హిట్మ్యాన్తో పాటు అతడూ ఔట్.. రెండో టెస్టుకు ముందు బీసీసీఐ కీలక ప్రకటన
BANvsIND Test: తొలి టెస్టుకు మిస్ అయినా రెండో టెస్టు వరకైనా అందుబాటులోకి వస్తాడనుకున్న రోహిత్ శర్మ.. ఇంకా ముంబైలోనే ఉన్నాడు. అతడు రెండో టెస్టు ఆడడని బీసీసీఐ ఇది వరకే ప్రకటించింది. తాజాగా మరో ఆటగాడు సైతం రెండో టెస్టుకు దూరమయ్యాడు.
బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న భారత జట్టుకు గాయాల బెడద తప్పడంలేదు. సిరీస్ ప్రారంభానికి ముందే గాయం కారణంగా ఈ టూర్ కు రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ గాయంతో వైదొలిగారు. రెండో వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడ్డాడు. గాయాల నేపథ్యంలో జట్టులో పలు మార్పులు కూడా చేసింది బీసీసీఐ.
తొలి టెస్టుకు మిస్ అయినా రెండో టెస్టు వరకైనా అందుబాటులోకి వస్తాడనుకున్న హిట్ మ్యాన్ రోహిత్ శర్మ.. ఇంకా ముంబైలోనే ఉన్నాడు. అతడు రెండో టెస్టు ఆడడని బీసీసీఐ ఇది వరకే ప్రకటన చేసింది. తాజాగా మరో ఆటగాడు నవదీప్ సైనీ కూడా ఈ మ్యాచ్ కు అందుబాటులో ఉండటం లేదని తెలిపింది. ఈ విషయాన్ని బీసీసీఐ మంగళవారం ధృవీకరించింది.
రోహిత్ శర్మ ఇంకా గాయం నుంచి కోలుకోలేదని, ప్రస్తుతం అతడు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడని పేర్కొన్న బీసీసీఐ.. నవదీప్ సైనీ పొట్ట కండరాల గాయంతో బాధపడుతున్నాడని పేర్కొంది. మహ్మద్ షమీ గాయపడటంతో భారత జట్టు నవదీప్ సైనీని జట్టులోకి తీసుకుంది. అయితే గాయం తర్వాత సైనీ.. జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ - బెంగళూరు) కి వెళ్తాడని బీసీసీఐ ప్రకటించింది.
ఇక రోహిత్ గాయపడటంతో రెండో టెస్టుకూ కెఎల్ రాహుల్ సారథిగా వ్యవహరించనున్నాడు. తొలి టెస్టులో మొదట తడబడ్డా తర్వాత పుజారా, అయ్యర్, అశ్విన్ ల బ్యాటింగ్ తో పాటు సిరాజ్, కుల్దీప్, అక్షర్ ల బౌలింగ్ తో బంగ్లాను దెబ్బతీసింది.
భారత్ - బంగ్లాదేశ్ ల మధ్య రెండో టెస్టు డిసెంబర్ 22 నుంచి జరగాల్సి ఉంది. ఢాకా వేదికగా జరిగే ఈ టెస్టులో గెలిచి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాలని టీమిండియా భావిస్తున్నది. ఈ సిరీస్ లో గెలిచి ఫిబ్రవరిలో ఆస్ట్రేలియా సిరీస్ లో మూడు మ్యాచ్ లను గెలిచినా భారత జట్టు వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ లో ఫైనల్ కు అర్హత సాధించే అవకాశముంది.
ఢాకా టెస్టుకు భారత జట్టు ఇదే.. కెఎల్ రాహుల్ (కెప్టెన్), శుభమన్ గిల్, ఛతేశ్వర్ పుజారా (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషభ్ పంత్, కెఎస్ భరత్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్, మహ్మద్ సిరాజ్, అభిమన్యు ఈశ్వరన్, సౌరభ్ కుమార్, జయదేవ్ ఉనద్కత్