ముంబైలో పెట్టినప్పుడు, మొహాలీలో పెట్టలేరా... బీసీసీఐకి పంజాబ్ సీఎం లేఖ...
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్ నిర్వహణకు ఆరు నగరాలను మాత్రమే ఎంచుకున్న విషయం తెలిసిందే. వీటిలో ఐదు నగరాలకు మాత్రమే జట్లు ఉన్నాయి. దీంతో మిగిలిన మూడు జట్ల నుంచి, ఆయా రాష్ట్రాల నుంచి అసంతృప్తి వ్యక్తం అవుతోంది.
ఐపీఎల్ 2021 సీజన్ నిర్వహణ కోసం ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం ఉన్న అహ్మదాబాద్ను ఎంచుకున్న ఐపీఎల్ యాజమాన్యం, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, కోల్కత్తా, ముంబై నగరాల్లో మ్యాచులు నిర్వహించబోతున్నట్టు షెడ్యూల్ కూడా విడుదల చేసింది...
అయితే కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న ముంబైలో కూడా మ్యాచులు నిర్వహిస్తున్నప్పుడు మొహాలీలో మ్యాచులు పెట్టలేరా? అంటూ ఐపీఎల్ యాజమాన్యాన్ని సూటిగా ప్రశ్నించాడు పంజాబ్ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్...
‘ముంబైలో రోజుకి 9వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. అలాంటి ముంబైలో ఐపీఎల్ మ్యాచులు నిర్వహిస్తున్నప్పుడు, మొహాలీలో మ్యాచులు పెట్టడానికి మీకు వచ్చిన సమస్య ఏంటి?
ఇక్కడ కరోనా కేసులు చాలా తక్కువగా ఉన్నాయి. ఐపీఎల్ 2021 నిర్వహణకు అవసరమైన చర్యలన్నీ తీసుకుంటామని నేను బీసీసీఐకి లేఖ రాశాను’ అంటూ తెలిపారు పంజాబ్ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్.
హైదరాబాద్లో మ్యాచులు లేకపోవడంపై తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్లో కూడా మ్యాచులు పెట్టాలని, అవసరమైన చర్యలన్నీ తీసుకుంటామని టీఆర్ఎస్ మంత్రి ప్రకటించినా బీసీసీఐ స్పందించలేదు...
మొహాలీతో పాటు రాజస్థాన్, హైదరాబాద్లలో మ్యాచులు లేకపోవడం వల్ల సన్రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్కి సొంత గ్రౌండ్లో ఆడే అవకాశం లేకుండా పోయింది...
ఏప్రిల్ 9 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్ 2021 సీజన్, మే 30న జరిగే ఫైనల్ మ్యాచ్తో ముగుస్తుంది. గ్రూప్ మ్యాచులు ముగిసిన తర్వాత నాకౌట్ మ్యాచులతో పాటు ఫైనల్ కూడా మొతేరాలోని నరేంద్ర మోదీ స్టేడియంలోనే జరగనుంది..
పంజాబ్లో జరుగుతున్న రైతు నిరసనల కారణంగా ఐపీఎల్ 2021 సీజన్కి అవరోధాలు, సమస్యలు కలగవచ్చని బీసీసీఐ, ఐపీఎల్ యాజమాన్యం భావించి ఉండవచ్చని, అందుకే మొహాలీలో మ్యాచులు నిర్వహించేందుకు సాహసించలేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.