బీసీసీఐ గొప్ప మనసు.. గాయంతో ఆరు నెలలు ఆడకున్నా ఫుల్ సాలరీ..
Rishabh Pant Accident: పంత్ బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ ఉన్న ప్లేయర్ అన్న విషయం తెలిసిందే. ప్రతీ యేటా అతడికి రూ. 5 కోట్ల వేతనం అందుతుంది.
యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ కొద్దిరోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడి ప్రస్తుతం ముంబైలోని కోకిలాబెన్ దీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బీసీసీఐ ఆధ్వర్యంలోని ప్రత్యేక వైద్య బృందం పంత్ ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నది. పంత్ డెహ్రాడూన్ లో ఉంటే అక్కడ్నుంచి మెరుగైన వైద్య సదుపాయాల కోసం అతడిని ముంబైకి ఎయిర్ అంబులెన్స్ పెట్టి మరీ తరలించిన బీసీసీఐ..
పంత్ కు కావాల్సిన అన్ని సదుపాయాలను బీసీసీఐ సమకూరుస్తున్నది. కష్టకాలంలో అతడికి అండగా ఉంటున్నది. తాజా సమాచారం ప్రకారం.. రాబోయే ఆరేడు నెలలు అతడు గాయంతో క్రికెట్ కు దూరమైనా అతడికి రాబోయే సాలరీ మాత్రం అందించనుంది.
పంత్ బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ ఉన్న ప్లేయర్ అన్న విషయం తెలిసిందే. ప్రతీ యేటా అతడికి రూ. 5 కోట్ల వేతనం అందుతుంది. దానితో పాటు ఐపీఎల్ లో రిషభ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ కాంట్రాక్టు కూడా ఉంది. ఇందుకు గాను రూ. 16 కోట్ల వేతనం అందుతుంది.
గాయంతో పంత్ ఆరు నుంచి 8 నెలల దాకా కోలుకోవడం అనుమానమే అని వైద్యులు కూడా చెబుతున్నారు. అతడు వచ్చే ఆసియా కప్ వరకైనా (సెప్టెంబర్ లో జరగాల్సి ఉంది) అందుబాటులోకి వస్తాడని అనుకుంటున్నా అంతకుమించి టైమ్ పట్టొచ్చని వాదనలూ వినిపిస్తున్నాయి. అయితే పంత్ మళ్లీ తిరిగి కోలుకునేదాకా అతడి సాలరీకి వచ్చిన లోటేమీ లేదు.
బీసీసీఐ నుంచి రావాల్సిన ఐదు కోట్ల రూపాయలతో పాటు ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 16 కోట్లు అతడి ఖాతాలో జమకానున్నాయి. ఈ మేరకు బీసీసీఐ ఆదేశాలు కూడా జారీ చేసినట్టు తెలుస్తున్నది. వాస్తవానికి బీసీసీఐ నిబంధనల ప్రకారం.. బోర్డు కాంట్రాక్టు ఉన్న ఆటగాళ్లందరికీ బీమా ఉంటుంది.
వారిలో ఎవరైనా గాయపడితే బోర్డు నుంచి రావాల్సిన మొత్తం అందుంతుంది. ఐపీఎల్ లో కూడా ఇదే విధానం అమల్లో ఉంది. సదరు ఫ్రాంచైజీలు కూడా తమ కాంట్రాక్టు ఉన్న ఆటగాళ్లకు బీమా చేయిస్తున్నాయి. ఇన్సురెన్స్ కంపెనీలు ఈ నగదును చెల్లిస్తాయి.