ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ నామినేషన్లలో రవిచంద్రన్ అశ్విన్... జో రూట్, మేయర్తో పాటు...
ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్టు సిరీస్లో అదరగొడుతున్న భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్- ఫిబ్రవరి’ నామినేషన్లలో నిలిచాడు. అశ్విన్తో పాటు ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్, వెస్టిండీస్ యంగ్ ప్లేయర్ కేల్ మేయర్ కూడా ఈ నామినేషన్లలో ఉన్నారు..
జనవరి నెలకు ప్రకటించిన మొట్టమొదటి ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును భారత యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. గబ్బా టెస్టులో రిషబ్ పంత్ ఇన్నింగ్స్, ఆసియా టూర్లో ఈ వికెట్ కీపర్ రాణించిన విధానానికి ఈ అవార్డు దక్కింది.
ఫిబ్రవరిలో జరిగిన రెండో టెస్టులో అద్భుత సెంచరీతో అదరగొట్టిన రవిచంద్రన్ అశ్విన్, రెండో టెస్టులో 8, మూడో టెస్టులో 7 వికెట్లు పడగొట్టాడు.
మూడు టెస్టుల్లో కలిపి 176 పరుగులు చేసిన అశ్విన్, 24 వికెట్లు తీసి పురుషుల విభాగంలో ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ నామినేషన్లలో ఉన్నాడు...
అలాగే టీమిండియాతో మొదటి టెస్టులో డబుల్ సెంచరీ బాదిన ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ కూడా నామినేషన్లలో నిలిచాడు. జనవరి నెల అవార్డుల నామినేషన్లలో ఉన్న జో రూట్, ఎక్కువ ఓట్లు పొందలేకపోయాడు.
ఫిబ్రవరి నెలలో మొత్తంగా 333 పరుగులు చేసిన జో రూట్, ఆరు వికెట్లు కూడా తీశాడు. టీమిండియాతో జరిగిన మూడో టెస్టు మొదటి ఇన్నింగ్స్లో జో రూట్ 8 పరుగులకే 5 వికెట్లు పడగొట్టిన విషయం తెలిసిందే.
బంగ్లాదేశ్తో జరిగిన టెస్టు మ్యాచ్లో ఆరంగ్రేటం చేసి మొదటి మ్యాచ్లో 210 పరుగులు బాది, ఒంటిచేత్తో విజయాన్ని అందించిన 28 ఏళ్ల విండీస్ ప్లేయర్ కేల్ మేయర్ కూడా నామినేషన్లలో ఉన్నాడు.
మహిళల కేటగిరీలో ఇంగ్లాండ్ ప్లేయర్లు టమ్మీ బేమంట్, నాట్ సివెర్, అలాగే బ్రూకీ హల్లీడే నామినేషన్లలో నిలిచారు... అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్ ఓటింగ్ ముగిసిన తర్వాత మార్చి 8న ఫలితాలు వెలువరించనుంది ఐసీసీ.