ఒకసారి శాంసన్ సగటు చూస్కో.. ఫామ్లో లేకుంటే మంచి ప్లేయర్ అయితే ఏంటి..? లక్ష్మణ్పై కాంగ్రెస్ ఎంపీ విమర్శలు
Sanju Samson: ఇండియా-న్యూజిలాండ్ నడుమ క్రిస్ట్చర్చ్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో కూడా సంజూ శాంసన్ కు తుది జట్టులో చోటు దక్కలేదు. దీంతో సోషల్ మీడియాలో టీమిండియా ఫ్యాన్స్ తో పాటు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు.
వరుసగా విఫలమవుతున్నా టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ కు పదే పదే అవకాశాలిస్తూనే ఉండటం.. సంజూ శాంసన్ ను పక్కనబెట్టడం తీవ్ర దుమారం లేపుతున్నది. శాంసన్ ను కావాలనే పక్కనబెడుతున్నారని, అతడి కెరీర్ ను నాశనం చేస్తున్నారని సోషల్ మీడియా వేదికగా ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి.
Sanju Samson-Rishabh Pant
న్యూజిలాండ్ పర్యటనకు ఎంపికైనా టీ20 సిరీస్ లో అతడికి ఆడే ఛాన్స్ ఇవ్వలేదు. వన్డే సిరీస్ లో తొలి వన్డేలో మాత్రమే అవకాశమిచ్చినా రెండు, మూడు వన్డేలకు శాంసన్ ను పక్కనబెట్టింది టీమ్ మేనేజ్మెంట్. జట్టులో ఆరో బౌలర్ కోసం సంజూను బెంచ్ కే పరిమితం చేస్తున్నామని టీమిండియా సారథి శిఖర్ ధావన్ తన నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు.
ఇక మూడో వన్డేకు ముందు టీమిండియా తాత్కాలిక హెడ్ కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ కూడా.. ‘నెంబర్ 4 లో పంత్ చాలా బాగా ఆడతాడు. అతడికి మద్దతుగా నిలవడం చాలా ముఖ్యం...’ అని కామెంట్ చేశాడు. ఈ వ్యాఖ్యలపై తిరువనంతపురం ఎంపీ, ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు శశి థరూర్ లక్ష్హణ్ కు చురకలంటించాడు. ఫామ్ లో లేని పంత్ కు మద్దతుగా నిలవడం కరక్టేగానీ మరి మంచి ఫామ్ లో ఉన్న శాంసన్ ను పక్కనబెట్టడానికి కారణమేంటో చెప్పాలని ఘాటుగా ప్రశ్నించాడు.
ట్విటర్ వేదికగా స్పందించిన శశిథరూర్.. ‘పంత్ నెంబర్ 4లో రాణించగలడు. అతడికి మద్దుతుగా నిలవడం ముఖ్యమని లక్ష్మణ్ చెబుతున్నాడు. కరక్టే. పంత్ చాలా మంచి ప్లేయర్. కానీ గత 11 ఇన్నింగ్స్ లలో మాత్రం అట్టర్ ఫ్లాఫ్ అయ్యాడు. వన్డేలలో శాంసన్ సగటు 66గా ఉంది.
తాను ఆడిన గత ఐదు ఇన్నింగ్స్ లలో సంజూ బాగా ఆడాడు. కానీ ఇంత చేసినా అతడు బెంచ్ కే పరిమితమయ్యాడు. ఒకసారి గణాంకాలు చూడండి..’ అని లక్ష్మణ్ తో పాటు టీమ్ మేనేజ్మెంట్ కూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. శశి థరూర్ ట్వీట్ కు వేలసంఖ్యలో లైకులతో పాటు శాంసన్ కు మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు.
ఇక మూడో వన్డేలో టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన భారత్.. 47.3 ఓవర్లలో 219 పరుగులకే ఆలౌట్ అయింది. వాషింగ్టన్ సుందర్(51) హాఫ్ సెంచరీతో రాణించాడు. శ్రేయాస్ అయ్యర్ (49) ఫర్వాలేదనిపించాడు. ఈ మ్యాచ్ లో పంత్.. 10 పరుగులే చేసి మరోసారి నిరాశపరిచాడు.