- Home
- Sports
- Cricket
- అదే టీమ్, అదే మనుషులు... మళ్లీ అవే ఫలితాలు రానున్నాయా? గెలుపు గుర్రాలను పట్టించుకోని టీమిండియా...
అదే టీమ్, అదే మనుషులు... మళ్లీ అవే ఫలితాలు రానున్నాయా? గెలుపు గుర్రాలను పట్టించుకోని టీమిండియా...
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ వంటి సీనియర్లను పూర్తిగా టీ20 ఫార్మాట్కి దూరం పెట్టేసింది టీమిండియా. హార్ధిక్ పాండ్యా కెప్టెన్సీలో కుర్రాళ్లతో టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీ కోసం టీమ్ని తయారుచేసే పనిలో పడింది..

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ముందు వెస్టిండీస్ పర్యటనలో ఐదు టీ20 సిరీస్లు అంగీకరించింది భారత జట్టు. దీనికి కారణం కూడా వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్ కప్కి కుర్రాళ్లను సిద్ధం చేసేందుకు ఇక్కడి నుంచే ప్రణాళికలు తయారు చేసుకోవచ్చనే..
Image credit: PTI
అయితే వెస్టిండీస్ టూర్లో టీ20 సిరీస్కి ప్రకటించిన జట్టులో పెద్డగా మార్పులు కనిపించలేదు. తెలుగు కుర్రాడు తిలక్ వర్మతో పాటు యశస్వి జైస్వాల్ని టీ20లకు తొలిసారి ఎంపిక చేసిన సెలక్టర్లు, ఐపీఎల్ 2023 సీజన్లో అద్భుతమైన ప్రదర్శన కనబర్చిన గెలుపు గు(కు)ర్రాళ్లను పక్కనబెట్టేశారు..
Rinku Singh
రింకూ సింగ్: ఐపీఎల్ 2023 సీజన్లో 14 మ్యాచుల్లో 474 పరుగులు చేసిన రింకూ సింగ్, 4 హాఫ్ సెంచరీలు చేసి... కేకేఆర్ తరుపున టాప్ స్కోరర్గా నిలిచాడు. అయితే రింకూ సింగ్కి, వెస్టిండీస్ టూర్కి ప్రకటించిన జట్టులో చోటు దక్కలేదు..
Mohit Sharma
మోహిత్ శర్మ: ఐపీఎల్ 2023 సీజన్లో సంచలన ప్రదర్శన కనబర్చి, గుజరాత్ టైటాన్స్ ఫైనల్ దాకా రావడంలో కీలక పాత్ర పోషించాడు మోహిత్ శర్మ. 14 మ్యాచుల్లో 25 వికెట్లు తీసిన మోహిత్ శర్మ, ఫైనల్ మ్యాచ్లోనూ సంచలన బౌలింగ్ ప్రదర్శన కనబర్చాడు. అయినా మోహిత్కి నిరాశే ఎదురైంది..
జితేశ్ శర్మ: పంజాబ్ కింగ్స్ వికెట్ కీపర్ జితేశ్ శర్మ, 14 మ్యాచుల్లో 309 పరుగులు చేసి మెప్పించాడు. ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో 27 బంతుల్లో 49, రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్లో 28 బంతుల్లో 44 పరుగులు చేసి మెరుపులు మెరిపించిన జితేశ్ శర్మ, వికెట్ కీపింగ్ స్కిల్స్తో ఆకట్టుకున్నాడు. అయితే జితేశ్ని సెలక్టర్లు పట్టించుకోలేదు..
రుతురాజ్ గైక్వాడ్: గత 3 సీజన్లుగా చెన్నై సూపర్ కింగ్స్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు రుతురాజ్ గైక్వాడ్. 2021 సీజన్లో పర్పుల్ క్యాప్ గెలిచిన రుతురాజ్, 2022 సీజన్లో సీఎస్కే తరుపున టాప్ స్కోరర్గా నిలిచాడు. 2023 సీజన్లోనూ 590 పరుగులు చేసిన రుతురాజ్కి టీ20 టీమ్లో చోటు దక్కలేదు..
శివమ్ దూబే: ఐపీఎల్ 2023 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ గెలవడంలో శివమ్ దూబే కూడా ఓ కారణం. ఈ సీజన్లో 35 సిక్సర్లు బాదిన దూబే, 158.33 స్ట్రైయిక్ రేటుతో 418 పరుగులు చేశాడు. టీమిండియా నుంచి పిలుపు ఆశించిన శివమ్ దూబేకి నిరాశే ఎదురైంది..
టీ20 వరల్డ్ కప్ 2022 పరాజయంతో టీమిండియా సంచలన నిర్ణయాలు తీసుకుంటుందని భావించిన అభిమానులకు అలాంటి ఆలోచనలు, బీసీసీఐకి ఉన్నట్టుగా కనిపించడం లేదు. నిలకడలేని ఇషాన్ కిషన్తో పాటు బౌలింగ్ యూనిట్పై పెద్దగా దృష్టి పెట్టకపోవడం చూస్తుంటే.. టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీలోనూ మళ్లీ అదే రిజల్ట్ రిపీట్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు..