రికీ పాంటింగ్, ‘చక్ దే’ సినిమాలో షారుక్ లాంటోడు, ఆ రోజు మా నాన్న చెప్పడం వల్లే... పృథ్వీషా కామెంట్...
అండర్19 వరల్డ్కప్ తర్వాత టీమిండియాలోకి సంచలనంలా దూసుకొచ్చాడు పృథ్వీషా. ఆడిన తొలి టెస్టులోనే భారీ సెంచరీ బాదడమే కాదు, దూకుడైన బ్యాటింగ్తో వీరూని గుర్తుకుతెచ్చాడు. ప్రస్తుతం మంచి ఫామ్లో ఉన్న పృథ్వీషా... విజయ్ హాజారే ట్రోఫీతో పాటు ఐపీఎల్లోనూ అదరగొట్టాడు.
ఐపీఎల్ 2021 సీజన్లో కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో ఒకే ఓవర్లో ఆరుకి ఆరు ఫోర్లు బాది 24 పరుగులు రాబట్టిన పృథ్వీషా, చూడచక్కని షాట్లతో అలరించాడు. తాజాగా మీడియాతో ముచ్చటించిన పృథ్వీషా, కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు...
2019లో నిషేధిత దగ్గు మందు వాడి నిషేధానికి గురి అయ్యాడు పృథ్వీషా. ఈ విషయంపై మాట్లాడిన పృథ్వీషా... ‘ఆ రోజు ఇండోర్లో సయ్యద్ ముస్తాక్ ఆలీ టోర్నీలో పాల్గొంటున్నా. ఆ రోజు నాకు దగ్గు, జలుబు ఉన్నాయి.
డిన్నర్కి వెళ్లిన సమయంలో బాగా దగ్గు రావడంతో సరిగా తినలేకపోయాయి. మా నాన్నకి ఫోన్ చేసి అడిగితే మార్కెట్లో దొరికే ఏదో దగ్గు మందు తీసుకోమని చెప్పారు. నేను కూడా డాక్టర్ని అడగకుండా అది తాగాను. ఆ తర్వాత రెండు రోజులకు డోప్ టెస్టులో పాల్గొన్నా.
దాంతో బ్యాన్ చేసిన డ్రగ్ తీసుకున్నట్టు తేలింది. ఆ సంఘటనతో ఒక్కసారిగా షాక్ అయ్యాను. ఆ పరిస్థితిని మాటల్లో చెప్పలేను. ఎక్కడ చూసినా నా గురించే వార్తలు, ట్రోల్స్. తట్టుకోలేకపోయాను. జనాలు ఇకపై నన్ను ఓ మోసగాడిగా చూస్తారని భయమేసింది...
రెండున్నర నెలల వరకూ దాని గురించే ఆలోచిస్తూ గడిపాను. ఎందుకంటే అప్పటిదాకా మంచి ఫామ్లో ఉన్నాను. టీమిండియాకి రావచ్చని ఆశపడుతున్నా. ఒక్కసారిగా అన్నీ వృథా అయిపోయాయి...’ అంటూ చెప్పుకొచ్చాడు పృథ్వీషా.
‘ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ రికీ పాంటింగ్... నా వరకూ ‘చెక్ దే’ సినిమాలో షారుక్ ఖాన్ లాంటోడు. తన స్పీచ్తో మాలో మంచి మోటివేషన్ నింపుతాడు. గత సీజన్లో, ఈ సీజన్లో ఢిల్లీ పర్ఫామెన్స్ మెరుగవ్వడానికి కారణం ఆయనే...
సచిన్ టెండూల్కర్ నుంచి క్రమశిక్షణగా ఎలా నడుచుకోవాలో అడిగి సలహాలు తీసుకున్నాను... సోషల్ మీడియాకి దూరంగా ఉంటూ, నన్ను నేను ఒత్తిడిని తట్టుకుని ఎలా నిలబడాలో నేర్చుకున్నా’ అంటూ చెప్పుకొచ్చాడు పృథ్వీషా.
రికీ పాంటింగ్ కూడా తన కెరీర్లో చూసిన అత్యుత్తమ బ్యాట్స్మెన్లలో ఒకడిగా యంగ్ ప్లేయర్ పృథ్వీషాని పేర్కొన్నాడు. అయితే అతను చాలా డిఫరెంట్ అని, పరుగులు చేయనప్పుడు అస్సలు ప్రాక్టీస్ చేయడని, పరుగులు సాధిస్తుంటే మాత్రం నెట్స్లో ఎక్కువసేపు గడుపుతాడని చెప్పాడు రికీ పాంటింగ్...
విజయ్ హాజారే ట్రోఫీలో 800+ పరుగులు చేసి ముంబైకి ట్రోఫీ అందించిన పృథ్వీషా, ఐపీఎల్ 2021 సీజన్లోనూ 303 పరుగులతో అదరగొట్టాడు. అయితే అతని వెయిట్ను కారణంగా చూపిస్తూ ఇంగ్లాండ్ టూర్కి ఎంపిక చేసిన జట్టు నుంచి పృథ్వీషాని పక్కనబెట్టింది టీమిండియా.