క్వారంటైన్లో రోహిత్ శర్మ.. ఆస్ట్రేలియాలో మొదటి రోజు ఫోటో షేర్ చేసి...
రోహిత్ శర్మ... ఐపీఎల్ 2020 సీజన్లో గాయపడి, కోలుకోవడానికి చాలా సమయమే తీసుకున్నాడు. అక్టోబర్ 18న ‘డబుల్ సూపర్ ఓవర్’ మ్యాచ్లో గాయపడిన రోహిత్ శర్మ, ఫిట్గా ఉన్నాడని బీసీసీఐ అప్రూవల్ పొందడానికి డిసెంబర్ 12దాకా వేచి చూడాల్సి వచ్చింది. ఈ మధ్యలో ఓ రేంజ్ హైడ్రామా నడిచింది. ఎట్టకేలకు రోహిత్ ఆస్ట్రేలియా చేరడంతో ఈ డ్రామాకి ముగింపు కార్డు పడుతుందని భావిస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్.
ఓ రకంగా రోహిత్ శర్మకు అయిన గాయం చిన్నదే, రెండు వారాల విశ్రాంతి తీసుకుంటే ఫిట్నెస్ సాధించవచ్చని చెప్పాడు భారత ఫిజియో.
అయితే మనోడు గాయం పూర్తిగా మానకముందే ఐపీఎల్లో బరిలో దిగి, దాన్ని మరింత తీవ్ర తరం చేసుకున్నాడు.
గాయంతో ఆస్ట్రేలియా టూర్కి వెళ్లే అవకాశం ఉన్నా, తండ్రి కోసం స్వదేశానికి చేరుకున్న రోహిత్ శర్మ... ఎట్టకేలకు ఆస్ట్రేలియా గడ్డ మీద అడుగుపెట్టాడు.
అసలు రోహిత్ శర్మ టెస్టు సిరీస్ ఆడతాడా? లేదా? అనే అనుమానాలను పటాపంచలు చేస్తూ మూడో టెస్టు కోసం క్వారంటైన్ నుంచే సిద్ధమవుతున్నాడు హిట్ మ్యాన్.
బుధవారం ఆస్ట్రేలియా చేరుకున్న రోహిత్ శర్మ... రెండు వారాల పాటు క్వారంటైన్లో గడపబోతున్నాడు.
గురువారం క్వారంటైన్లో అతని మొదటి రోజు, అలాగే అదే రోజు పింక్ బాల్ టెస్టు మ్యాచ్లో మొదటి రోజు.
ఈ రెండింటినీ ఉద్దేశిస్తూ ‘డే 1’ అంటూ హోటెల్ రూమ్ నుంచి బయటికి చూస్తున్న ఓ ఫోటోను పోస్టు చేశాడు రోహిత్ శర్మ.
రోహిత్ శర్మను ‘క్లినికల్లీ ఫిట్’ అంటూ సర్టిఫికెట్ ఇచ్చిన బీసీసీఐ, అతన్ని క్వారంటైన్లో భారత మెడికల్ టీమ్ పర్యవేక్షిస్తుందని తెలిపింది.
జనవరి 7 నుంచి మొదలయ్యే మూడో టెస్టులో రోహిత్ శర్మ బరిలో దిగే అవకాశం ఉంది...
ఐపీఎల్లో గాయపడిన మరో క్రికెటర్ ఇషాంత్ శర్మ పూర్తి ఫిట్నెస్ సాధించినా, రాబోయే బిజీ షెడ్యూల్ను దృష్టిలో పెట్టుకుని అతన్ని ఆసీస్ టూర్కి దూరంగా ఉంచింది బీసీసీఐ.