పాకిస్తాన్ పరువు పోయింది, వాళ్లను కఠినంగా శిక్షించాలి... పీఎస్ఎల్ వాయిదాపై అక్తర్ కామెంట్స్...
ఎన్నో గొప్పలకు పోయి, పీఎస్ఎల్ 2021 సీజన్ను నిర్వహించిన పాక్ క్రికెట్ బోర్డుకు కరోనా రూపంలో ఊహించని షాక్ తగిలింది. పట్టుమని 15 మ్యాచులు కూడా పూర్తి కాకముందే, ఏకంగా ఏడుగురు క్రికెటర్లకు కరోనా పాజిటివ్ రావడంతో అప్రమత్తమైన పీసీబీ, పాక్ సూపర్ లీగ్ను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. పీఎస్ఎల్ వాయిదా పడడంపై సీరియస్ అయ్యాడు పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్...
ప్రపంచమంతా కరోనా కేసులతో వణికిపోతుంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ను విజయవంతంగా నిర్వహించి, అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది బీసీసీఐ. భారత క్రికెట్ బోర్డు నిర్వహణలో ఐపీఎల్ 2020 సూపర్ సక్సెస్ కావడంతో మిగిలిన లీగ్లు కూడా సాహసం చేశాయి...
కరోనా బ్రేక్ తర్వాత పీఎస్ఎల్ 2020 సీజన్ మళ్లీ ప్రారంభం కాగా, బిగ్బాష్ లీగ్, లంక ప్రీమియర్ లీగ్ కూడా విజయవంతంగా ముగిశాయి. అయితే ఫిబ్రవరి 20న ప్రారంభమైన పాక్ సూపర్ లీగ్ మాత్రం కరోనా కారణంగా వాయిదా పడింది...
‘పాకిస్థాన్ సూపర్ లీగ్ వాయిదా పడడం చూస్తుంటే, సెక్యూరిటీ సిబ్బంది పనితీరు ఎలా ఉందో అర్థం అవుతోంది. సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఇంత మంది ఆటగాళ్లు కరోనా బారిన పడ్డారు.
బయో సెక్యూర్ జోన్ను పకడ్బందీగా ఏర్పాటు చేయడంలో పాక్ క్రికెట్ బోర్డు విఫలమైంది. కరోనా ప్రోటోకాల్ పక్కగా అమలు చేసి ఉంటే, ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు...
పీఎస్ఎల్లో వైద్య పర్యవేక్షకులుగా ఉన్న మెడికల్ సిబ్బందిని కఠినంగా శిక్షించాలి. ఈ సంఘటనకు పీసీబీ సీఈఓ వసీం ఖాన్ను బాధ్యుడిగా చెబుతున్నారు... ఆటగాళ్ల జీవితాలతో ఆడుకుంటున్న అందరికీ శిక్ష పడాల్సింది...
పీఎస్ఎల్ వాయిదా పడడం వల్ల క్రికెట్ ప్రపంచంలో పాక్ పరువు పోయింది. ఈ విషయంపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జోక్యం చేసుకోవాలి. ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకుని, దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేయాలి...
ఆటగాళ్ల బస కోసం ఏర్పాటు చేసిన హోటళ్లల్లో వివాహాలు, విందు కార్యక్రమాలు జరుగుతున్నాయట. ఆటగాళ్లకు ఏర్పాటు చేసే ఆహారం విషయంలో కూడా విమర్శలు వస్తున్నాయి. అధికారులు ఏం చేస్తున్నారు...’ అంటూ తీవ్రంగా స్పందించాడు రావల్పిండి ఎక్స్ప్రెస్ షోయబ్ అక్తర్.