రోహిత్ శర్మ ఫిట్... క్రికెట్ ఆస్ట్రేలియాకి గంగూలీ స్పెషల్ రిక్వెస్ట్...
ఐపీఎల్లో గాయపడిన రోహిత్ శర్మ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నట్టు తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం రోహిత్ శర్మకు డిసెంబర్ 11న ఫైనల్ ఫిట్నెస్ టెస్టు చేయబోతున్నారు. ఇందులో పాస్ అయితే తర్వాతి రోజే రోహిత్ ఆస్ట్రేలియా పయనమై వెళ్లనున్నాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారి బొరియా మంజుబర్ స్పష్టం చేశారు.
‘రోహిత్ శర్మ ఫిట్గా ఉన్నాడు. డిసెంబర్ 12న ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కే అవకాశం 75 శాతం ఉంది. ఆస్ట్రేలియాతో చివరి రెండు టెస్టులు ఆడతాడు రోహిత్’ అంటూ చెప్పుకొచ్చాడు బొరియా.
రోహిత్ శర్మ ఆస్ట్రేలియా వెళ్లిన తర్వాత 14 రోజుల క్వారంటైన్లో గడపాల్సి ఉంటుంది. అయితే బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, ఈ విషయమై క్రికెట్ ఆస్ట్రేలియాను ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేయనున్నాడు.
ఆస్ట్రేలియాలో కరోనా టెస్టు ముగిసిన తర్వాత క్వారంటైన్లో టీమిండియాతో కలిసి ప్రాక్టీస్ చేసేందుకు అనుమతి అడగనున్నాడు.
నిజానికి 14 రోజుల క్వారంటైన్ లేకపోతే డిసెంబర్ 17న మొదలయ్యే మొదటి టెస్టులోనే రోహిత్ శర్మ ఆడే అవకాశం ఉంటుంది. అయితే ఇంగ్లాండ్, న్యూజిలాండ్లో క్రికెట్ సిరీస్లపై కరోనా ఎఫెక్ట్ పడడంతో ఆ రిస్క్ తీసుకోవడానికి బీసీసీఐ సిద్ధంగా లేదు.
మరోవైపు గాయం కారణంగా ఆసీస్ టూర్లో టెస్టులకి దూరమైన ఇషాంత్ శర్మ కూడా పూర్తి ఫిట్నెస్ సాధించాడు.
గాయం నుంచి కోలుకున్నప్పటికీ ఆస్ట్రేలియా టూర్లో టెస్టులు ఆడడం లేదు ఇషాంత్ శర్మ. ఆసీస్ టూర్ తర్వాత టీమిండియా బిజీ షెడ్యూల్ ఆడబోతోంది.
మరోవైపు మొదటి టీ20 మ్యాచ్లో గాయపడిన ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కోలుకోవడానికి మరింత సమయం పడుతుండడంతో మొదటి టెస్టుకి దూరమయ్యాడు. రెండో టెస్టులో జడేజా ఆడడం అనుమానమే.