బిలియన్ డాలర్ టీమ్ని ఓడించాం, మాకు క్రెడిట్ ఇవ్వాల్సిందే... పీసీబీ ఛైర్మెన్ రమీజ్ రాజా...
టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో పాకిస్తాన్ చేతుల్లో 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది భారత జట్టు. ఐసీసీ వరల్డ్ కప్ చరిత్రలో టీమిండియాపై పాకిస్తాన్కి ఇదే మొట్టమొదటి విజయం. ఆ తర్వాత ఆసియా కప్ 2022 టోర్నీలోనూ పాక్ చేతుల్లో పరాజయాన్ని చవిచూసింది టీమిండియా. ఈ రెండు విజయాలపై సంచలన కామెంట్లు చేశాడు పీసీబీ ఛైర్మెన్ రమీజ్ రాజా...
2021 టీ20 వరల్డ్ కప్ నుంచి ఇప్పటిదాకా ఇండియా, పాకిస్తాన్ పురుషుల జట్ల మధ్య మూడు మ్యాచులు జరగగా రెండింట్లో పాక్కే విజయం దక్కింది. ఆసియా కప్ 2022 టోర్నీలో జరిగిన మొదటి మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో విజయం అందుకోగలిగింది టీమిండియా...
విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో 10 వికెట్ల తేడాతో పరాజయాన్ని ఎదుర్కొన్న టీమిండియా, ఏడాది తర్వాత ఆసియా కప్ 2022 సూపర్ 4 రౌండ్లో రోహిత్ శర్మ కెప్టెన్సీలోనూ పాక్ని ఓడించలేకపోయింది.ఈ రెండు పరాజయాలు అటు పాక్కి నూతన ఉత్సాహాన్ని నింపితే, టీమిండియా ఫ్యాన్స్ని దుఃఖ సాగరంలో పడేశాయి...
‘ఇండియా, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే స్కిల్స్, టాలెంట్ కంటే ఎక్కువగా ఎమోషన్స్ మధ్య పోరాటం జరుగుతుంది. ఆటగాళ్లు మెంటల్ స్ట్రెంగ్త్తో పోటీపడాల్సి ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉండి, మెంటల్గా మ్యాచ్పై పూర్తి ఫోకస్ పెట్టిన జట్టుకే విజయం దక్కుతుంది...
ఐసీసీ టోర్నీల్లో ఇండియాతో మ్యాచ్ అంటే ఎప్పుడూ పాకిస్తాన్ అండర్ డాగ్గానే ఉండేది. ప్రెషర్ తీసుకుని ఇండియాతో మ్యాచుల్లో ఓడిపోతూ వచ్చేవాళ్లం. కొన్నాళ్లకు ఐసీసీ టోర్నీల్లో ఇండియాని ఓడించగలమా? అనే అనుమానం కూడా మాలో మొదలైంది...
టీమిండియాని ఓడించలేం... అని చాలామంది ఫిక్స్ అయిపోయారు కూడా. అయితే గత వరల్డ్ కప్లో దాన్ని సాధించాం. టీమిండియాని ఓడించి అద్భుతం క్రియేట్ చేశాం. అది అనుకోకుండా వచ్చిన విజయమే కావచ్చు కానీ అందులో మాకు క్రెడిట్ దక్కాల్సిందే...
ఎందుకంటే టీమిండియా బిలియన్ డాలర్ టీమ్ క్రికెట్ ఇండస్ట్రీ... నేను ఎన్నో వరల్డ్ కప్స్ ఆడాను. అయితే ప్రతీసారీ భారత్ చేతుల్లో ఓడిపోతూ వచ్చాం. మేం వాళ్లపై గెలవగలమని తొలిసారి నిరూపించాం...
వాళ్లత పోలిస్తే మాకు ఉండే సౌకర్యాలు తక్కువ, వాళ్ల కంటే చాలా తక్కువ ప్రాక్టీస్ దొరుకుతుంది... అయినా మేం టాప్ క్లాస్ పర్ఫామెన్స్ చూపించాం. అందుకే పాకిస్తాన్ టీమ్కి ఈ విజయాల్లో క్రెడిట్ దక్కాలి...’ అంటూ కామెంట్ చేశాడు పాక్ క్రికెట్ బోర్డు ఛైర్మెన్ రమీజ్ రాజా...
అక్టోబర్ 2021కి ముందు ఇండియా, పాకిస్తాన్ జట్ల మధ్య 12 సార్లు ఐసీసీ వరల్డ్ కప్ మ్యాచులు జరిగాయి. ఇందులో ఏడు వన్డే వరల్డ్ కప్ మ్యాచుల్లో, ఐదు టీ20 వరల్డ్ కప్ మ్యాచుల్లో టీమిండియానే విజయం అందుకుంది. అయితే 2021 టీ20 వరల్డ్ కప్లో తొలిసారి భారత్పై విజయాన్ని నమోదు చేసింది పాకిస్తాన్...