2021లోనూ అతనే... ఆర్సీబీ ఓటమి అనంతరం విరాట్ కోహ్లీ ఎమోషనల్ పోస్టు...
IPL 2020 సీజన్లోనూ ఆర్సీబీ అభిమానులకు భంగపాటు తప్పలేదు. ప్రతీ సీజన్ ఆరంభం ముందు ‘ఈ సాల కప్ నమ్దే’ అంటూ ఆశగా హడావుడి మొదలెట్టే అభిమానులు, ఈసారి మాత్రం అంతగా సందడి చేయలేదు. కారణం గత సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘోరమైన ప్రదర్శనే. గత సీజన్లో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచిన ఆర్సీబీ, ఈ సీజన్ను విజయంతో ఆరంభించింది.
2020 సీజన్లో ఆడిన మొదటి 10 మ్యాచుల్లోనే ఏడు అద్వితీయ విజయాలు అందుకుని, అభిమానుల్లో ఆశలు రేకెత్తించింది రాయల్ ఛాలెంజర్స్...
అయితే ఆ తర్వాతే సీన్ మారిపోయింది. వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓడినా... రన్రేట్ బాగుండడంతో అదృష్టవశాత్తు ప్లేఆఫ్కి అర్హత సాధించింది ఆర్సీబీ...
సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మొదటి ఎలిమినేటర్ మ్యాచ్లో చిత్తుగా ఓడి, నాలుగో స్థానంతో 2020 సీజన్లో తన ప్రస్థానాన్ని ముగించింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...
ఈ పరాజయంతో 2020 సీజన్లో ఎలాగైనా ఆర్సీబీ టైటిల్ గెలుస్తుందని నమ్మిన అభిమానులకు ఘోర పరాభవం తప్పలేదు.. దీంతో మ్యాచ్ అనంతరం ఓ ఎమోషనల్ పోస్టు చేశాడు ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ.
‘ఒడిదుడుకుల ఈ ప్రయాణంలో జట్టు అంతా ఒక్కటిగా ఉంది. జట్టుగా సాగిన ఈ ప్రయాణం ఎంతో గొప్పది. అవును... పరిస్థితులు మాకు అనుకూలంగా రాలేదు కానీ మా ఆటగాళ్ల ప్రదర్శనపై గర్వంగా ఉంది. మాకు మద్ధతుగా నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు... త్వరలోనే మళ్లీ ముందుకు వస్తాం...’ అంటూ ట్వీట్ చేశాడు విరాట్ కోహ్లీ.
2020 సీజన్లో కూడా జట్టును ఛాంపియన్గా నిలపడంతో విరాట్ కోహ్లీ ఫెయిల్ కావడంతో అతన్ని కెప్టెన్సీ నుంచి తప్పించాలని డిమాండ్ వినిపిస్తోంది. గౌతమ్ గంభీర్ కూడా ఇదే విధంగా కోహ్లీపై ఘాటు వ్యాఖ్యలు చేశాడు..
అయితే విరాట్ కోహ్లీ చేసిన ఈ ట్వీటుతో వచ్చే ఏడాది కూడా విరాట్ కోహ్లీనే కెప్టెన్గా కొనసాగుతాడని తెలుస్తోంది. కరోనా కారణంగా ఈ ఏడాది ఆలస్యంగా ప్రారంభమైనా, వచ్చే సీజన్లో మార్చి, ఏప్రిల్ నెలలోనే ఐపీఎల్ జరగనుంది.
దాంతో 2021 సీజన్లో మరింత మెరుగైన ప్రదర్శన ఇస్తామనే ఆశాభావంతో ఉన్నాడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ... దీంతో ఎప్పటిలాగే ‘నెక్ట్స్ సాలా కప్ నమ్దే’ అంటూ ఆర్సీబీ అభిమానులను ట్రోల్ చేస్తున్నారు మిగిలిన జట్ల అభిమానులు.
గత సీజన్లో పాయింట్ల టేబుల్లో ఆఖరి స్థానంలో నిలిచిన ఆర్సీబీ, ఈ ఏడాది ప్లేఆఫ్లోకి ఎంట్రీ ఇచ్చి నాలుగో స్థానానికి పరిమితమైంది.
జట్టులో అవసరమైన కొన్ని మార్పులు చేస్తే, వచ్చే ఏడాది రాయల్ ఛాలెంజర్స్ జట్టును ఛాంపియన్గా నిలపవచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు విరాట్ కోహ్లీ...