మీకెన్నిసార్లు చెప్పినా బుద్ది రాదా.. అసలు వీటిని క్రికెట్ పిచ్లు అంటారా..? పాకిస్తాన్పై ఐసీసీ ఆగ్రహం
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) పై అంతర్జాతీయ క్రికెట్ మండలి మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. నాసిరకం పిచ్ లు తయారుచేసి టెస్టు క్రికెట్ ను నాశనం చేస్తున్నదని పాక్ ఫ్యాన్స్ సైతం పీసీబీ పై దుమ్మెత్తి పోస్తున్న వేళ ఐసీసీ కూడా స్పందించింది.
పదే పదే జీవంలేని పిచ్లను తయారుచేస్తున్న పాకిస్తాన్ అంతర్జాతీయ క్రికెట్ సమాజం ముందు అబాసుపాలవుతున్నది. నాసిరకం పిచ్ లను తయారుచేసి టెస్టు క్రికెట్ను నాశనం చేస్తున్నదని ఆ బోర్డుపై స్వయంగా పాకిస్తాన్ క్రికెట్ అభిమానులే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వేళ తాజాగా ఐసీసీ కూడా స్పందించింది.
మీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్దిరాదా..? ఈ పిచ్ లు ఏంటి..? అసలు టెస్టు క్రికెట్ ఆడే పిచ్ లేనా ఇవి..? అంటూ కన్నెర్రజేసింది. ఇలాంటి పిచ్ లు తయారుచేస్తే క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించింది. పాకిస్తాన్ - ఇంగ్లాండ్ నడుమ రావల్పిండి వేదికగా ముగిసిన టెస్టుపై ఐసీసీ రివ్యూ చేసింది.
రావల్పిండిలో ఇరు జట్ల మధ్య ముగిసిన తొలిటెస్టుకు పీసీబీ ఫ్లాట్ పిచ్ ను తయారుచేసింది. బౌలర్లకు ఏమాత్రం సహకారం అందించని ఈ పిచ్ ను పరిశీలించిన ఐసీసీ పిచ్ క్యూరేటర్ల బృందం.. ఈ పిచ్ ను ‘బిలో యావరేజ్’ అని పేర్కొంది. అసలు రావల్పిండి పిచ్ అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడే పిచ్ లా లేదని పీసీబీపై మొట్టికాయలు వేసింది. ఐసీసీ విధించిన ప్రమాణాలను రావల్పిండి పిచ్ అందుకోలేదని సీరియస్ అయింది.
జీవం లేని పిచ్ ను తయారుచేసినందుకు గాను పీసీబీపై ఆగ్రహించిన ఐసీసీ.. క్రమశిక్షణ చర్యలలో భాగంగా రావల్పిండి పిచ్ కు ఓ డీ మెరిట్ పాయింట్ ఇచ్చింది. కాగా రావల్పిండి పిచ్ కు డీమెరిట్ పాయింట్ రావడం ఇదే తొలిసారి కాదు.
ఈ ఏడాది పాకిస్తాన్ పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా తో టెస్టు సిరీస్ లో భాగంగా రావల్పిండిలో తొలి టెస్టు జరిగింది. ఈ మ్యాచ్ కు కూడా ఫ్లాట్ పిచ్ ను తయారుచేసిన పీసీబీ.. విమర్శలపాలైంది. అప్పుడు కూడా పిచ్ ను తనిఖీ చేసిన ఐసీసీ.. డీమెరిట్ పాయింట్ ఇచ్చి ‘బిలో యావరేజ్ పిచ్’ అని కామెంట్ చేసింది.
రావల్పిండిలో ఇంగ్లాండ్ - పాకిస్తాన్ మధ్య ముగిసిన టెస్టులో పరుగుల వరద పారింది. తొలిరోజు ఇంగ్లాండ్.. 75 ఓవర్లలోనే 506 పరుగులు చేసింది. మొత్తంగా ఈ టెస్టులో 1,768 పరుగులు నమోదయ్యాయి. చివరివరకూ ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ గెలిచినా బ్యాటర్లు మాత్రం పండుగ చేసుకున్నారు.