IPL 2021: బోణీ కొట్టిన రాయల్ ఛాలెంజర్స్... ఆనవాయితీని కొనసాగించిన ముంబై...
ఐపీఎల్ 2021 సీజన్ను విజయంతో ఆరంభించింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. వరుసగా 8 సీజన్లలో మొదటి మ్యాచ్లో ఓడుతూ వస్తున్న ముంబై ఇండియన్స్, మరోసారి ఆ ఆనవాయితీని కొనసాగించింది. 20వ ఓవర్ ఆఖరి బంతిదాకా సాగిన ఉత్కంఠ మ్యాచ్ను గెలిచి, బోణీ చేసింది ఆర్సీబీ...
160 పరుగుల ఈజీ టార్గెట్తో బరిలో దిగిన రాయల్ ఛాలెంజర్స్ డిఫెరెంట్ బ్యాటింగ్ స్ట్రాటెజీతో మూల్యం చెల్లించుకుంది. బ్యాట్స్మెన్కి బదులుగా వాషింగ్టన్ సుందర్తో కలిసి ఓపెనర్గా వచ్చాడు విరాట్ కోహ్లీ...
మొదటి ఓవర్లోనే రోహిత్ శర్మ క్యాచ్ డ్రాప్ చేయడంతో బతికిపోయిన వాషింగ్టన్ సుందర్16 బంతుల్లో 10 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 36 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది రాయల్ ఛాలెంజర్స్..
తొలి మ్యాచ్ ఆడుతున్న రజత్ పటిదార్ 8 బంతుల్లో ఓ ఫోర్తో 8 పరుగులు చేసి ట్రెంట్ బౌల్డ్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. 46 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది ఆర్సీబీ.
గ్లెన్ మ్యాక్స్వెల్, విరాట్ కోహ్లీ కలిసి మూడో వికెట్కి 52 పరుగుల భాగస్వామ్యం జోడించి, ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే 29 బంతుల్లో 4 ఫోర్లతో 33 పరుగులు చేసిన విరాట్ కోహ్లీని బుమ్రా ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు...
ఆ తర్వాత వెంటవెంటనే మరో రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది రాయల్ ఛాలెంజర్స్. 28 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 39 పరుగులు చేసిన గ్లెన్ మ్యాక్స్వెల్, మార్కో జాన్సన్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు...
ఆ తర్వాత వస్తూనే భారీ షాట్కి ప్రయత్నించిన షాబజ్ అహ్మద్ 1 పరుగుకే జాన్సన్ బౌలింగ్లో కృనాల్ పాండ్యాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 106 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది ఆర్సీబీ..
ఆ తర్వాత బుమ్రా బౌలింగ్లో భారీ షాట్కి ప్రయత్నించిన డాన్ క్రిస్టియన్, రాహుల్ చాహార్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాతి ఓవర్లో ఓ సిక్సర్, ఫోర్తో 15 పరుగులు రాబట్టాడు ఏబీ డివిల్లియర్స్...
బుమ్రా వేసిన 19వ ఓవర్లో రెండు బౌండరీలు బాదిన ఏబీ డివిల్లియర్స్... మ్యాచ్ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరువైపు మళ్లించాడు... అయితే బుమ్రా ఓవర్లోనే ఐదో బంతికి సింగిల్కి ప్రయత్నించిన జెమ్మీసన్ను బుమ్రా రనౌట్ చేశాడు...
ఆఖరి ఓవర్లో ఏడు పరుగులు కావాల్సిన దశలో మొదటి బంతికి సింగిల్ తీశాడు ఏబీ డివిల్లియర్స్. రెండో బంతికి రెండు పరుగులు రాబట్టాడు హర్షల్ పటేల్...
మూడో బంతికి సింగిల్ తీయడంతో విజయానికి ఆఖరి మూడు బంతుల్లో 3 పరుగులు కావాలి... రెండో పరుగు కోసం ప్రయత్నించిన ఏబీ డివిల్లియర్స్ రనౌట్ కావడంతో ఉత్కంఠ రేగింది...
27 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 48 పరుగులు చేసిన ఏబీ డివిల్లియర్స్ అవుటైన తర్వాత సిరాజ్ వస్తూనే హర్షల్ పటేల్కి స్ట్రైయిక్ అందించాడు. ఆఖరి బంతికి ఒక్క పరుగు కావాల్సిన దశలో సింగిల్ తీసిన హర్షల్ పటేల్, ఆర్సీబీకి విజయాన్ని అందించాడు.