వాన నుంచి క్రికెట్ ను కాపాడాలంటే అదొక్కటే మార్గం : గిల్ కొత్త ప్రతిపాదన
టీమిండియా ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉంది. కానీ అక్కడ కురుస్తున్న వర్షాలు మ్యాచ్ లకు అంతరాయం కలిగిస్తున్నాయి. టీ20 సిరీస్ తో పాటు వన్డే సిరీస్ లో కూడా వరుణుడు ఫలితాలు తేలని మ్యాచ్ లకు కారణమవుతున్నాడు.
ఇటీవలే ఆస్ట్రేలియా వేదికగా ముగిసిన టీ20 ప్రపంచకప్ లో పలు అగ్రజట్ల ఫలితాలు తారుమారు చేసి వాటిని గ్రూప్ స్టేజ్ లోనే నిష్క్రమించేందుకు కారణమైన వరుణుడు.. టీమిండియా న్యూజిలాండ్ పర్యటనలో కూడా విలన్ గా మారాడు.
ఈ పర్యటనలో భారత్ మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడటానికి వచ్చింది. అయితే వర్షం కారణంగా టీ20 సిరీస్ లో తొలి మ్యాచ్ వర్షార్ఫణమైంది. రెండో మ్యాచ్ ఒక్కటే సజావుగా సాగింది. మూడో మ్యాచ్ కు పలు మార్లు అంతరాయం కల్పించిన వరుణుడు.. కివీస్ ఇన్నింగ్స్ ముగిసి భారత్ ఇన్నింగ్స్ 9 ఓవర్ల వరకు మాత్రమే ఛాన్స్ ఇచ్చాడు. తర్వాత ఎడతెరిపి లేని వర్షం కురిడయంతో మ్యాచ్ ముందుకు సాగలేదు.
టీ20 సిరీస్ సంగతి అలా ఉంటే వన్డే సిరీస్ లో కూడా వరుణుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఆక్లాండ్ లో ముగిసిన తొలి వన్డే ఒక్కటి సజావుగా సాగగా రెండో వన్డే కు వాన అంతరాయం కలిగించడంతో ఒక్క ఇన్నింగ్స్ కూడా ముగియకుండానే మ్యాచ్ అర్థాంతరంగా ఆగిపోయింది. మూడో వన్డే కూ వర్షం ముప్పు ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
అయితే వర్షం వల్ల మ్యాచ్ లు ఆగిపోవడం సగటు అభిమానితో పాటు క్రికెటర్లకు కూడా చిరాగ్గా ఉంది. ఈ విషయంలో చేయాల్సిందేమీ లేకపోయినా పలువురు ఆటగాళ్లు తమ అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తపరుస్తున్నారు. తాజాగా శుభమన్ గిల్ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
రెండో వన్డే తర్వాత గిల్ పాత్రికేయులతో మాట్లాడుతూ.. ‘ఈ సిరీస్ తో పాటు టీ20 ప్రపంచకప్ లో కూడా వర్షం కీలక మ్యాచ్ లకు అంతరాయం కలిగించడం ఫ్యాన్స్ ను నిరాశకు గురి చేసింది. దీని నుంచి తప్పించుకోవడానికి ఒక్కటే మార్గం. మ్యాచ్ లను ఇండోర్ స్టేడియాలలో ఆడించాలి.
ఈ విషయంలో బోర్డులు నిర్ణయం తీసుకోవాలి. ఒక ఆటగాడిగానే గాక క్రికెట్ ఫ్యాన్ గా కూడా మ్యాచ్ లకు వర్షం అంతరాయం కలిగించడం చాలా ఫ్రస్ట్రేషన్ గా ఉంది. రూఫ్ తో కూడిన క్లోజ్డ్ డోర్ స్టేడియాలలో మ్యాచ్ లను ఆడిస్తే ఫలితాలు తేలుతాయి..’ అని అన్నాడు.
వన్డే సిరీస్ లో ఆడుతున్న గిల్ తొలి వన్డేలో హాఫ్ సెంచరీ చేశాడు. రెండో వన్డేలో కూడా 42 బంతుల్లో 45 పరుగులు చేసి జోరుమీదున్నాడు. ఇక వన్డే క్రికెట్ లో ఏ జట్టు కూడా ప్రతీసారి 400 ప్లస్ స్కోరు చేయదని, ఏడాదిలో రెండు మూడు సార్లు మాత్రమే అలా జరుగుతుందని అన్నాడు. తనవరకైతే 300 ప్లస్ స్కోరు చేసినా మ్యాచ్ లను గెలవగలమని, అది నార్మల్ టార్గెట్ అయితే కాదని అభిప్రాయపడ్డాడు.