వచ్చే సీజన్కి అతనే మా కెప్టెన్... మయాంక్ అగర్వాల్పై భరోసా పెట్టిన పంజాబ్ కింగ్స్...
ఐపీఎల్లో 15 సీజన్లు ముగిస్తే ఇప్పటికే పంజాబ్ కింగ్స్కి 14 మంది కెప్టెన్లు మారారు. 15 ఏళ్లల్లో ఒక్కసారి సెమీస్, మరొక్కసారి ఫైనల్ చేరిన పంజాబ్ కింగ్స్... లక్ కోసం సీజన్కో కెప్టెన్ని మారుస్తూ వస్తోంది. ఐపీఎల్ 2022 సీజన్లో పంజాబ్ కింగ్స్కి కెప్టెన్గా వ్యవహరించిన మయాంక్ అగర్వాల్ని కూడా ఆ పొజిషన్ నుంచి తప్పించాలని ఆ ఫ్రాంఛైజీ ప్రయత్నిస్తోందని వార్తలు వచ్చాయి...
ఐపీఎల్ 2020-21 సీజన్లలో పంజాబ్ కింగ్స్కి కెప్టెన్గా వ్యవహరించిన కెఎల్ రాహుల్ని రూ.17 కోట్ల భారీ మొత్తానికి డ్రాఫ్ట్ రూపంలో కొనుగోలు చేసింది లక్నో సూపర్ జెయింట్స్... గత రెండు సీజన్లలో పంజాబ్ కింగ్స్ని ప్లేఆఫ్స్కి చేర్చలేకపోయిన కెఎల్ రాహుల్, లక్నో కెప్టెన్గా తొలి సీజన్లోనే టీమ్ని ప్లేఆఫ్స్ చేర్చాడు...
కెఎల్ రాహుల్ హ్యాండ్ ఇవ్వడంతో అతని స్థానంలో రాహుల్ స్నేహితుడు మయాంక్ అగర్వాల్కి కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది పంజాబ్ కింగ్స్ టీమ్ మేనేజ్మెంట్. 2021 సీజన్లో కెఎల్ రాహుల్ కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరినప్పుడు ఓ మ్యాచ్కి మయాంక్ అగర్వాల్ కెప్టెన్గా వ్యవహరించాడు...
Image credit: PTI
కెఎల్ రాహుల్ దూరమైన మ్యాచ్లో 99 పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్, జట్టును అద్భుతంగా నడిపించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఈ మ్యాచ్ కారణంగానే కెఎల్ రాహుల్ తప్పుకోగానే ఆ స్థానంలో మయాంక్ అగర్వాల్ని కెప్టెన్గా నియమించింది పంజాబ్ కింగ్స్...
అయితే ఐపీఎల్ 2022లో 14 మ్యాచుల్లో 7 విజయాలు అందుకున్న పంజాబ్ కింగ్స్, వరుసగా నాలుగో సీజన్లోనూ ఆరో స్థానంలోనే ముగించింది. గత మూడు సీజన్లలో పంజాబ్ కింగ్స్కి బ్యాటర్గా రాణించిన మయాంక్ అగర్వాల్, కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన తర్వాత బ్యాటుతో పెద్దగా రాణించలేకపోయాడు...
ఐపీఎల్ 2022లో 12 ఇన్నింగ్స్ల్లో 16.33 సగటుతో 196 పరుగులు చేశాడు మయాంక్ అగర్వాల్. దీంతో మయాంక్ అగర్వాల్ని తప్పించి కొత్త కెప్టెన్ని వెతికే పనిలో పంజాబ్ కింగ్స్ ఉందని వార్తలు వచ్చాయి. ఈ వార్తలను సోషల్ మీడియా ద్వారా ఖండించింది పంజాబ్...
‘‘కొన్ని స్పోర్ట్స్ వెబ్సైట్స్లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్సీలో మార్పులు చేయబోతున్నట్టు కొన్నిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి . వాటిల్లో ఎలాంటి నిజం లేదు. అధికారికంగా ప్రకటించేదాకా ఏ రూమర్స్ని నమ్మవద్దని వేడుకుంటున్నాం...’ అంటూ రాసుకొచ్చింది పంజాబ్ కింగ్స్...
అయితే పంజాబ్స్ కింగ్స్ హెడ్ కోచ్ని మార్చే పనిలో ఉందని వార్తలు వచ్చాయి. అనిల్ కుంబ్లే స్థానంలో కొత్త హెడ్ కోచ్గా ఇయాన్ మోర్గాన్, ట్రేవర్ బేలిస్, రవిశాస్త్రిలను పంజాబ్ కింగ్స్ సంప్రదించిందని సమాచారం. అయితే ఈ వార్తలపై మాత్రం పంజాబ్ కింగ్స్ మేనేజ్మెంట్ స్పందించలేదు...