WI vs IND: హిట్మ్యాన్కు గాయం.. మిగిలిన రెండు మ్యాచులలో ఆడతాడా? లేదా? కీలక అప్డేట్ ఇచ్చిన బీసీసీఐ..!
WI vs IND T20I: ఇటీవలే వెస్టిండీస్ తో ముగిసిన మూడో టీ20 మ్యాచ్ లో వెన్నునొప్పితో రోహిత్ శర్మ ఇబ్బందులు పడ్డాడు. బ్యాటింగ్ చేస్తుండగా మధ్యలోనే క్రీజు వదిలివెళ్లాడు.
Image credit: Getty
వెస్టిండీస్ పర్యటనలో ఉన్న భారత జట్టు సారథి రోహిత్ శర్మ.. ఆ జట్టుతో రెండ్రోజుల క్రితం ముగిసిన మూడో టీ20 మ్యాచ్ లో వెన్నునొప్పి వేధించడంతో మధ్యలోనే క్రీజును వదిలాడు. 5 బంతుల్లోనే 11 పరుగులు చేసిన అతడు.. నడుం కండరాలు పట్టేయడంతో రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు.
పెవిలియన్ కు వెళ్తున్నప్పుడు కూడా హిట్ మ్యాన్ చాలా ఇబ్బందిగా నడుచుకుంటూ వెళ్లిపోయాడు. దీంతో రోహిత్ గాయం పెద్దదే అయ్యుంటుందని, ఆసియా కప్ ముందున్న నేపథ్యంలో అతడు ఈ సిరీస్ లో మిగిలిన రెండు మ్యాచులకు ఆడటం అనుమానమే అనే సందేహాలు తలెత్తాయి.
కానీ తాజాగా రోహిత్ శర్మ గాయంపై బీసీసీఐ కీలక అప్టేడ్ ఇచ్చింది. అతడు ఫిట్ గానే ఉన్నాడని తేల్చింది. వెస్టిండీస్ తో జరుగబోయే మిగిలిన రెండు మ్యాచులకూ అతడు అందుబాటులో ఉంటాడని స్పష్టం చేసింది. దీంతో భారత అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
మూడో మ్యాచ్ అనంతరం రోహిత్ స్పందిస్తూ.. ‘ఇప్పుడైతే బాగానే ఉంది. నాలుగో టీ30 మ్యాచ్ జరగడానికి ఇంకా సమయముంది. అప్పటివరకు నేను పూర్తిగా కోలుకుంటానని ఆశిస్తున్నా...’ అని చెప్పిన విషయం తెలిసిందే. ఇదే విషయమై బీసీసీఐ కూడా..‘రోహిత్ కు నడుం కండారలు పట్టుకున్నాయి. అతడిని ప్రస్తుతం బీసీసీఐ వైద్యబృందం పరిశీలిస్తుంది..’ అని పేర్కొంది.
అయితే తాజాగా టీమ్ మేనేజ్మంట్ కు చెందిన ఓ ప్రతినిధి చెప్పిన దాని ప్రకారం.. ‘రోహిత్ ఫిట్ గానే ఉన్నాడు. అతడు మిగిలిన రెండు మ్యాచులకూ అందుబాటులో ఉంటాడు...’ అని తెలిపాడు. దీంతో భారత అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇక నాలుగు, ఐదో టీ20 ఆడేందుకు టీమిండియా, వెస్టిండీస్ జట్లు ఫ్లోరిడా (అమెరికా) చేరుకున్నాయి. ఈ ఇరుజట్లలోని పలువురి ఆటగాళ్లకు వీసా సమస్యలు తలెత్తినా గయానా అధ్యక్షుడు ఇర్ఫాన్ అలీ జోక్యంతో అవి కూడా తీరిపోయాయి. బుధవారం రాత్రి ఇరు జట్ల ఆటగాళ్లు ఫ్లోరిడాకు చేరారు.