రోహిత్ శర్మకు చెప్పిందే, రిషబ్ పంత్కీ చెబుతున్నా, అక్కడ రాణించాలంటే... - మాజీ క్రికెటర్ కపిల్ దేవ్
వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ కోసం ఇంగ్లాండ్ చేరిన టీమిండియా, అక్కడ క్వారంటైన్లో గడుపుతోంది. ఆస్ట్రేలియా టూర్లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చిన రిషబ్ పంత్పైనే అందరి కళ్లున్నాయి. అయితే ఇంగ్లాండ్ పిచ్లపై రాణించాలంటే దూకుడు తగ్గించుకోవాలని పంత్కి సూచిస్తున్నాడు మాజీ క్రికెటర్ కపిల్ దేవ్.
‘ఆసీస్ టూర్ తర్వాత రిషబ్ పంత్ చాలా పరిణితి చెందాడు. ఎంతో ఓపిగ్గా ఆడుతూనే దూకుడు చూపిస్తున్నాడు. సిడ్నీలో సెంచరీ ముగింట భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి, అవుట్ అయ్యాడు.
రిషబ్ పంత్కి కానీ, రోహిత్ శర్మకి గానీ షాట్లు ఎక్కువగా ఆడడమే ఇష్టం. ఈ ఇద్దరూ మంచి షాట్లు ఆడగలరు కానీ ఇంగ్లాండ్ పరిస్థితులకు అలవాటుపడేవరకూ ఇలాంటి ప్రయత్నాలు చేయకపోవడం చాలా మంచిది.
ఇంగ్లాండ్ పిచ్లపై ప్రతీ బాల్ను సిక్సర్ లేదా బౌండరీ బాదాలని ఆలోచించడం ఏ మాత్రం మంచిది కాదు. ఎందుకంటే పిచ్ కండీషన్స్ ఎప్పుడూ ఫాస్ట్ బౌలర్లకు, సీమర్లకు అనుకూలంగా ఉంటాయి.
కాబట్టి రిషబ్ పంత్ ఈ విషయాన్ని గుర్తుంచుకుని బ్యాటింగ్ చేయాలి. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇంతకుముందు రోహిత్ శర్మకి కూడా ఇదే చెప్పాను, నీకు ఇదే చెబుతున్నా...
ఇంగ్లాండ్ పిచ్ల్లో రాణించాలంటే సహనం కూడా ఉండాలి. రోహిత్ శర్మ చాలా రకాల షాట్స్ ఆడగలడు. అయితే చాలాసార్లు క్రీజు నుంచి ముందుకొచ్చి షాట్స్ ఆడేందుకు ప్రయత్నించి అవుట్ అవుతున్నాడు రోహిత్.
ఇద్దరూ ఈ విషయం గుర్తుంచుకోవాలి. రోహిత్ శర్మలాగే రిషబ్ పంత్ కూడా భారత జట్టుకి ఎంతో విలువైన ఆటగాడు. భారత జట్టు వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ గెలవాలంటే ఈ ఇద్దరూ రాణిస్తే బాగుంటుంది.
షాట్లు ఆడడానికి కూడా క్రీజులో ఎక్కువ సేపు ఉండడానికి ప్రాధన్యం ఇవ్వండి. ఎంత ఎక్కువ సేపు క్రీజులో ఉంటే అన్ని ఎక్కువ పరుగులు చేయడానికి అవకాశం ఉంటుంది... ’ అంటూ చెప్పుకొచ్చాడు మాజీ కెప్టెన్ కపిల్దేవ్.
భారత హెడ్ కోచ్ రవిశాస్త్రిలాగే వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ విజేతను తేల్చడానికి ఒకే ఫైనల్ పెట్టడం సరికాదని అభిప్రాయపడ్డాడు.
‘ఒకే ఫైనల్తో టెస్టు విజేతను నిర్ణయించడం సరైన పద్ధతి కాదు. బెస్ట్ ఆఫ్ త్రీ... ఫార్మాట్లో మూడు మ్యాచులు నిర్వహించి ఉంటే బాగుండేది... ఇలా మూడు ఫైనల్స్ పెట్టడం వల్ల ఈ ఫార్మాట్ ఇంకా ఆసక్తికరంగా మారుతుంది’ అంటూ చెప్పుకొచ్చాడు కపిల్ దేవ్.