ఆడేది లేదు గానీ మరీ ఇంత పొగరా..? పంత్ పై ఆగని ట్రోల్స్
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ వరుస వైఫల్యాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కుంటున్నాడు. సోషల్ మీడియాలో అయితే నెటిజన్లు పంత్ ను ఆటాడుకుంటున్నారు.
ఆటగాళ్లు కొన్ని మ్యాచ్ లలో విఫలమైనా ఫ్యాన్స్ పెద్దగా పట్టించుకోరు.. విమర్శలు చేసేవాళ్లు చేస్తారేమో గానీ సదరు ఆటగాడి మీద వ్యక్తిగత విమర్శలకు దిగరు. కానీ ఆ ఆటగాడి వ్యవహార శైలి, ఇతరులతో మాట్లాడే తీరులో తేడా ఉంటే మాత్రం గూబ గుయిమనే రిప్లై ఇస్తారు. తాజాగా టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ కూడా ఇదే తరహా ట్రోలింగ్ కు గురవుతున్నాడు.
అసలే ఫామ్ కోల్పోయి వరుస మ్యాచ్ లలో విఫలమవుతూ సర్వత్రా విమర్శలు ఎదుర్కుంటున్న పంత్.. న్యూజిలాండ్ తో మూడో వన్డే కు ముందు ప్రముఖ క్రికెట్ కామెంటేటర్ హర్షా భోగ్లేతో మాట్లాడిన తీరు తీవ్ర వివాదాస్పదమైంది. దీంతో పంత్ ఆడకున్నా బలుపుకేమీ తక్కువ లేదని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
విషయానికొస్తే.. మూడో వన్డేకు ముందు రిషభ్ పంత్ తో హార్షా భోగ్లే మాట్లాడుతూ ‘నేను గతంలో వీరేంద్ర సెహ్వాగ్ ను ఈ ప్రశ్న అడిగాను. మీ వైట్ బాల్ రికార్డ్స్ కంటే టెస్టు రికార్డు బాగున్నాయి..’ అని అడిగాడు.
దానికి పంత్.. ‘సార్, నా దృష్టిలో రికార్డులు కేవలం అంకెలు. మీరన్నట్టు నా వైట్ బాల్ రికార్డేమీ మరీ అంత చెండాలంగా లేదు..’ అని చెప్పుకొచ్చాడు. మళ్లీ హర్షా కల్పించుకుని.. ‘నేను చెడ్డదని చెప్పడం లేదు. కానీ నేను దానిని టెస్టు నెంబర్లతో పోల్చుతున్నా..’ అని ప్రశ్నించాడు.
అప్పుడు మళ్లీ పంత్.. ‘సార్ నా వయసు 25 ఏండ్లు. మీరు పోల్చాలనుకుంటే నేను 30-32 ఏండ్లప్పుడు పోల్చినా ఓ లెక్క. కానీ మీరు ఇప్పుడే అలా చేయడంలో లాజిక్ లేదు..’ అని కొంచెం ఘాటుగానే సమాధానమిచ్చాడు. ఇదే ఇప్పుడు నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది.
భోగ్లే అడిగినదానిలో తప్పేముందని, దానికి పంత్ అంత పొగరుగా ఆన్సర్ ఇవ్వడం అవసరమా..? అని ప్రశ్నిస్తున్నారు. బీసీసీఐ అండదండలతో ఊరేగుతున్న నువ్వు.. ఆడకున్నా జట్టులో ఎందుకు ఉంటున్నావో మాకు తెలియదా..? ఇలాంటి పొగరు మాటలు తగ్గించి ముందు ఆటమీద దృష్టి పెట్టు.. అని అంటున్నారు.