పూజారా స్థానంలో పృథ్వీషాని ఆడించండి... ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్పై బ్రాడ్ హాగ్...
ఒకే ఒక్క టెస్టు వైఫల్యం... భారత సీనియర్ బ్యాట్స్మెన్ ఛతేశ్వర్ పూజారా కెరీర్నే ప్రశ్నార్థకంలో పడేసింది. ఆరు నెలల క్రితం భారత జట్టుకి ఆపద్భాంధవుడిగా మారి, రాకాసి బౌన్సర్లకు అడ్డుగా నిలబడిన ‘నయావాల్’ పూజారా ప్లేస్పై ఇప్పుడు అనుమానాలు రేగుతున్నాయి...
వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో రెండు ఇన్నింగ్స్ల్లో పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు ఛతేశ్వర్ పూజారా. తొలి ఇన్నింగ్స్లో 8, రెండో ఇన్నింగ్స్లో 15 పరుగులు చేసి తీవ్రంగా నిరాశపరిచాడు...
డిఫెన్స్ ఆడుతూ, అవుట్ అవ్వకుండా ఉండాలని భావిస్తే... పరుగులు రావని, ఆ మైండ్సెట్ ఉన్న ప్లేయర్లు టీమిండియాకి అవసరం లేదనట్టు ఫైనల్ పరాజయం తర్వాత విరాట్ కోహ్లీ కామెంట్ చేశాడు...
అదీకాకుండా ఛతేశ్వర్ పూజారా సెంచరీ చేసిన రెండున్నర ఏళ్లు దాటుతోంది. ఆస్ట్రేలియా టూర్లో మూడు హాఫ్ సెంచరీలు చేసినా, సెంచరీ మార్కు అందుకోలేకపోయాడు ‘మోడ్రన్ వాల్’...
ఈ కారణాలతో ఛతేశ్వర్ పూజారాపై అసంతృప్తిగా ఉన్న టీమిండియా మేనేజ్మెంట్, అతని స్థానంలో మయాంక్ అగర్వాల్, కెఎల్ రాహుల్ వంటి కుర్రాళ్లను ఆడించాలనే ప్రయత్నం చేస్తోందని టాక్ వినబడుతోంది.
ఓపెనర్ శుబ్మన్ గిల్ గాయం కారణంగా ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్కి దూరం కావడంతో మయాంక్ అగర్వాల్ ఆడడం ఖరారు కాగా, పూజారా ప్లేస్ ఉంటుందా? అతని స్థానంలో విహారి లేదా మరో ప్లేయర్కి అవకాశం ఇస్తారా? అనేది తేలాల్సి ఉంది.
అయితే పూజారాని తప్పించాలని భావిస్తే కనక అతని స్థానంలో కెఎల్ రాహుల్ని ఆడించడం కంటే... యంగ్ సెన్సేషనల్ ఓపెనర్ పృథ్వీషాని ఆడిస్తే బాగుంటుందని అంటున్నాడు ఆసీస్ మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్...
‘ఛతేశ్వర్ పూజారా స్థానాన్ని భర్తీ చేయగల సామర్థ్యం ఉన్న క్రికెటర్ ఎవరైనా ఉన్నారా అంటే అది పృథ్వీషా. అతను ఓపెనర్గా కంటే మిడిల్ ఆర్డర్లో చక్కగా సరిపోతాడని అనుకుంటున్నా...
అతనిలో చాలా టాలెంట్ ఉంది. సుదీర్ఘ కాలం క్రికెట్లో కొనసాగగలడు... అతను ఇంగ్లాండ్ టూర్కి ఎంపిక కాకపోయినా వైల్డ్ కార్డ్ ఎంట్రీగా రావచ్చు...’ అంటూ కామెంట్ చేశాడు బ్రాడ్ హాగ్..
గబ్బా టెస్టులో ఆస్ట్రేలియా బౌలర్ల బౌన్సర్లకు అడ్డుగా తన శరీరాన్ని పెట్టి, మోస్ట్ డేరింగ్ ఇన్నింగ్స్ ఆడిన ఛతేశ్వర్ పూజారా... టీమిండియాతో పాటు యావత్ క్రికెట్ ఫ్యాన్స్ మనసులు గెలుచుకున్నాడు...
మరోవైపు లంక టూర్కి ఎంపికైన పృథ్వీషాని, వీలైనంత తొందరగా ఇంగ్లాండ్కి రప్పించాలని ప్రయత్నాలు చేస్తోంది బీసీసీఐ. లంకతో సిరీస్ ముగిసిన తర్వాత నేరుగా ఇంగ్లాండ్ చేరుకునే పృథ్వీషా, మూడో టెస్టు నుంచి జట్టుకి అందుబాటులో ఉంటాడని సమాచారం...