మా మాజీ క్రికెటర్లు యూట్యూబ్ వ్యూస్ కోసం దిగజారుతున్నారు : పాక్ మాజీ సారథి షాకింగ్ కామెంట్స్
యూట్యూబ్ లో వ్యూస్, రేటింగ్స్ కోసం కొంతమంది మాజీ క్రికెటర్లు ఏది పడితే అది వాగడం, ఎవరిని పడితే వారిని ఇష్టారీతిన మాట్లాడటం చేస్తున్నారని.. అది దేశాన్ని కించపరుస్తుందే తప్ప ఏమాత్రం ఉపయోగం లేని ప్రక్రియ అని మాజీ కెప్టెన్ అన్నాడు.
ఇటీవల కాలంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్లందరూ యూట్యూబ్ లో దర్శనమిస్తున్న సంగతి తెలిసిందే. నాటి రషీద్ లతీఫ్, రమీజ్ రాజా నుంచి మొదలుకుని మొన్నటి ఇంజమామ్ ఉల్ హక్, షోయభ్ అక్తర్, నిన్నటి సల్మాన్ భట్, డానిష్ కనేరియాలు నిత్యం యూట్యూబ్ లలో ఏదో ఒక వీడియో పెడుతూనే ఉంటారు.
ముఖ్యంగా వీళ్లంతా పాకిస్తాన్ క్రికెట్ తో పాటు అంతర్జాతీయంగా మరీ ముఖ్యంగా ఇండియా, ఐపీఎల్ మ్యాచ్ లపై వాళ్ల విశ్లేషణలు చేస్తుంటారు. వీటిని పాకిస్తాన్ లో ఎంతమంది చూస్తారో లేదో తెలియదు గానీ భారత క్రికెట్ గురించి మాట్లాడతారు కాబట్టి ఇక్కడ కూడా మంచి వ్యూసే వస్తున్నాయి.
అయితే పనిలో పనిగా పాకిస్తాన్ క్రికెట్ మీద, కెప్టెన్ బాబర్ ఆజమ్ మీద, పీసీబీ, ఇతర సిబ్బంది మీద రాళ్లేయడం వీరికి ఆనవాయితీగా మారింది. వీళ్లు, వాళ్లు అని తేడా లేకుండా అందరూ ఈ రకమైన ధోరణికి అలవాటుపడ్డారు. ఏదైనా ఇష్యూ జరిగితే యూట్యూబ్ లోకి రావడం దాని గురించి విశ్లేషణ అని ఊదరగొట్టడమే వీళ్ల పనిగా మారింది.
ఈ క్రమంలో వీళ్లు నానాటికీ దిగజారుతున్నారని అక్కడి క్రికెట్ ఫ్యాన్సే వాపోతున్నారు. తాజాగా పాకిస్తాన్ మాజీ సారథి మిస్బా ఉల్ హక్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. యూట్యూబ్ లో వ్యూస్, రేటింగ్స్ కోసం కొంతమంది ఏది పడితే అది వాగడం, ఎవరిని పడితే వారిని ఇష్టారీతిన మాట్లాడటం చేస్తున్నారని అది దేశాన్ని కించపరుస్తుందే తప్ప ఏమాత్రం ఉపయోగం లేని ప్రక్రియ అని అన్నాడు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మిస్బా మాట్లాడుతూ.. ‘ఈ విషయంలో నేను మా సొంత వ్యవస్థను నిందిస్తున్నా. ఈ వ్యవస్థలో ఉన్న లోపాలను వాడుకుంటూ ఎవరికి నచ్చింది వాళ్లు మాట్లాడుతున్నారు. మా క్రికెటర్లను, మా మాజీలను మేమే విమర్శించుకుంటున్నాం. దీనిద్వారా మా ఇమేజీని మేమే డ్యామేజీ చేసుకుంటున్నాం.
ఈ యూట్యూబ్ లలో వీడియోలు చేసేవారికి మాజీలు అంటే గౌరవం లేదు. ప్రస్తుతం ఆడుతున్న క్రికెటర్ల గురించి బాధ్యత లేదు. నోటికి ఏది పడితే అది వాగుతున్నారు. మీడియా, మాజీ క్రికెటర్లలో కొంతమంది యూట్యూబ్ ఛానెళ్ల ద్వారా వాళ్ల వ్యూస్ కోసం ఇష్టారీతిన మాట్లాడుతున్నారు. ఇది మంచిదికాదు. చివరికి ఇది పాకిస్తాన్ క్రికెట్ కే కీడు చేస్తుంది..’అని చెప్పాడు.