డాక్టర్ల కంటే ముందే యువీకి ఆ విషయం చెప్పా... సచిన్ చెప్పిన 2011 వన్డే వరల్డ్ కప్ హోటల్ రూమ్ సంగతులు...
2011 వన్డే వరల్డ్ కప్ విజయంలో కీలక పాత్ర పోషించాడు యువరాజ్ సింగ్. టోర్నీలో 8 ఇన్నింగ్స్ల్లో 362 పరుగులు చేసిన యువరాజ్ సింగ్, బౌలింగ్లో 15 వికెట్లు తీసి ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు గెలిచాడు. ఈ టోర్నీ తర్వాత కొన్ని రోజులకే యువరాజ్ సింగ్ ప్రాణాంతక క్యాన్సర్తో బాధపడుతున్నట్టు తెలిసింది. యువీ కంటే ముందే సచిన్ ఈ విషయాన్ని గుర్తించాడట...
‘యువరాజ్ సింగ్ ఎనర్జీ తగ్గుతుండడాన్ని నేను గమనించాను. ఆ సమయానికి అతను అనారోగ్యంతో బాధపడుతున్నట్టు ఎవ్వరికీ తెలీదు. అయితే నేను ఆ విషయాన్ని గమనించి, అతన్ని హెచ్చరించాను. టీమ్లో ప్రతీ ఒక్కరి బ్యాటింగ్ని గమనిస్తుండడం నాకు అలవాటు...
యువరాజ్ సింగ్ ఎనర్జీ లెవెల్స్ పడిపోతూ రావడాన్ని గమనించా. వరల్డ్ కప్లో మా ఫస్ట్ మ్యాచ్ తర్వాత యువీని నా హోటల్ రూమ్కి పిలిచాను. అతను రాగాగనే డిన్నర్ చేద్దామని చెప్పాను. వెళ్లే ముందు అతనికి ఈ విషయం చెప్పాను...
రేపటి నుంచి నీకు నేను గోల్స్ పెడతాను. ఫీల్డింగ్ దగ్గర్నుంచి మొదలెడతాం. నువ్వు చాలా అద్భుతమైన అథ్లెటిక్ ఫీల్డర్వి. కానీ నీ ఎనర్జీ పడిపోతుండడం నేను గమనించా. రేపటి నుంచి మనిద్దరం సెపరేట్గా ప్రాక్టీస్ సెషన్స్ పెట్టుకుందాం. నేను నీ ఎనర్జీ కాస్త పెంచగలనేమో చూద్దాం...
నీ గ్రాఫ్ మెల్లిగా పెరుగుతుందని మాత్రం నేను గ్యారెంటీ ఇవ్వగలను. యువీ, కష్టపడడం చాలా ముఖ్యం, ఫలితం దానంతట అదే వస్తుంది. కరెక్టు సమయంలో సరైన ప్రదర్శన ఇవ్వడం చాలా ముఖ్యమని చెప్పాను. నా మాటలకు యువీ చాలా ప్రాధాన్యం ఇస్తాడు...
మేం కలిసి ప్రాక్టీస్ చేశాం. అతను ఆ టోర్నీలో అద్భుతంగా రాణించాడు. ఏకంగా ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గెలిచి, టీమిండియాకి వరల్డ్ కప్ అందించాడు. కొన్ని కోట్ల మంది ముఖాల్లో నవ్వులు పూయించాడు. ఆ తర్వాత అతను క్యాన్సర్తో పోరాడుతున్నట్టు తెలిసింది..’ అంటూ చెప్పుకొచ్చాడు భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్..
సచిన్ కెరీర్లో వరల్డ్కప్ ఉండాలనే కసితో ఈ వరల్డ్కప్ ఆడానని చెప్పిన యూవీ.. ప్రాణాంతక క్యాన్సర్తో పోరాడి తిరిగి భారత జట్టులో చోటు సంపాదించుకున్నాడు... అయితే పీక్స్లో ఉన్న సమయంలో యువీ క్యాన్సర్ బారిన పడడం యువీ కెరీర్ గ్రాఫ్ని దెబ్బతీసింది.
రిటైర్మెంట్ తర్వాత సచిన్ టెండూల్కర్ కెప్టెన్సీలో రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ టోర్నీలో పాల్గొన్న యువరాజ్ సింగ్, రెండు సీజన్లలో ఇండియా లెజెండ్స్కి టైటిల్ అందించడంలో తనవంతు పాత్ర పోషించాడు.