- Home
- Sports
- Cricket
- టీమిండియా కంటే పాకిస్తానే బెటర్ టీమ్.. ఈసారి ఆసియా కప్ లోనూ ఇండియాకు భంగపాటు తప్పదు : రషీద్ లతీఫ్
టీమిండియా కంటే పాకిస్తానే బెటర్ టీమ్.. ఈసారి ఆసియా కప్ లోనూ ఇండియాకు భంగపాటు తప్పదు : రషీద్ లతీఫ్
India vs Pakistan: అంతర్జాతీయ క్రికెట్ లో మూడు ఫార్మాట్లలో నిలకడగా రాణిస్తూ వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా పై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ మరోసారి నోరు పారేసుకున్నాడు.

ఇండియా వర్సెస్ పాకిస్తాన్.. గడిచిన దశాబ్దకాలంలో ఇరు దేశాల సరిహద్దులలో ఏర్పడిన వివాదాల కారణంగా ద్వైపాక్షిక సిరీస్ లను నిర్వహించడం లేదు. కానీ ఐసీసీ ఈవెంట్లలో మాత్రం రెండు జట్లు తలపడుతూనే ఉన్నాయి. నాటి నుంచి భారత్ దే పైచేయిగా ఉంది.
అయితే గతేడాది దుబాయ్ లో ముగిసిన టీ20 ప్రపంచకప్ లో మాత్రం భారత్ కు ఘోర అవమానం తప్పలేదు. పాకిస్తాన్ కు ఈ విజయం దక్కినప్పట్నుంచి ఆ జట్టు మాజీ ఆటగాళ్ల నోటికి అడ్డూ అదుపూ లేకుండా పోతున్నది. ఐసీసీ ఈవెంట్లలో పాక్ పై భారత్ కే రికార్డు ఘనంగా ఉన్నా పాకిస్తాన్ మాజీలు మాత్రం మాదే పైచేయి అని జబ్బలెగరేసుకుంటున్నారు.
తాజాగా ఇదే విషయమై పాకిస్తాన్ మాజీ సారథి రషీద్ లతీఫ్ కూడా అదే పాట పాడాడు. టీమిండియా కంటే పాకిస్తానే గొప్ప జట్టని.. ఈసారి కూడా ఆసియా కప్ తో పాటు ఆసీస్ లో జరుగబోయే టీ20 ప్రపంచకప్ లో కూడా భారత జట్టును ఓడిస్తామని నోరు పారేసుకున్నాడు.
లతీఫ్ మాట్లాడుతూ.. ‘టీమిండియా మంచి బలమైన జట్టే. కానీ పాకిస్తాన్ గత కొంతకాలంగా ఆడుతున్న మ్యాచులు, సాధిస్తున్న విజయాలతో పోల్చి చూస్తే మాత్రం టీమిండియా ఆ దరిదాపుల్లో కూడా లేదు. పాకిస్తాన్ కు బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్, షాహీన్ షా అఫ్రిది వంటి వారి రూపంలో గొప్ప ఆటగాళ్లున్నారు. ప్రస్తుతం ఐసీసీ ర్యాంకులలో వీళ్లు నెంబర్ వన్ గా ఉన్నారు.
త్వరలో రాబోయే ఆసియా కప్ లో ఇతర దేశాలు పాల్గొంటున్నా ప్రధాన పోటీ మాత్రం ఇండియా-పాకిస్తాన్ మధ్యే ఉంటుంది. ఈ టోర్నీలో కూడా మేం భారత్ ను ఓడిస్తాం. గతేడాది టీ20 ప్రపంచకప్ లో భారత్ ను ఓడించిన తర్వాత పాకిస్తాన్ ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం పెరిగింది’ అని చెప్పాడు. ఆసియా కప్ తర్వాత జరగాల్సి ఉన్న టీ20 ప్రపంచకప్ లో కూడా తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేశాడు.
గతేడాది టీ20 ప్రపంచకప్ లో భారత జట్టు పాక్ మీద ఓడినా రికార్డులు మాత్రం భారత్ కే అనుకూలంగా ఉన్నాయి. టీ20లలో భారత్-పాక్ 9 మ్యాచులాడగా.. అందులో 7 సార్లు భారత్ గెలవగా రెండు సార్లు పాకిస్తాన్ నెగ్గింది. ఇక పాకిస్తాన్ జట్టులో బాబర్, రిజ్వాన్, అఫ్రిది ల గురించి రషీద్ మాట్లాడాడు. కానీ విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, బుమ్రా, రవీంద్ర జడేజాలు ఐసీసీ ర్యాంకుల్లో గతంలోనే నెంబర్ వన్ లుగా నిలిచి తమ సత్తా ఏంటో చాటుకున్నవారేనన్న విషయం మరువరాదని లతీఫ్ కు టీమిండియా అభిమానులు సూచిస్తున్నారు.
ఒక్క మ్యాచ్ గెలిచినంత మాత్రానా చరిత్రను మార్చలేరని.. రోహిత్ శర్మ నాయకత్వంలో వరుసగా 12 టీ20 విజయాలు సాధించిన విషయాన్ని మరిచిపోయారా..? అని ప్రశ్నిస్తున్నారు. టీ20 ప్రపంచకప్ కు ఇంకా చాలా సమయముందని.. ఆసియా కప్ లో ఎవరి బలమేమిటో చూసుకుందామని లతీఫ్ కు చురకలంటిస్తున్నారు.