పంత్ పనైపోయింది... అలా చేయకపోతే అతని కెరీర్ ముగిసినట్టే.. . ఆకాశ్ చోప్రా కామెంట్స్
భారత జట్టులోకి ఓ సంచలనంలా దూసుకొచ్చాడు రిషబ్ పంత్. సీనియర్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ ఆలోచనలు చేసిన తర్వాత మాహీ ప్లేస్ను భర్తీ చేసే బెస్ట్ ఆప్షన్గా పంత్వైపే చూశారు సెలక్టర్లు. అయితే ఎన్ని అవకాశాలు ఇచ్చినా నిర్లక్ష్యపు ఆటతీరుతో జట్టులో స్థానం కోల్పోయాడు రిషబ్ పంత్. ఆసీస్ టూర్లో వన్డే, టీ20లకు ఎంపిక కాని రిషబ్ పంత్ కేవలం టెస్టు జట్టులో స్థానం దక్కించుకున్నాడు. సాహా ఉండడంతో పంత్ ఆడడం కష్టమే.
హైట్ తక్కువగా ఉండే రిషబ్ పంత్, పరుగులు తీయడంలో చాలా బద్ధకంగా వ్యవహారిస్తాడు... ఎలాంటి బాల్నైనా బౌండరీకి పంపాలనే ఉద్దేశంతో కొన్ని నిర్లక్ష్యపు షాట్స్ ఆడతాడు...
ఈ బద్ధకమే రిషబ్ పంత్పై తీవ్రమైన వ్యతిరేకత రావడానికి కారణమైంది. పంత్కి పోటీగా ఉన్న సంజూ శాంసన్, ఐపీఎల్ 2020 సీజన్లో నాలుగు హాఫ్ సెంచరీలు చేస్తే పంత్ ఒకే ఒక్క హాఫ్ సెంచరీ చేశాడు.
ఇప్పటికైనా రిషబ్ పంత్ తన పరిస్థితిని అర్థం చేసుకుని, బద్ధకాన్ని వదిలించుకోవాలని అంటున్నాడు భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా...
‘కెఎల్ రాహుల్ బ్యాటుతోనే రాణిస్తూ వికెట్ కీపింగ్ కూడా చేస్తున్నాడు. టెస్టుల్లో వృద్ధిమాన్ సాహా సీనియర్ మోస్ట్ వికెట్ కీపర్... కాబట్టి టీమిండియాలోకి రావాలంటే పంత్ బాగా కష్టపడాలి...
సాహా ఐపీఎల్లో కూడా మెరిసాడు... మరి టీమిండియాలో చోటు దక్కించుకోవాలంటే రిషబ్ పంత్ తీవ్రంగా కృషి చేయాలి... లేదంటే టెస్టుల్లో కూడా రిషబ్ పంత్కి చోటు దక్కదు...
రిషబ్ పంత్కి ఈ పరిస్థితి రావడానికి తనే కారణం. తన కెరీర్ను తానే నాశనం చేసుకున్నాడు పంత్. ధోనీ రిటైర్ అయితే ఆ ప్లేస్ తనదే అనే ధీమాలో ఉన్నాడు...
తనను తాను ధోనీలా ఊహించుకున్నాడు. ఇప్పటికైనా ఆ భ్రమల్లో నుంచి బయటికి రావాలి. లేదంటే పంత్ కెరీర్ ముగిసిపోతుంది...’ అంటూ కామెంట్ చేశాడు ఆకాశ్ చోప్రా.
కెరీర్ ఆరంభంలో మంచి టెక్నిక్ ఉన్న ప్లేయర్గా గుర్తింపు పొందిన రిషబ్ పంత్... వరుస సిరీస్ల్లో ఫెయిల్ అయ్యాడు. దాంతో సంజూ శాంసన్కి జట్టులో చోటు ఇవ్వాలని డిమాండ్ వినిపించింది.
సంజూ దేశవాళీ క్రికెట్లో, ఐపీఎల్లో కూడా రాణించడంతో అతనికి జట్టులో చోటు దక్కుతోంది. అయితే సంజూ శాంసన్ని వికెట్ కీపర్గా కాకుండా కేవలం బ్యాట్స్మెన్గానే జట్టులోకి తీసుకుంది టీమిండియా.
కెఎల్ రాహుల్నే వికెట్ కీపర్గా కొనసాగిస్తోంది. అంటే టీమిండియాకి బ్యాట్స్మెన్ కమ్ వికెట్ కీపర్ అవసరం ఉంది కానీ వికెట్ కీపింగ్లో మాత్రమే రాణించే ప్లేయర్ అవసరం లేదని స్పష్టం చేస్తోంది బీసీసీఐ. దీన్ని పంత్ గ్రహించాలని అంటున్నాడు ఆకాశ్ చోప్రా.