశ జాతీయ జట్టుకు కొత్త సారథిని నియమించింది. బాబర్ ఆజమ్ కు రెస్ట్ ఇచ్చింది.

పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు టీ20 ఫార్మాట్ లో కొత్త కెప్టెన్ వచ్చాడు. వర్క్ లోడ్ మేనేజ్మెంట్ లో భాగంగా ఆ జట్టు రెగ్యులర్ కెప్టెన్ బాబర్ ఆజమ్ కు రెస్ట్ ఇచ్చిన పీసీబీ.. కొత్త కెప్టెన్ గా హెడ్ కోచ్ సక్లయిన్ ముస్తాక్ అల్లుడు షాదాబ్ ఖాన్ ను నియమించింది. త్వరలో షార్జా వేదికగా అఫ్గానిస్తాన్ తో జరుగబోయే మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ కు షాదాబ్ సారథిగా వ్యవహరిస్తాడు.
బాబర్ ఆజమ్ ను గత కొంతకాలంగా టీ20 కెప్టెన్సీ నుంచి తప్పించాలని ఆ దేశ మాజీ క్రికెటర్లు కామెంట్స్ చేస్తున్న విషయం తెలిసిందే. టీ20లలో అతడి సగటు తక్కువగా ఉండటంతో పాటు వ్యక్తిగత రికార్డుల కోసమే ఆడతాడు తప్ప టీమ్ గురించి ఆలోచించడని అతడిపై విమర్శలున్నాయి.
ఈ నేపథ్యంలో బాబర్ పై వేటు తప్పదని భావిస్తుండగా షాదాబ్ ను సారథిగా నియమించడం గమనార్హం. టీ20 వరల్డ్ కప్ - 2024ను దృష్టిలో ఉంచుకుని కూడా ఈ ఎంపిక జరిగందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. షాదాబ్ ఖాన్ ను కేవలం అఫ్గానిస్తాన్ సిరీస్ వరకే పరిమితం చేస్తారా..? లేక తర్వాత కూడా కొనసాగిస్తారా..? అన్నది ఆసక్తికరంగా మారింది.
ఈ సిరీస్ కు పాకిస్తాన్ సీనియర్లు బాబర్ ఆజమ్ తో పాటు వికెట్ కీపర్ రిజ్వాన్, ఫకర్ జమాన్, హరీస్ రౌఫ్, షహీన్ షా అఫ్రిదికి కూడా రెస్ట్ ఇచ్చింది పీసీబీ. కొత్త జట్టులో సయీమ్ అయూబ్, తయ్యబ్ తాహిర్, జమాన్ ఖాన్, అబ్దుల్లా షఫీక్, ఆజమ్ ఖాన్ లకు పిలుపొచ్చింది.
అఫ్గానిస్తాన్ తో టీ20 సిరీస్ కు పాక్ జట్టు : షాదాబ్ ఖాన్ (కెప్టెన్), అబ్దుల్లా షఫీక్, ఆజం ఖాన్, ఫహీమ్ అష్రఫ్, ఇఫ్తికార్ అహ్మద్, ఇహ్సానుల్లా, ఇమాద్ వసీం, మహ్మద్ హరీస్, మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీం జూనియర్, నసీమ్ షా, సయీమ్ అయూబ్, షాన్ మసూద్, తయ్యబ్ తాహిర్, జమాన్ ఖాన్
కాగా ఈ సిరీస్ కోసం పాకిస్తాన్ దిగ్గజ క్రికెటర్ మహ్మద్ యూసుఫ్ ఆ జట్టుకు తాత్కాలిక బ్యాటింగ్ కోచ్ గా ఎంపికయ్యాడు. పాక్ - అఫ్గాన్ ల మధ్య మార్చి 25న తొలి టీ20, 27న రెండో మ్యాచ్, 29న మూడో టీ20 జరుగుతాయి.