బ్రేకింగ్ న్యూస్: టెస్టు సిరీస్కు కూడా దూరమైన రోహిత్ శర్మ, ఇషాంత్ శర్మ...
ఐపీఎల్లో గాయపడిన రోహిత్ శర్మ, ఇషాంత్ శర్మలు ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్కు ఎంపికైన విషయం తెలిసిందే. తాను ఫిట్గా ఉన్నానంటూ ఐపీఎల్లో రీఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ, ఫైనల్తో మూడు మ్యాచులు కూడా ఆడాడు. అయితే పూర్తి ఫిట్నెస్ సాధించని కారణంగా ఎన్సీఏలో శిక్షణ పొందుతున్న ఈ ఇద్దరు టెస్టు సిరీస్ నుంచి దూరమైనట్టు సమాచారం.
అక్టోబర్ 18న కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో జరిగిన ‘డబుల్ సూపర్ ఓవర్’ మ్యాచ్లో గాయపడ్డాడు రోహిత్ శర్మ. ఫిజియో ఫిట్గా లేవని, విశ్రాంతి అవసరమని సూచించినా పట్టించుకోకుండా బరిలో దిగాడు రోహిత్.
దీంతో అతని తొడ కండరాల గాయం తిరగబెట్టిందని, కేవలం 70 శాతం మాత్రమే రోహిత్ శర్మ ఫిట్నెస్ సాధించాడని బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ కూడా వెల్లడించిన విషయం తెలిసిందే.
తన గాయం విషయంలో వివాదం రేగడంతో మీడియా ముందుకు వచ్చిన రోహిత్ శర్మ... తాను గాయం నుంచి పూర్తిగా కోలుకున్నా కొద్దిగా ఇబ్బంది పడుతున్నానని చెప్పాడు. టీ20 ఆడినట్టుగా టెస్టు సిరీస్ ఆడలేం కాబట్టి పూర్తి ఫిట్నెస్ సాధించేందుకు ఎన్సీఏలో ఉన్నట్టు తెలిపాడు రోహిత్.
మరోవైపు మోచేతి గాయంతో ఇబ్బంది పడుతున్న ఇషాంత్ శర్మ, దాదాపు ఫిట్నెస్ సాధించాడని టెస్టు సిరీస్ ఆడతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు భారత మాజీ క్రికెటర్, ఎన్సీఏ క్యాంప్ మేనేజర్ రాహుల్ ద్రావిడ్.
అయితే ఇషాంత్ శర్మ ఆశించిన స్థాయిలో కోలుకోకపోవడంతో అతను కూడా ఆస్ట్రేలియాతో జరగబోయే టెస్టు సిరీస్కు దూరం కాబోతున్నట్టు సమాచారం...
టెస్టు సిరీస్ ఆడాలనుకుంటే మూడు, నాలుగు రోజుల్లో ఆస్ట్రేలియా రావాల్సిందిగా రోహిత్, ఇషాంత్ శర్మలకు సందేశం పంపాడు భారత హెడ్ కోచ్ రవిశాస్త్రి.
అయితే ఇప్పుడిప్పుడే గాయం నుంచి కోలుకుంటున్న ఇషాంత్, రోహిత్... అంత దూరం ట్రావెల్ చేయడం, అక్కడ క్వారంటైన్లో గడపడం వంటివి చేయలేరని గ్రహించిన బీసీసీఐ అధికారులు... ఆసీస్ టూర్ నుంచి వీరిని తప్పించినట్టు తెలుస్తోంది.
ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్లో ఒకే మ్యాచ్ ఆడి స్వదేశం రానున్నాడు విరాట్ కోహ్లీ. ఇప్పుడు రోహిత్, ఇషాంత్ కూడా దూరం అయితే టీమిండియాకు ఆసీస్ గడ్డపై కష్టాలు తప్పకపోవచ్చు.
గత ఏడాది టెస్టుల్లో నిరూపించుకున్న రోహిత్ శర్మ, టీమిండియాకి ఆడడం కంటే ఐపీఎల్ ఆడడానికే ప్రాధాన్యం ఇస్తున్నాడని, ఇది అతని కెరీర్ను దెబ్బతీస్తుందని భారత మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్సర్కార్ విమర్శించాడు.
వెంగ్ సర్కార్ హెచ్చరించినట్టుగానే టీ20, వన్డే సిరీస్లకు దూరమైన రోహిత్ శర్మ ఇప్పుడు టెస్టు సిరీస్కు కూడా దూరమయ్యాడు..
టెస్టు సిరీస్ నుంచి రోహిత్ శర్మ తప్పుకోవడంతో అతని స్థానంలో యంగ్ ప్లేయర్, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ను ఆస్ట్రేలియా పంపాలని ఆలోచిస్తోంది బీసీసీఐ. ఈమేరకు అయ్యర్తో సంప్రదింపులు జరుపుతోంది టీమిండియా.