మరోసారి దేవుడి మీదే భారం వేసిన పృథ్వీ షా.. బీసీసీఐపై నెటిజన్ల ఆగ్రహం
BCCI: టీమిండియా యువ బ్యాటర్, జూనియర్ సెహ్వాగ్ గా గుర్తింపు పొందిన ముంబై ఆటగాడు పృథ్వీ షాకు సెలక్టర్లు మరోసారి రిక్తహస్తమే చూపారు. న్యూజిలాండ్, బంగ్లాదేశ్ పర్యటనలకు అతడిని పట్టించుకోలేదు.

ఇటీవల కాలంలో ఐపీఎల్ తో పాటు దేశవాళీ క్రికెట్ లోనూ నిలకడగా రాణిస్తున్న ముంబై బ్యాటర్ పృథ్వీ షా కు మరోసారి నిరాశే ఎదురైంది. దేశవాళీలో అదిరిపోయే ప్రదర్శనలిస్తున్నా షా కు జాతీయ జట్టులో అవకాశాలు రావడం లేదు. తాజాగా ఆలిండియా సెలక్షన్ కమిటీ ఎంపిక చేసిన న్యూజిలాండ్, బంగ్లాదేశ్ పర్యటనలలో అతడి పేరు లేదు.
ఈ రెండు పర్యటనలకు గాను ఆలిండియా సెలక్షన్ కమిటీ చీఫ్ చేతన్ శర్మ సోమవారం సాయంత్రం జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో షా పేరు లేకపోవడంతో షా మరోసారి తన ఇష్టదైవం సాయిబాబా మీదే భారం వేశాడు.
చేతన్ శర్మ జాబితా ప్రకటించాక ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో పృథ్వీ షా స్పందిస్తూ.. సాయిబాబా ఫోటో షేర్ చేస్తూ అందులో ‘సాయిబాబా.. అంతా నువ్వు చూస్తూనే ఉంటావని ఆశిస్తున్నా...’ అని షేర్ చేశాడు. ఈ పోస్ట్ సెలక్టర్లను ఉద్దేశించి చేసిందేనని నెటిజన్లు చెవులు కొరుక్కుంటున్నారు.
పృథ్వీ షా ఇలా సాయిబాబా ఫోటోతో గతంలో కూడా ఓ పోస్ట్ కూడా పెట్టి బీసీసీఐని పరోక్షంగా టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. ఆగస్టులో భారత జట్టు ఐర్లాండ్ పర్యటనకు వెళ్లిన నేపథ్యంలో అప్పుడు ప్రకటించిన జట్టులో కూడా షా పేరు లేదు.
అప్పుడు కూడా షా.. ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా అతడు స్పందిస్తూ.. ‘ఎప్పుడూ నమ్మకాన్ని వదులుకోకండి.. అద్భుతాలు మీ మార్గంలోనే ఉన్నాయి’ అని షిర్డీ సాయిబాబా ఉన్న ఫోటోను జతచేసి పోస్ట్ చేశాడు. ఈ ఫోటో అప్పట్లో వైరల్ గా మారింది.
ఇదిలాఉండగా.. దేశవాళీ క్రికెట్ లో రాణిస్తున్నా షా ను జాతీయ జట్టులోకి ఎంపిక చేయకపోవడంపై నెటిజన్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బోర్డు రాజకీయాలకు పృథ్వీ షా తో పాటు రుతురాజ్ గైక్వాడ్, సర్ఫరాజ్ అహ్మద్ కూడా బలవుతున్నారని కామెంట్స్ చేస్తున్నారు.
కాగా చేతన్ శర్మ నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో పృథ్వీ షా గురించిన ప్రస్తావన వచ్చింది. షా ను ఎందుకు ఎంపిక చేయడం లేదని విలేకరులు చేతన్ శర్మను ప్రశ్నించారు. దానికి శర్మ.. ‘పృథ్వీ మా దృష్టిలో ఉన్నాడు. అతడితో మేం టచ్ లోనే ఉన్నాం. షా దేశవాళీలో అత్యద్భుత ఫామ్ లోనే ఉన్నాడనంలో సందేహమే లేదు. అయితే ప్రస్తుతం భారత జట్టులో ఆడుతున్న యువ ఆటగాళ్లకు మరో అవకాశమిచ్చాం..’ అని తెలపడం గమనార్హం.