రాహుల్ త్రిపాఠిని ఆడించకపోవడం అన్యాయం... భారత క్రికెటర్ రాబిన్ ఊతప్ప...
ఐపీఎల్ 2022 సీజన్ తర్వాత టీమిండియాలో చోటు దక్కించుకున్నారు ఉమ్రాన్ మాలిక్, రాహుల్ త్రిపాఠి. ఉమ్రాన్ మాలిక్ని అటు తిప్పి, ఇటు తిప్పి ముచ్చటగా మూడంటే మూడు టీ20 మ్యాచులు ఆడించిన భారత జట్టు, అతన్ని పక్కనబెట్టేసింది. ఇప్పుడు రాహుల్ త్రిపాఠి కూడా అలాంటి పరిస్థితులనే ఎదుర్కొంటున్నాడు...
Rahul Tripathi
ఐపీఎల్లో నిలకడైన ప్రదర్శన ఇస్తూ, అత్యధిక పరుగులు చేసిన ‘అన్క్యాప్డ్’ ప్లేయర్గా ఉన్న రాహుల్ త్రిపాఠి... ఐర్లాండ్తో జరిగిన టీ20 సిరీస్ ద్వారా అంతర్జాతీయ ఆరంగ్రేటం చేశాడు. ఆ తర్వాత అతన్ని పట్టించుకోని సెలక్టర్లు, ఇంగ్లాండ్తో తొలి టీ20కి ఎంపిక చేసినా తుదిజట్టులో ఆడించలేదు...
Image credit: PTI
జింబాబ్వేతో వన్డే సిరీస్కి ప్రకటించిన జట్టులో రాహుల్ త్రిపాఠి పేరు ఉండడంతో ఈసారి అతనికి అవకాశం దక్కుతుందని అనుకున్నారంతా. ఐపీఎల్లో, దేశవాళీ టోర్నీల్లో మంచి గణాంకాలు నమోదు చేసిన త్రిపాఠి... టీమిండియాకి మంచి బ్యాటర్గా మారతారని ఆశించారంతా... అయితే జింబాబ్వేలోనూ అతనికి నిరాశే ఎదురైంది...
తొలి రెండు వన్డేల్లో రాహుల్ త్రిపాఠికి తుది జట్టులో అవకాశమే రాలేదు. ఓటమి భయమో, లేక రాహుల్ త్రిపాఠిని ఆడిస్తే రిజర్వు బెంచ్లో వెయిట్ చేసే ప్లేయర్ల సంఖ్య పెరుగుతుందనే భయమో తెలీదు కానీ.. కెఎల్ రాహుల్ టీమ్, ఈ సన్రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్కి తుది జట్టులో అవకాశం ఇవ్వలేదు...
‘రాహుల్ త్రిపాఠి చాలా టాలెంటెడ్ బ్యాట్స్మెన్. అతను ఎన్నో ఏళ్లుగా అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. పిలిచి మరీ అవకాశం ఇవ్వకపోవడం కరెక్ట్ కాదు. కనీసం ఆఖరి వన్డేలో అయినా అతన్ని ఆడించాలి. లేకపోతే అతనికి అన్యాయం చేసినట్టే అవుతుంది...
రుతురాజ్ గైక్వాడ్ కూడా చాలా రోజులుగా రిజర్వు బెంచ్కే పరిమితమయ్యాడు. ఇషాన్ కిషన్ ఒక్క ఇన్నింగ్స్ మాత్రమే బ్యాటింగ్ చేశాడు. కాబట్టి శిఖర్ ధావన్ వంటి సీనియర్కి రెస్ట్ ఇచ్చి... ఆఖరి వన్డేలో రుతురాజ్ గైక్వాడ్, రాహుల్ త్రిపాఠిలను ఆడించాలి...
Image credit: Getty
ఇప్పటికే ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్ తొలి రెండు వన్డేలు ఆడారు. కాబట్టి చివరి వన్డేలో దీపక్ చాహార్ని తీసుకొస్తే... ఆరు నెలల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన అతనికి తగినంత ప్రాక్టీస్ దొరికినట్టు అవుతుంది... ’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా సీనియర్ క్రికెటర్ రాబిన్ ఊతప్ప...