అప్పుడు బౌలింగ్ చేయనన్నాడు, ఫైనల్ మ్యాచ్లో వికెట్ తీశాడు... విరాట్ కోహ్లీ, జెమ్మీసన్ మధ్య...
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో భారత జట్టు 182 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ముఖ్యంగా అద్భుతంగా ఆడుతున్న విరాట్ కోహ్లీని పెవిలియన్ చేర్చిన కేల్ జెమ్మీసన్, ఆ తర్వాత రిషబ్ పంత్ను కూడా పెవిలియన్ చేర్చి టీమిండియాకి షాక్ ఇచ్చాడు...
ఐపీఎల్ 2021 సీజన్ వేలంలో ఏకంగా రూ.15 కోట్లు పెట్టి, న్యూజిలాండ్ యంగ్ పేసర్ కేల్ జెమ్మీసన్ను కొనుగోలు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. 2021 సీజన్లో అద్భుతంగా రాణిస్తూ, ఆర్సీబీకి అద్భుతంగా ఉపయోగపడ్డాడు జెమ్మీసన్.
అయితే విరాట్ కోహ్లీకి మాత్రం అతను సరిగా ఉపయోగపడడం లేదు... కారణం కేల్ జెమ్మీసన్ను అంత భారీ ధర పెట్టి కొనుగోలు చేసింది కేవలం ఐపీఎల్ కోసం మాత్రమే కాదు... జెమ్మీసన్ కొనుగోలు వెనక చాలా పెద్ద ప్లానింగే ఉంది.
షెడ్యూల్ ప్రకారం ఐపీఎల్ పూర్తి షెడ్యూల్ సాగి ఉంటే, ప్రీమియర్ లీగ్ ముగిసిన తర్వాత 15-18 రోజుల గ్యాప్లో వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ జరిగేది. న్యూజిలాండ్ టూర్లో తనని ఇబ్బంది పెట్టిన జెమ్మీసన్ బౌలింగ్లో ప్రాక్టీస్ చేయాలని భావించాడు కోహ్లీ...
న్యూజిలాండ్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న జెమ్మీసన్ బౌలింగ్లో నెట్స్లో ప్రాక్టీస్ చేస్తే... టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కు బాగా ఉపయోగపడుతుందని భావించాడట విరాట్ కోహ్లీ. ఐపీఎల్ నెట్ సెషన్స్లో కూడా తన ఎత్తుగడను పారించాలని చూశాడు.
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో వాడే డ్యూక్ బాల్తో తనకి నెట్స్లో బౌలింగ్ చేయాలని కోరాడు ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ. అయితే కెప్టెన్ వినతిని సున్నితంగా తిరస్కరించాడు కేల్ జెమ్మీసన్. ఈ విషయాన్ని బయటపెట్టాడు ఆర్సీబీ ఆల్రౌండర్ డాన్ క్రిస్టియన్.
‘అప్పటికి ఐపీఎల్ ప్రారంభమై ఇంకా వారం కూడా కాలేదనుకుంటా. నేను, విరాట్ కోహ్లీ, జెమ్మీసన్ నెట్ ప్రాక్టీస్లో కూర్చొని మాట్లాడుకుంటున్నాం. అప్పుడు... ‘అయితే జిమ్మీ... నువ్వు డ్యూక్ బాల్స్తో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నావా...’ అని అడిగాడు.
‘అవును... నా దగ్గర ఇప్పుడు రెండు డ్యూక్ బాల్స్ కూడా ఉన్నాయి. అక్కడికి వెళ్లేముందు వాటితో ప్రాక్టీస్ చేయాలని తీసుకొచ్చాను...’ అంటూ సమాధానం ఇచ్చాడు జెమ్మీసన్...
‘అవునా... అయితే నాకు నెట్స్లో వాటితో బౌలింగ్ చేయి... నాకు డ్యూక్ బాల్స్ ఆడడం చాలా ఇష్టం’ అంటూ అన్నాడు. దానికి జెమ్మీ... ‘‘సారీ కెప్టెన్... నో ఛాన్స్... నేను, నీకు డ్యూక్ బాల్స్తో బౌలింగ్ చేయను’ అని నవ్వేశాడు.
విరాట్ కోహ్లీ కూడా నవ్వుతూ వెళ్లిపోయాడు. అంటూ సమాధానం ఇచ్చాడు’ అంటూ చెప్పుకొచ్చాడు డాన్ క్రిస్టియన్.
ఐపీఎల్ తనకి నెట్స్లో బౌలింగ్ చేయని కేల్ జెమ్మీసన్, ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో విరాట్ కోహ్లీ వికెట్ తీసి భారత జట్టును దెబ్బతీశాడు...
132 బంతుల్లో ఓ ఫోర్తో 44 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, జెమ్మీసన్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. రివ్యూకి వెళ్లినా ఫలితం లేకపోయింది...