వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ సందడి షురూ... మరోసారి సీనియర్లనే నమ్ముకోబోతున్న టీమిండియా...
టీమిండియా ఐసీసీ టైటిల్ గెలిచి 9 ఏళ్లు దాటిపోయింది. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత నాలుగేళ్లు ధోనీ, మూడేళ్లు విరాట్ కోహ్లీ కెప్టెన్సీ చేసినా టీమిండియాకి మరో ఐసీసీ టైటిల్ అందించలేకపోయారు. ఇదే సమయంలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ టీమ్స్ ఐసీసీ టైటిల్స్ గెలిచాయి..
2015 వన్డే వరల్డ్ కప్ని ఆస్ట్రేలియా కైవసం చేసుకోగా 2019 వన్డే వరల్డ్ కప్ని ఇంగ్లాండ్ సొంతం చేసుకుంది. 2021 టీ20 వరల్డ్ కప్ని ఆస్ట్రేలియా గెలిస్తే, 2022 టీ20 వరల్డ్ కప్ని ఇంగ్లాండ్ గెలిచేసింది. మధ్యలో ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ని న్యూజిలాండ్ గెలుచుకెళ్లింది...
విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో, ఏడాదిగా రోహిత్ శర్మ కెప్టెన్సీలో ద్వైపాక్షిక సిరీసుల్లో దుమ్మురేపుతూ టాప్ క్లాస్ టీమ్గా పేరు తెచ్చుకున్నప్పటికీ ఐసీసీ టైటిల్ గెలవలేకపోతోంది భారత జట్టు. ఐసీసీ టైటిల్స్ గెలవనంత వరకూ ఇండియాకి పొరుగుదేశాలైన పాక్, శ్రీలంక జట్లకు పెద్దగా తేడా ఏమీ ఉండదు...
పైపెచ్చు పాకిస్తాన్, టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో సెమీ ఫైనల్కి, 2022 టీ20 వరల్డ్ కప్లో ఫైనల్ చేరగలిగింది. శ్రీలంక ఈ మధ్యకాలంలో ఐసీసీ టోర్నీల్లో అదరగొట్టకపోయినా ఆసియా కప్ 2022 విజేతగా నిలిచింది...
Image credit: Getty
దీంతో ఇప్పుడు టీమిండియాకి ఐసీసీ టైటిల్ గెలవడం చాలా అవసరం. అయితే గత అనుభవాల తర్వాత కూడా వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలోనూ సీనియర్లపైనే భారం వేసింది భారత జట్టు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా... చివరిసారిగా వన్డే వరల్డ్ కప్ బరిలో దిగబోతున్నారు..
జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీ, యజ్వేంద్ర చాహాల్ వంటి సీనియర్ బౌలర్లే ప్రధాన బలంగా వన్డే వరల్డ్ కప్ ఆడనుంది భారత జట్టు. జనవరి 10 నుంచి ప్రారంభమయ్యే ఇండియా వర్సెస్ శ్రీలంక, వన్డే వరల్డ్ కప్ సన్నాహాలకు మొదటి సిరీస్గా మారింది...
Image credit: PTI
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ కోసం 20 మంది ప్లేయర్లను షార్ట్ లిస్ట్ చేసిన బీసీసీఐ, ఈ టోర్నీ నుంచి వారి పర్ఫామెన్స్ని లెక్కించనుంది. పర్ఫామెన్స్ ఆధారంగా ది బెస్ట్ 15 మందిని వన్డే వరల్డ్ కప్ టోర్నీకి ఎంపిక చేయబోతున్నారు..