ఇదే మంచి సమయం... ఇంగ్లాండ్ సిరీస్ను టీమిండియా 3-2 తేడాతో గెలుస్తుంది... రాహుల్ ద్రావిడ్ కామెంట్...
ఆస్ట్రేలియా టూర్ విజయం తర్వాత టీమిండియాపై అంచనాలు ఆకాశాన్ని అంటాయి. ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్తో పాటు ఐదు మ్యాచుల టెస్టు సిరీస్ కోసం ఇంగ్లాండ్ వెళ్తున్న టీమిండియా... ఈ సారి మ్యాజిక్ చేస్తుందని అంటున్నాడు భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్...
టీమిండియాకి ఇంగ్లాండ్లో ఏమంత మెరుగైన రికార్డు లేదు. ఇంగ్లాండ్తో ఇంగ్లాండ్లో ఇప్పటిదాకా 17 టెస్టు సిరీస్లు ఆడిన టీమిండియా, కేవలం 3 మాత్రమే గెలవగలిగింది. ఇంగ్లాండ్లో మొత్తంగా 6 టెస్టు మ్యాచుల్లో మాత్రమే విజయం సాధించింది.
1971లో అజిత్ వాడేకర్, 1986లో కపిల్ దేవ్, 2007లో రాహుల్ ద్రావిడ్ మాత్రమే ఇంగ్లాండ్లో టెస్టు సిరీస్ గెలిచిన భారత కెప్టెన్లుగా ఉన్నారు. 2002లో సౌరవ్ గంగూలీ టెస్టు సిరీస్ను సమం చేయగలిగాడు...
మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో 2014లో చివరిసారిగా లార్డ్స్లో 95 పరుగులతో విజయం సాధించింది టీమిండియా. అయిత మొదటి టెస్టు ఓడినా, ఆ తర్వాత అద్భుతంగా కమ్బ్యాక్ ఇచ్చిన ఇంగ్లాండ్ 3-1 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది.
కెప్టెన్గా తొలిసారి ఇంగ్లాండ్లో పర్యటించబోతున్నాడు విరాట్ కోహ్లీ. 2014 టూర్లో విరాట్ కోహ్లీ ఘోరంగా విఫలమయ్యాడు. ఐదు టెస్టుల్లో 1, 8, 25, 0, 39, 28, 0, 7, 20 పరుగులు చేసి... 13.50 సగటుతో పరుగులు చేశాడు. కోహ్లీ కెరీర్లో అత్యంత క్లిష్టమైన స్టేజ్ ఇదే...
‘టీమిండియాకి ఇది చాలా మంచి అవకాశం. ఇంగ్లాండ్ బౌలింగ్ చాలా పటిష్టంగా ఉంది. అందులోనూ ఇంగ్లాండ్ పిచ్లపై వాళ్లు రెచ్చిపోతారు. అయితే భారత జట్టు మంచి ఫామ్లో కనిపిస్తోంది. స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్ విజయం వారిలో నమ్మకాన్ని రెట్టింపు చేసి ఉండొచ్చు...
టీమిండియా దగ్గర చాలామంది పేసర్లు అందుబాటులో ఉన్నారు. వారి బ్యాటింగ్ ఆర్డర్లో టాప్ 7 దాకా మంచి బ్యాట్స్మెన్ ఉన్నారు. జో రూట్తో పాటు బెన్ స్టోక్స్ కూడా అదరగొడతాడు. అయితే ఈ ఇద్దరిపై రవిచంద్రన్ అశ్విన్కి మంచి రికార్డు ఉంది.
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ ముగిసిన తర్వాత టీమిండియాకి కావాల్సినంత సమయం దొరుకుతుంది. అక్కడి పిచ్లకు, పరిస్థితులకు అలవాటు పడడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇప్పటి జట్టులో ఉన్న ప్లేయర్లు కొందరు ఇప్పటికే ఇంగ్లాండ్ టూర్లో ఆడారు కూడా...
మన బ్యాటింగ్ ఆర్డర్లో కూడా ఛతేశ్వర్ పూజారా, విరాట్ కోహ్లీ, అజింకా రహానే వంటి మంచి అనుభవం ఉన్న బ్యాట్స్మెన్ ఉన్నారు. టీమిండియా తనమీద పెట్టిన అంచనాలకు తగ్గ ప్రదర్శన ఇస్తే, ఈసారి 3-2 తేడాతో టెస్టు సిరీస్ గెలుస్తుంది...’ అని అంచనా వేశాడు భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్
జూన్ 18నుంచి 22 వరకూ జరిగే ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ ముగిసిన తర్వాత నెల రోజుల పాటు అక్కడే ఉండి, ఆగస్టు 4 నుంచి ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ ఆడనుంది భారత జట్టు. ఐదు టెస్టుల సిరీస్ సెప్టెంబర్ 14న ముగియనుంది.