- Home
- Sports
- Cricket
- ఐపీఎల్లో అంత రిలాక్స్డ్గా ఉంటే కుదరదు.. మళ్లీ దేశవాళీకే వెళ్లాలి.. షా, సర్ఫరాజ్లకు కీలక సూచన
ఐపీఎల్లో అంత రిలాక్స్డ్గా ఉంటే కుదరదు.. మళ్లీ దేశవాళీకే వెళ్లాలి.. షా, సర్ఫరాజ్లకు కీలక సూచన
IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్ -16వ ఎడిషన్ లో భారీ అంచనాలతో వచ్చిన దేశవాళీ సూపర్ స్టార్స్ పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్ లు దారుణంగా నిరాశపరిచారు.

Image credit: PTI
దేశవాళీ క్రికెట్ లో ముంబై జట్టు తరఫున ఆడే ఇద్దరు స్టార్ బ్యాటర్లు పృథ్వీ షా, సర్పరాజ్ ఖాన్ లు ఈ ఐపీఎల్ లో మెరుగైన ప్రదర్శనలు చేస్తారని ఢిల్లీ క్యాపిటల్స్ తో పాటు వారి అభిమానులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఈ సీజన్ లో ఈ ఇద్దరూ దారుణంగా విఫలమయ్యారు.
Image credit: PTI
ఈ సీజన్ కు ముందు ఫస్ట్ క్లాస్ క్రికెట్, దేశవాళీగా జరిగే ముస్తాక్ అలీ, విజయ్ హజారే ట్రోఫీలలో అద్భుతంగా ఆడిన ఈ ఇద్దరూ ఐపీఎల్ లో కూడా అదరగొడతారని అనుకున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ రెగ్యులర్ కెప్టెన్ రిషభ్ పంత్ కు గాయం కావడంతో ఢిల్లీ ఈ ఇద్దరిమీద భారీగా ఆశలు పెట్టుకుంది. కానీ సర్ఫరాజ్ ఖాన్ ఈ సీజన్ లో నాలుగు మ్యాచ్ లే ఆడి 53 పరుగులు చేశాడు. పేలవ ప్రదర్శనలతో అతడికి తర్వాత జట్టులో చోటే దక్కలేదు.
పృథ్వీ షా కూడా ఆరు మ్యాచ్ లలో 47 పరుగులే చేశాడు. గత సీజన్ లో పవర్ ప్లే లో మరే ఇండియన్ బ్యాటర్ కు లేని స్ట్రైక్ రేట్ ఉన్న షా.. ఈ సీజన్ లో మాత్రం పట్టుమని పది నిమిషాలు కూడా క్రీజులో ఉండలేకపోయాడు. 6 ఇన్నింగ్స్ లలో ఒక్క మ్యాచ్ లో కూడా 20 పరుగులు చేయలేకపోయాడు.
ఈ ఇద్దరి వైఫల్యాలపై తాజాగా పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ కోచ్ వసీం జాఫర్ మాట్లాడుతూ.. ‘మీరు ముస్తాక్ అలీ ట్రోఫీ ఆడేప్పుడు అక్కడ మీరు మీ రాష్ట్రానికి ప్రాతినిథ్యం వహిస్తారు. అక్కడ మీరు రెండు మూడు సార్లు విఫలమైనా కాస్త రిలాక్స్ అవడానికి టైమ్ దొరుకుతుంది. కానీ ఐపీఎల్ అలా కాదు.
ఇక్కడ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మీరు రెండు మూడు మ్యాచ్ లలో ఆడకుంటే మీ స్థానంలో మరో ప్లేయర్ ను ఆడించేందుకు టీమ్స్ రెడీగా ఉంటాయి. అదీగాక ప్రైస్ ట్యాగ్ ఒత్తిడి అదనం. ఒత్తిడిని అధిగమించినవారే విజేతగా నిలుస్తారు. పృథ్వీ గత సీజన్ లో బాగానే రాణించాడు. కానీ ఈ ఏడాది అతడు అంచనాలకు తగ్గట్టు ఆడటం లేదు. గత సీజన్ లో అతడు పవర్ ప్లేలో ఎంతటి విద్వంసాలు సృష్టించాడో అందరికీ తెలుసు.
ఈ ఫార్మాట్ లో చాలా మంది ప్రముఖ ఆటగాళ్లు కూడా స్ట్రగుల్ అవుతున్నారు. అది కామన్. సర్ఫరాజ్ కూడా దేశవాళీలో అద్భుతంగా ఆడి ఐపీఎల్ కు వచ్చినవాడే. కానీ ఆ ప్రదర్శనలను ఐపీఎల్ లో కంటిన్యూ చేయలేకపోయాడు. ఇక ఇప్పుడు ఈ ఇద్దరూ భారత జట్టులో చోటు దక్కించుకోవాలంటే తప్పకుండా దేశవాళీలో మళ్లీ రాణించాలి. ఐపీఎల్ గురించి వీలైనంత త్వరగా మరిచిపోయి దేశవాళీలో భాగా ఆడటం మీద దృష్టి పెట్టాలి..’ అని చెప్పుకొచ్చాడు.