- Home
- Sports
- Cricket
- నన్నెవరూ మెచ్చుకోవడం లేదు.. నాకే సిగ్గుగా ఉంది.. : ముంబై రంజీ కెప్టెన్ షాకింగ్ కామెంట్స్
నన్నెవరూ మెచ్చుకోవడం లేదు.. నాకే సిగ్గుగా ఉంది.. : ముంబై రంజీ కెప్టెన్ షాకింగ్ కామెంట్స్
Prithvi Shaw: రంజీ ట్రోఫీలో భాగంగా ముంబై జట్టు 47వ ఫైనల్ ఆడుతున్నది. అయితే ఈ సీజన్ లో తాను బాగా ఆడినా తననెవరూ మెచ్చుకోవడం లేదంటున్నాడు ముంబై రంజీ సారథి పృథ్వీ షా.

జాతీయ జట్టులో స్థానం కోల్పోయి తంటాలు పడుతున్న ముంబై జట్టు రంజీ కెప్టెన్ పృథ్వీ షా దేశవాళీలో కూడా పెద్దగా రాణించడం లేదు. ప్రస్తుత రంజీ సీజన్ లో కూడా అతడు పెద్దగా మెరుపులు మెరిపించిన దాఖలాలు లేవు. తన తోటి సహచరులు సర్పరాజ్ ఖాన్, యశస్వి జైస్వాల్ లు చెలరేగుతుంటే షా మాత్రం విఫలమవుతున్నాడు.
ఈ సీజన్ లో షా.. కేవలం 3 హాఫ్ సెంచరీలు మాత్రమే చేశాడు. ఈ నేపథ్యంలో అతడు తన ఫామ్ పై కీీలక వ్యాఖ్యలు చేశాడు. తన బ్యాటింగ్ చూస్తే తనకే బాధ కలుగుతుందని.. తననెవరూ మెచ్చుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అయితే క్రికెట్ లో ఇలా జరగడం మామూలే అని సర్ది చెప్పుకుంటున్నాడు.
రంజీ ఫైనల్స్ లో భాగంగా మధ్యప్రదేశ్ తో మ్యాచ్ కు ముందు షా మాట్లాడుతూ.. ‘నేను ఈ సీజన్ లో 3 ఫిఫ్టీలు చేశాను. అయితే అది నాకు చాలదు. నేను అర్థ శతకం చేసి డ్రెస్సింగ్ రూమ్ కు తిరిగొస్తే కనీసం ఒక్కరూ కూడా అభినందించలేదు. నేను బాగా ఆడానని ఒక్కరు కూడా అనలేదు. అది చూసినప్పుడు నామీద నాకే బాధ కలిగింది..’ అని ఫన్నీగా చెప్పాడు.
అంతేగాక.. ‘క్రికెట్ లో ఇలా జరగడం మామూలే. ఆటలో ఎత్తు పల్లాలుంటాయి. కానీ నేను నా ఒక్కడి గురించే ఆలోచిస్తే కుదరదు. నా జట్టు మొత్తం గురించి కూడా ఆలోచించాలి. క్రికెట్ లో గానీ జీవితంలో గానీ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. మన కెరీర్ గ్రాఫ్ ఎప్పుడూ పైకే వెళ్లడం ఉండదు. నేను తిరిగి ఫామ్ పొందడం అనేది పెద్ద విషయం కాదు. నేను త్వరలోనే పాత ఫామ్ ను పొందుతాను..’ అని చెప్పాడు.
ఇక టీమిండియాలో చోటు గురించి షా ను ప్రశ్నించగా.. ప్రస్తుతం తాను దాని గురించి ఆలోచించడం లేదని, తమ జట్టుకు రంజీ ట్రోఫీ గెలవడమే ముఖ్యమని చెప్పాడు. ‘ఇప్పుడైతే నేను దాని గురించి ఆలోచించడం లేదు. నా దృష్టంతా రంజీ ట్రోఫీ గురించే. అందుకు మేం సన్నద్ధమయ్యాం.. ఈసారి మళ్లీ రంజీ ట్రోఫీ గెలిచి తీరుతాం’ అని ధీమా వ్యక్తం చేశాడు.
ఈ సీజన్ లో షా.. బ్యాట్ తో పెద్దగా రాణించడంలో విఫలమయ్యాడు. కానీ సర్పరాజ్ ఖాన్ మాత్రం 7 ఇన్నింగ్స్లలో 3 సెంచరీలు, 2 అర్ధసెంచరీలతో ఏకంగా 803 పరుగులు చేశాడు. మరోవైపు యశస్వి జైస్వాల్ (419) కూడా సత్తా చాటుతున్నాడు. రంజీ సెమీస్ లో భాగంగా అతడు యూపీతో ఒకే మ్యాచ్ లో రెండు సెంచరీలు చేయడం విశేషం. వీళ్దిద్దరితో పాటు అర్మాన్ జాఫర్, సువేద్ పార్కర్ కూడా కీలక పరుగులతో ముంబైని నడిపిస్తున్నారు.